ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు షురూ అయ్యాయి. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ సంబురాల్లో టీఆర్ఎస్ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మొదటి రోజు మంగళవారం ప్రభుత్వ దవాఖానలు, అనాథాశ్రమాల్లో పండ్లు, దుస్తులు పంపిణీ చేయడంతోపాటు అన్నదానాలు చేశారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం వినోభానగర్లోని స్పూర్తి ఫౌండేషన్ ఆశ్రమంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొనగా.. ధారూర్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్ పాల్గొన్నారు.
-రంగారెడ్డి, ఫిబ్రవరి 15, (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, ఫిబ్రవరి 15, (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మూడు రోజులపాటు నిర్వహించనున్న జన్మదిన వేడుకల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు మొదటి రోజు జిల్లాలోని ప్రభుత్వ దవాఖాన, అనాథ ఆశ్రమాల్లో పండ్లు పంపిణీ కార్యక్రమంతోపాటు అన్నదానం చేశారు. చేవెళ్ల పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు ఎమ్మెల్యే కాలె యాదయ్య పండ్లు పంపిణీ చేశారు. షాద్నగర్ పట్టణం శివారులోని ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ నీడ్ అనాథ ఆశ్రమంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పండ్లు పంపిణీ చేయగా, ఇబ్రహీంపట్నంలోని స్ఫూర్తి ఫౌండేషన్లోని అంధులకు బట్టలు, పండ్లను పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ దవాఖాన, అనాథ ఆశ్రమాల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తల ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. నేడు జిల్లాలోని అన్ని మండల కేంద్రం, మున్సిపాలిటీ కేంద్రాల్లో రక్తదాన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రేపు జిల్లాలోని అన్ని దేవాలయాల్లో సీఎం కేసీఆర్ పేరిట పూజలు, క్షీరాభిషేకం కార్యక్రమాలను నిర్వహించేందుకు టీఆర్ఎస్ పార్టీ జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతున్నది.
పరిగి, ఫిబ్రవరి 15 : సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు మంగళవారం ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లాలో మూడు రోజులపాటు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు మంగళవారం వికారాబాద్ నియోజకవర్గం ధారూర్లో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ప్రారంభించారు. ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఆయన కోరారు. జిల్లాలోని తాండూరులోని జిల్లా దవాఖానలో ఎమ్మెల్సీ పి.మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పరిగిలోని ప్రభుత్వ దవాఖానలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి రోగులకు పండ్లు, దుప్పట్లు అందజేశారు. అనంతరం కులకచర్లలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో రైతులకు అన్నదాన కార్యక్రమాన్ని డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ప్రారంభించారు. జిల్లాలోని కొడంగల్లోని సర్కారు దవాఖానలో రోగులకు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పండ్లు వితరణ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో జీవించి రాష్ర్టానికి మరో రెండు దశాబ్దాలకు పైగా సీఎంగా పనిచేయాలని పలువురు ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే రాష్ట్రం అనేక రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తుందన్నారు. అనేక సంక్షేమ పథకాల అమలుతో సీఎం కేసీఆర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వారు పేర్కొన్నారు. రెండో రోజు బుధవారం జిల్లాలోని పలుచోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.