వికారాబాద్, మార్చి 1: రైతుల భూములకు సంబంధించి ధరణి స్పెషల్ డ్రైవ్ ఈ నెల ఒకటి నుంచి తొమ్మిదో తేదీ వరకు కొనసాగు తుందని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సంబంధిత శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదో తేదీ వరకు ధరణి మాడ్యూల్స్ను పూర్తి చేసేలా రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంటున్నదన్నారు. అదేవిధంగా వివిధ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. విద్యాశాఖ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మొబైల్ ఫోన్లను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించొద్దని.. ఎంపీడీవో లు, ఎంపీవోలను స్పెషల్ అధికారులుగా నియమించామన్నారు.
జిల్లాలో మంజూరైన సీసీ రోడ్ల పనులను పెండింగ్లో ఉంచకుండా మార్చి 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సీసీ రోడ్ల పనులకు ప్రతిరోజూ టార్గెట్ పెట్టుకుని నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మండలాలవారీగా సీసీ రోడ్ల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఎఫ్టీవో జనరేట్ చేస్తూ గ్రామాల్లో లేబర్ సమావేశాలు నిర్వహించి..లేబర్ను మొబిలైజ్ చేస్తూ గ్రామస్తులకు ఉపయోగపడే పనులు చేయించాలన్నారు. ఈ కాన్ఫరెన్స్లో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఉమేశ్, శ్రీరాములు, డీఈలు, అధికారులు పాల్గొన్నారు.