వికారాబాద్, ఫిబ్రవరి 9 : 2022-23 వానకాలం, యాసంగి సీజన్లలో సీఎంఆర్ మిగులు బియ్యాన్ని ఎఫ్సీఐకి వెంటనే డెలివరీ చేయాలని జిల్లా ఆదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో సీఎంఆర్ రైస్ డెలివరీపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022-23 సంవత్సరానికి సంబంధించిన వానకాలం, యాసంగి మిగులు సీఎంఆర్ బియ్యాన్ని ఈనెల 29 వరకు ఎఫ్సీఐ కి డెలివరీ చేయాలని ఆదేశించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మిల్లర్లు ఎవరైనా రీసైక్లింగ్కు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు తమ పరిధిలోని మిల్లర్లను సంప్రదించి వారి సామర్థ్యం మేరకు సీఎంఆర్ డెలివరీ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లుల్లో ప్రస్తుతం నిల్వ ఉన్న ధాన్యాన్ని పరిశీలించి ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ కొండల్రావు, డిప్యూటీ తహసీల్దార్లు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలేశ్వర గుప్తా, శ్రీధర్రెడ్డి, మిల్లర్ల యజమానులు పాల్గొన్నారు.