పరిగి : రైతుల పొలాల వద్ద కల్లాల నిర్మాణాలు ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాలు నుంచి కల్లాల నిర్మాణం, వైకుంఠధామాల నిర్మాణం, వాటి చెల్లింపులు తదితర అంశాలపై ఎంపీడీవోలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తమ పొలాల వద్ద కల్లాల నిర్మాణం కోసం ముందుకు వచ్చే రైతుల జాబితాను వెంటనే అందజేయాల్సిందిగా సూచించారు. అన్ని మండలాల్లో కల్లాల నిర్మాణ పనులు వేగవంతం చేసి ఈ నెల 31వ తేదీ వరకు వందశాతం పూర్తయ్యేలా చూడలన్నారు.
పనులలో పురోగతి లేక వెనుకబడిన మండలాల అధికారులు పండుగ సెలవు రోజులలోను పనిచేసి పనులను వందశాతం పూర్తి చేయించాలని చెప్పారు. జిల్లా పరిధిలో ఇప్పటివరకు నిర్మాణ పనులు చేపట్టిన వైకుంఠధామాలకు సంబంధించిన ఎఫ్టీవోలు నేటికీ అప్లోడ్ చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి అసంపూర్తి పనులు మంగళవారం వరకు పూర్తి చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. వెంటనే కాంట్రాక్టర్లకు డబ్బులు అందేలా ఎఫ్టీవోలు ఆన్లైన్లో అప్లోడ్ చేయించాలని చెప్పారు. ప్రత్యేక టీమ్లు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతుందని అన్నారు. పనులు పూర్తయ్యే వరకు విస్తృతంగా సమీక్షలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
పనులు పూర్తయ్యే వరకు ఎవరికీ సెలవులు మంజూరు చేయబడవని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీఆర్డీవో కృష్ణన్, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, డీపీవో మల్లారెడ్డి, డివిజనల్ పంచాయతీ అధికారి అనిత పాల్గొన్నారు.