“పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చితీరుతాం.. షాద్నగర్ వరకు మెట్రో రైలు విస్తరణ, మెడికల్, పీజీ కాలేజీలను ఏర్పాటు చేసే బాధ్యత నాదే.. ఇచ్చిన మాట ప్రకారం 111 జీవోను ఎత్తివేశాం.. దీంతో చేవెళ్లలో పరిశ్రమల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థలు క్యూ కడుతున్నాయి.. చేవెళ్ల నియోజకవర్గం మొత్తానికి ఒకే విడుతలో దళితబంధు అందిస్తాం.. ” అని సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల, షాద్నగర్ సెగ్మెంట్లలో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు ఆయన హాజరై ప్రసంగించారు.
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వస్తే షాద్నగర్ నియోజకవర్గానికి నెత్తిమీద కుండ ఉన్నట్లేనన్నారు. షాద్నగర్ ప్రాంతం ఒకప్పుడు నీళ్లకు గోసపడి ఏడ్చిన ప్రాంతమని, పదేండ్లలో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. చేవెళ్లలోని దళితవాడల నుంచి దరిద్రాన్ని దళితబంధుతో పారదోలుతామన్నారు. రైతుబంధు వేయకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారన్నారు. ఆ పార్టీ నేతలకూ కూడా దళితబంధు వస్తున్నమాట నిజం కాదా.. అన్ని ప్రశ్నించారు. ప్రజలు రాయి ఏదో.. రత్నమేదో గుర్తించి ఓటేయాలన్నారు. 24 గంటల కరెంటు కావాలన్నా.. రైతుబంధు 16వేలకు పెరగాలన్నా బీఆర్ఎస్ అభ్యర్థులు కాలె యాదయ్య, అంజయ్య యాదవ్లను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు.
-రంగారెడ్డి, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, నవంబర్ 27(నమస్తే తెలంగాణ)/షాద్నగర్ : షాద్నగర్కు మెడికల్, ప్రభుత్వ పీజీ కాలేజీలు, మెట్రోను తెచ్చే బాధ్యత నాదని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులను ప్రారంభిస్తామని, ఉద్దండాపూర్ నుంచి కృష్ణానీటిని పారిస్తామన్నారు. వజ్రం తునకలాంటి అంజయ్యయాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే షాద్నగర్ అభివృద్ధి బాధ్యత నాదేనన్నారు. బీఆర్ఎస్ షాద్నగర్ అభ్యర్థి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ షాద్నగర్లో సోమవారం నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
నియోజకవర్గం ఒకప్పుడు కరవు ప్రాం తామని, తెలంగాణ వచ్చాకే ఇక్కడ 220 చెరువులను బాగుచేసుకుని సాగునీటి ఇబ్బందులను తీర్చుకున్నట్లు సీఎం కేసీఆర్ అన్నారు. లక్ష్మీదేవిపల్లి, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల నుంచి కృష్ణా నీటిని పారిం చి తీరుతామని స్పష్టం చేశారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ గు రించి నన్ను ఎవరూ అడగలేదని, తెలంగాణలోనే పెద్ద పాయింట్ కొందుర్గు మం డలంలోని లక్ష్మీదేవిపల్లియేనని, తెలంగాణ ఉద్యమంలో దీన్ని కనిపెట్టానని చెప్పారు.
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వస్తే నెత్తిమీద కుండ ఉన్నట్లేనన్నారు. కాంగ్రెస్ నాయకులు 196కేసులు వేసి పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకున్నారని, కొట్లాడితే ఈ మధ్యనే అన్ని క్లియ ర్ అయి పంపులను ప్రారంభించుకున్నట్లు చెప్పారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను వాగు మీద కట్టేది కాదని..రింగ్ బండ్వేసి త్వరితగతిన పూర్తిచేస్తామన్నారు. ఈ రిజర్వాయర్ కింద ఎక్కు వ భూములు మునుగకుండా రిజర్వాయర్ను నిర్మిస్తామన్నా రు. ఉద్దండాపూర్ నుంచి కూడా షాద్నగర్లోని కొన్ని ప్రాంతాలకు నీళ్లొస్తాయని, దీనివల్ల సాగు నీళ్ల బాధ పోతదని అన్నారు.
అంజయ్యయాదవ్ కోరిక మేరకు మెడికల్, ప్రభుత్వ పీజీ కాలేజీలను ఏర్పాటు చేయడంతోపాటు మెట్రోరైలును శంషాబా ద్ నుంచి షాద్నగర్కు తెచ్చే బాధ్యత తనదేనని సీఎం కేసీఆర్ తెలిపారు. మెట్రో వస్తుందని ఎప్పుడైతే తెలిసిందో..ఈ ప్రాంత డిమాండ్ తారా జువ్వలా పైకి లేచిందన్నారు. హైదరాబాద్కు పక్కనే ఉంది కాబట్టి బ్రహ్మాండంగా ఇనిస్టిట్యూట్లు వస్తాయని, కాలుష్యం లేని పరిశ్రమలు దండం పెట్టుకుంటూ ఇక్కడ వెలుస్తాయన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం నీళ్లకు గోసపడిందని.. అయితే పదేండ్లలో బ్రహ్మాండంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఈ ప్రాంతంలో భూముల ధరలూ మూడింతలు పెరుగుతాయన్నారు.
షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ వజ్రం తునక లాంటి మనిషి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. మొదటి నుంచీ నమ్మిన బంటులా నా వెన్నంటే ఉన్నారన్నారు. అజాత శత్రువు అని.. చీమకు, దోమకు కూ డా అన్యాయం చేయరన్నారు. ప్రజల కోసం పాటుపడే ఇటువంటి ఎమ్మెల్యే ఉంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయన్నారు. రైల్వే ఓవర్బ్రిడ్జి, మంచినీళ్ల వంటి సమస్యలను కొట్లాడి తెచ్చారన్నారు. పొద్దున లేస్తే ప్రజల మధ్యే ఉండి పనిచేసే ఇటువంటి మంచి మనిషిని గ్యారెంటీగా కాపాడుకోవాలన్నారు. బీసీలకు సీట్లు రానేరావని, వచ్చి న వద్ద కూడా బీసీ చైతన్యం చూపించకపోతే ఎట్లా? అని అన్నారు. అంజయ్యను భారీ మెజార్టీతో గెలిపిస్తే వందకు వందశాతం ఇక్కడ అభివృద్ధి నాదేనన్నారు.
రైతుబంధు వేయకుండా కాంగ్రెస్ అడ్డుపడిందని సీఎం కేసీఆర్ ఆ పార్టీ నేతలపై మండిపడ్డారు. రైతుల నోటికాడి బుక్కను కాంగ్రెస్ ఎగ్గొట్టిందన్నారు. రైతుబంధు తీసుకుంటున్న వారిలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారని, కాంగ్రెస్ తప్పుడు పనులను చూసి ఆ పార్టీ నేతలు సిగ్గుపడాలన్నారు. మేం గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, అరిగోస పడ్డ ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలని ప్రశ్నించారు. యాభైఏండ్లుగా కొట్లాడినప్పటికీ గిరిజనుల సమస్యలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని, రాష్ట్రంలో 3,500 తం డాలను పంచాయతీలు చేస్తే అందులో నియోజకవర్గంలోనే 22 తండాలను గిరిజన బిడ్డలే పాలిస్తున్నారన్నారు.
ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచడంతోపాటు, సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు సమున్నత గౌర వం ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లో ముస్లిం, మైనార్టీలకు సైతం విద్య, ఉ ద్యోగపరంగా అవకాశాలు పెరిగాయన్నారు. రాయి ఏదో.. రత్నమేదో గుర్తించి ఓటెయ్యాలని ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. 24 గంటల కరెంటు కావాలన్నా, రైతు బంధు 16వేలకు పెరుగాలన్నా ఎమ్మెల్యేగా అంజయ్య యాదవ్ను గెలిపిస్తేనే సాధ్యపడుతుందన్నారు.
షాద్నగర్, నవంబర్ 27 : 2001లో సీఎం కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినప్పుడు ఎగతాళి చేసిన అప్పటి కాంగ్రెస్ నాయకులు నేడు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం షాద్నగర్ పట్టణంలో జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో దేశానికే ఆదర్శంగా రాష్ట్రం నిలిచిందన్నారు. ఇంటింటికీ అందుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నా రు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం, నియోజకవర్గం ఎలా ఉందో.. ప్రస్తుతం ఎలా ఉందో గమనించి ఈ ఎన్నికల్లో ఓటేయాలని ప్రజలకు సూచించారు. సీఎం కేసీఆర్ గ్రామాలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేశారన్నారు. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ తాగునీటిని అందించడంతోపాటు కులవృత్తులకు పూర్వవైభవం, అన్ని వర్గాల అభ్యున్నతికి విశే షంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తే సెగ్మెంట్ను మరింత అభివృద్ధి చేస్తానన్నారు. షాద్నగర్ పట్టణంలో మెడికల్, ప్రభుత్వ పీజీ కళాశాలల, టమాట పంట ప్రాసెసింగ్ యునిట్, ఐటీ హబ్ ఏర్పా టు, కమ్మదనం అటవీ ప్రాంతాన్ని ఎకో పార్కుగా అభివృద్ధి చేయాలని ఆయన సీఎం కేసీఆర్ను కోరగా సానుకులంగా స్పందించారు.
సభలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు కిష్టయ్య, ఇందిర, సహకార సంఘాల కార్పొరేషన్ చైర్మన్ రాజావరప్రసాద్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, ఎంపీపీలు ఖాజాఇద్రీస్, రవీందర్యాదవ్, జడ్పీటీసీ స్వరూప, శ్రీలత, నాయకులు నారాయణరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, విశ్వం, నవీన్కుమార్రెడ్డి, దేవేందర్యాదవ్, ఇబ్రహీం, రామకృష్ణారెడ్డి, జగన్మోహన్రెడ్డి, వెంకటేశ్గౌడ్, యుగేందర్, రాంబాల్నాయక్, మంగులాల్నాయక్, రాజ్యలక్ష్మి, మం జులారెడ్డి, సూర్యప్రకాశ్, వెంకట్రావు, మిట్టూనాయక్, లక్ష్మీనర్సింహారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.