ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి రైతుకు చివరకు చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి సైతం ఇబ్బందులు తప్పడం లేదు. ఓ వైపు వ్యవసాయాధికారుల తప్పిదం, మరోవైపు సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొర్రీలతో పత్తి రైతు చిత్తవుతున్నాడు. గతేడాది సీసీఐ కొనుగోలు కేంద్రాల కంటే ప్రైవేట్ కొనుగోలు కేంద్రాల్లోనే అధిక ధరలు ఉండడంతో రైతులు ఎలాంటి సమస్యలు లేకుండా పత్తిని విక్రయించారు. ఈసారి సీసీఐ కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుండడంతో రైతులంతా ఆ కేంద్రాలకు పోటెత్తుతున్నారు.
కాగా, పంటల నమోదు సమయంలో అధికారుల చేసిన పొరపాట్లు పత్తి విక్రయానికి ఆటంకంగా మారుతున్నాయి. ఒక రైతు సాగు చేసిన పత్తి పంట విస్తీర్ణం, వచ్చిన దిగుబడి ఆధారంగానే సీసీఐ పత్తిని కొనుగోలు చేస్తున్నది. రైతులు అధిక విస్తీర్ణంలో పత్తిని సాగు చేసినప్పటికీ తక్కువ విస్తీర్ణంలో సాగు చేసినట్లు ఆన్లైన్లో నమోదు చేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఆన్లైన్లో నమోదైన పత్తి సాగు విస్తీర్ణం ప్రకారం ఎంత దిగుబడి వస్తుందో అంత మేరకే సీసీఐ పత్తిని సేకరిస్తూ, మిగతాది కొనుగోలు చేయడం లేదు. దీంతో అన్నదాతలు సీసీఐ కేంద్రాల్లో పడిగాపులు పడుతూ అసౌకర్యానికి గురవుతున్నారు. మరికొంతమంది రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు. పత్తి రైతుల గోస చూసి కలెక్టర్ నారాయణరెడ్డి వ్యవసాయ విస్తరణ అధికారులు, ఆర్ఐలు ఇచ్చే ధ్రువీకరణ పత్రాల ఆధారంగా పత్తిని కొనాలని సీసీఐ అధికారులను ఆదేశించారు.
వికారాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి రైతుకు చివరకు నష్టాలే మిగులుతున్నాయి. ఓవైపు వ్యవసాయాధికారుల తప్పిదం, మరోవైపు సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొర్రీలతో పత్తి రైతు చిత్తవుతున్నాడు. పంటకు పెట్టిన పెట్టుబడితోపాటు లాభాలు వస్తాయనుకున్న పత్తి రైతులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. గత ఏడాది సీజన్లో సీసీఐ కొనుగోలు కేంద్రాల కంటే ప్రైవేట్ కొనుగోలు కేంద్రాల్లోనే అధిక ధర ఉండడంతో రైతులంతా ప్రైవేట్ కేంద్రాల్లోనే పత్తిని విక్రయించారు. ఈ ఏడాది మాత్రం ప్రైవేట్ కేంద్రాల్లో తక్కువ మద్దతు ధర ఉండగా, సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అధిక మద్దతు ధరతో పత్తిని సేకరిస్తున్నారు.
దీంతో రైతులంతా సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పత్తిని విక్రయించేందుకు తీసుకువస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అధిక ధర ఉందని ఆశపడిన పత్తి రైతులకు సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద నిరాశే మిగులుతున్నది. పత్తిని సాగు చేసే సమయంలో వ్యవసాయాధికారులు పంటల నమోదు కార్యక్రమంలో భాగంగా ఏ రైతు ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారనే వివరాలతోనే సీసీఐ రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తున్నది. పంటల నమోదు కార్యక్రమంలో వ్యవసాయాధికారులు చేసిన తప్పిదాలతో రైతులు అధిక మొత్తంలో పత్తిని సాగు చేసినప్పటికీ.. తక్కువ విస్తీర్ణంలో పత్తిని సాగు చేసినట్లు ఆన్లైన్లో నమోదు చేయడంతో ప్రస్తుతం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో అంతమేరకే పత్తిని సేకరిస్తూ, మిగతా పత్తిని కొనుగోలు చేయడంలేదు.
జిల్లాలో చాలా వరకు 10 ఎకరాల్లో పత్తి సాగు చేసినా కూడా ఆన్లైన్లో మాత్రం రెండు ఎకరాలు సాగు చేసినట్లు ఉండడంతో మిగతా 8 ఎకరాల్లో వచ్చిన పత్తిని ప్రైవేట్ కేంద్రాల్లో తక్కువ ధరకు విక్రయించాల్సిన పరిస్థితి నెలకొన్నది. కొందరు రైతులు కూడా నిర్లక్ష్యంతో వారు సాగు చేసే పంటల వివరాలను వ్యవసాయాధికారులకు తెలుపకపోవడం కూడా ప్రస్తుతం నష్టాలకు కారణంగా చెప్పవచ్చు. పత్తి రైతుల గోస చూసి కలెక్టర్ నారాయణరెడ్డి స్పందించి వ్యవసాయ విస్తరణ అధికారులు, ఆర్ఐలు ఇచ్చే ధ్రువీకరణ పత్రాల ఆధారంగా పత్తిని రైతుల నుంచి కొనుగోలు చేయాలని సీసీఐ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ ఆదేశాలతో ఆన్లైన్ పంటల విస్తీర్ణం నమోదుకాని రైతులకు మేలు జరుగుతున్నది తప్ప ఎక్కువ విస్తీర్ణంలో పత్తిని సాగు చేసినప్పటికీ తక్కువ విస్తీర్ణంలో సాగైనట్లు ఆన్లైన్లో నమోదైన వివరాలను మాత్రం మార్చేందుకు వీలు లేకపోవడంతో పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తిని కొనుగోలు చేస్తారేమోనని సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్దనే కొందరు రైతులు పడిగాపులు పడుతుండగా, మరికొందరు రైతులు ఏమీ చేయలేక తక్కువ ధరకే ప్రైవేట్ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తూ నష్టపోతున్నారు.
సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి మద్దతు క్వింటాలుకు రూ.7020 ఉండగా, ప్రైవేట్ కొనుగోలు కేంద్రాల్లో రూ.6600 పలుకుతున్నది. మరోవైపు సీసీఐ కేంద్రాల్లో పడుతున్న ఇబ్బందులతో కొందరు రైతులు గ్రామాల్లోనే రూ.6400లకే దళారులకు పత్తిని విక్రయిస్తూ నష్టపోతున్నారు. ఆరంభంలో అధిక వర్షాలతో కొంతమేర నష్టపోయిన పత్తి రైతులు.. ఇప్పుడు సీసీఐ పెడుతున్న కొర్రీలతో మరింత నష్టపోతున్నారు.
పత్తిని రైతుల నుంచి సేకరించేందుకు జిల్లావ్యాప్తంగా 13 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాండూరులో మారుతీ, శుభం, బాలాజీ కొనుగోలు కేంద్రాలు, కోట్పల్లిలో సాయిబాబా కాటన్ ఆగ్రో ఇండస్ట్రీస్, పరిగిలో లక్ష్మీ వెంకటేశ్వర, నరసింహ, రాకంచర్ల కాటన్మిల్, వికారాబాద్లో ధరణి, సాయిబాబా, అయ్యప్ప జిన్నింగ్ మిల్లు, మర్పల్లిలో శ్రీఅయ్యప్ప కాటన్ ట్రేడర్స్, కొడంగల్లో విజయ్ ఇండస్ట్రీస్ జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలతోపాటు ప్రైవేట్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
గతేడాది 2.50 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. ఈ ఏడాది 2.80 లక్షల క్వింటాళ్ల పత్తిని సేకరించడమే లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 26,999 క్వింటాళ్ల పత్తిని రైతుల నుంచి సేకరించారు. అత్యధికంగా తాండూరులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 17,504 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయగా, కొడంగల్లో 5986 క్వింటాళ్లు, వికారాబాద్లో 811 క్వింటాళ్లు, కోట్పల్లిలో 2551 క్వింటాళ్లు, ధారూరులో 146 క్వింటాళ్ల పత్తిని రైతుల నుంచి సేకరించారు. పత్తిని విక్రయించిన రైతులకు మూడు రోజుల్లోగా వారి బ్యాంకు ఖాతాల్లో చెల్లింపులను జమ చేస్తున్నారు. ఇప్పటివరకు రైతులు విక్రయించిన పత్తికి సంబంధించి రూ.10 కోట్లమేర చెల్లింపులు చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
మేము 4.13 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశాం. మంచి దిగుబడి వచ్చింది. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో మంచి ధర ఉందని తీసుకొచ్చాం. ఆన్లైన్లో కేవలం ఒక్క ఎకరా మాత్రమే నమోదై ఉందని.. ఎకరా విస్తీర్ణంతో వచ్చే పత్తిని మాత్రమే తీసుకున్నారు మిగతా పత్తిని తీసుకోవడంలేదు. రెండు రోజులుగా పడిగాపులు కాస్తున్నాం. అధికారులు చేసిన తప్పిదాలతో రైతులను ఎందుకు ఇబ్బందులు పెడతారు. ప్రభుత్వం స్పందించి రైతులు పండించిన పత్తి మొత్తాన్ని కొనుగోలు చేయాలి.
– బర్కత్పల్లి శేఖర్, సిద్దులూరు