రంగారెడ్డి, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ సంకల్ప బలంతోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పర్యావరణ అనుమతులకు లైన్ క్లియర్ అయ్యిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మీర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు పచ్చబడనున్నాయన్నారు. సీఎం కేసీఆర్ పట్టువదలని విక్రమార్కుడన్నారు. సాధ్యం కాదనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును ఆయన మూడేండ్లల్లోనే సాకారం చేసి చూపించారన్నారు. అదే సంకల్పంతో సీఎం కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతలను కూడా త్వరగా పూర్తి చేస్తారన్న విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే ప్రజల దశాబ్దాల కల నెరవేరనున్నదని చెప్పారు. ముఖ్యమంత్రికి ఉమ్మడి జిల్లా ప్రజల తరఫున మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
‘పాలమూరు-రంగారెడ్డి’ పర్యావరణ అనుమతులకు ఈఏసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఉమ్మడి జిల్లాలో సంబురాలు అంబరాన్నంటాయి. మంత్రి సబితారెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.