వికారాబాద్, జనవరి 29 : వికారాబాద్ దేశ వ్యాప్తంగా జంతు సంరక్షణ పక్షోత్సవాలు ఈనెల 14 నుంచి 30 వరకు జరుపుకొంటున్న సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పశు వైద్య, పశు సంవర్ధక అధికారి, ఆయా జిల్లా అధికారులతో కలిసి జంతు సంరక్షణ పక్షోత్సవాల కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ జంతు హింసకు పాల్పడకుండా, కరుణతో ఉంటూ వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జిల్లాలో జంతు సంరక్షణకు సేవచేయు వారికి , స్వచ్ఛంద సంస్థలకు ప్రతి పౌరుడు సహకరించాలన్నారు.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడాలని, వన్యప్రాణులు కనిపించినట్లయితే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి సహకరించాలని సూచించారు. పక్షులు నివసించే ఆవాసాలైన వృక్షాలను నరకరాదని, అదేవిధంగా పశువులు, జంతువులను రవాణా చేసే క్రమంలో తప్పనిసరిగా జంతు రవాణా నిబంధనలను పాటించాలన్నారు. వీధుల్లో తిరిగే కుక్కలు, పిల్లులు, ఆవులు తదితర జంతువులపై కరుణతో వ్యవహరించి వాటికి ఆహారం, తాగునీరు అందించాలని తెలిపారు. పెంపుడు జంతువులను అమ్ముట, కొనుట వాటి సంతాన అభివృద్ధి (బ్రీడింగ్) చేయడం ద్వారా వ్యాపారం చేయువారు తప్పని సరిగా జంతు సంరక్షణ బోర్డు నుంచి రిజిస్ట్రేషన్ పొందాలని సూచిస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్షార్హులు అవుతారన్నారు. ప్రజలు ప్లాస్టిక్ కవర్లను వాడకూడదన్నారు. వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో జంతు సంరక్షణ, సంక్షేమంపై నిర్వహించిన వ్యాస రచన పోటీలో గెలుపొందిన 6, 7, 8, 9, 10వ తరగతి విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ, వికారాబాద్ జిల్లా తరఫున స్కూల్ విద్యార్థులకు జంతు సంరక్షణపై అవగాహన కల్పించారు. జామూన్, వేప, రావి ఇతర మొక్కలను నాటాలన్నారు. ప్రతి పశు వైద్యశాలలో పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబీస్ వ్యాధి నిరోధక టీకాలు వేస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, పశుసంవర్ధక శాఖ అధికారి అనిల్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.