కందుకూరు, జూలై 17: ‘రైతుబీమా’ పథకం రైతుతోపాటు రైతు కుటుంబాలకు భరోసానిస్తున్నది. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రతి సీజన్ అదునులో రాయితీపై విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. పంటలకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారు. రైతుబంధులో భాగంగా ఏడాదిలో ఎకరానికి రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ప్రమాదవశాత్తు రైతు మృతిచెందితే ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో 2018 ఆగస్టు 15 నుంచి ‘రైతుబీమా’ పథకాన్ని అమలు చేస్తున్నది. ఒక్కో రైతుకు రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ఈ మేరకు ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)’కు ప్రీమియం చెల్లిస్తున్నది. రైతు ఏ కారణంతో మృతిచెందినా సరే మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున వారం రోజుల వ్యవధిలోనే పరిహారం అందుతున్నది. ఎలాంటి పైరవీ అవసరం లేకుండా నేరుగా రైతు కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఇప్పటివరకు కందుకూరు మండల పరిధిలో 257 మంది రైతులు వివిధ కారణాలతో మృతిచెందగా వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.12.85కోట్ల పరిహారం అందింది. ప్రస్తుతం ఈ ఏడాది జూన్ 18 లోపు పాస్ పుస్తకాలు పొందిన రైతుల నుంచి వ్యవసాయశాఖ బీమా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. రైతులు వచ్చే నెల 5 లోపు ఏఈవోలకు దరఖాస్తులు అందజేయాలని సూచించింది. దీంతో ఆపత్కాలంలో తమకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని రైతులు పేర్కొంటున్నారు.
గుంట భూమి ఉన్నా..
గుంట భూమి ఉన్న రైతు ఏ కారణంతో మృతిచెందినా రూ.5లక్షలు చెల్లిస్తున్నాం. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి. రైతు సమస్యలు తెలిసిన నాయకుడు కాబట్టి రైతు బీమా ప్రీమి యం ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
– మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రైతుల సంక్షేమానికి కృషి
నిరంతరం రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు రైతులు రుణపడి ఉంటారు. గుంట భూమి ఉన్న రైతు కూడా ఏ కారణంతో మృతిచెందినా.. ఎలాంటి పైరవీలు లేకుండా నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాల్లో రూ.5లక్షలు జమ అవుతున్నాయి. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు రైతుల రుణపడి ఉంటారు.
– సోలిపేట అమరేందర్రెడ్డి,రైతు విభాగం అధ్యక్షుడు కందుకూరు మండలం
257 కుటుంబాలకు పరిహారం..
కందుకూరు మండల పరిధిలోని 35 గ్రామ పంచాయతీలతో పాటు అనుబంధ గ్రామాల్లో ఏ కారణంతో రైతు మృతిచెందినా కొద్దిరోజుల్లోనే బాధిత కుటుంబానికి రూ.12.85కోట్లను ప్రభుత్వం అందజేసింది. ప్రభుత్వమే ప్రతి ఏటా రైతుల పేరిట ఎల్ఐసీ ప్రీమియం డబ్బులను చెల్లిస్తూ బీమా సౌకర్యం కల్పిస్తున్నది. అర్హులైన ప్రతి కుంటుంబానికి బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నాం. బీమా చేసుకోని రైతులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.. సద్వినియోగం చేసుకోవాలి.
– లావణ్య, మండల వ్యవసాయ అధికారి