వికారాబాద్, నవంబర్ 22, (నమస్తే తెలంగాణ) : పరిగిలో పాలిటెక్నిక్ కాలేజీతోపాటు దాదాపూర్, కంకల్ మండలాలను ఏర్పాటు చేయాలని మహేశ్ రెడ్డి అడుగుతున్నారని, అవేమీ గొంతెమ్మ కోరికలు కావని, గెలిచిన నెలరోజుల్లోనే చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. మహేశ్ రెడ్డి ప్రజల తరఫున యుద్దం చేస్తున్నారని, ఆయనకే మీరు ఓటేసి దీవించాలని కోరారు. పరిగి పట్టణంలోని జింఖానా గ్రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి మహేశ్ రెడ్డి బుధవారం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రజలు కోరుతున్నట్లు మహ్మదాబాద్, చౌడాపూర్ మండలాలను ప్రజల కోరిక మేరకు వికారాబాద్ జిల్లాలో కలుపుతామని చెప్పారు.
స్వర్గీయ కొప్పుల హరీశ్వర్ రెడ్డి నేను 30 ఏండ్లు కలిసి పనిచేశామని గుర్తు చేశారు. స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేతోనే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తదని, పరిగి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా మహేశ్ రెడ్డి నిలబడ్డారని, అభ్యర్థుల గుణగణాలతోపాటు వారి వెనుకున్న పార్టీల గత చరిత్రను చూడాలని ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ సభలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతామహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేశవరావు, స్పీకర్ మధుసూదనాచారి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొంతు రామ్మోహన్, నాగేందర్ గౌడ్, కొప్పుల అనిల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.
రూ.200 ఉన్న పింఛన్ను 2వేలకు పెంచామని, రానున్న రోజుల్లో రూ.5 వేలకు పెంచుతాం.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బుధవారం పరిగి నియోజకవర్గం అభ్యర్థి మహేశ్రెడ్డికి మద్దతుగా పరిగి పట్టణంలోని జింఖానా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరై ప్రసంగించారు. నా కొడుకులాంటి మహేశ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించండి. ఎన్నికల తర్వాత నెలరోజుల్లో పరిగి వచ్చి మీరు అడిగిన అన్ని పనులు పూర్తి చేస్తా.. 24 గంటల కరెంటు కంటిన్యూ చేస్తూనే.. రైతు బంధును రూ.16 వేలకు పెంచుతాం. ఎన్నికలు అనగానే ఆగం కావద్దు. బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామాల్లో చర్చపెట్టాలి.., రాయేదో, రత్నమేదో ప్రజలకు తెలిసేలా వివరించాలి. వజ్రాయుధం లాంటి మీ ఓటు పరిగి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
నియోజకవర్గంలో మహేశ్రెడ్డి పట్టుబట్టి 52 తాండాలను గ్రామ పంచాయతీలుగా చేయించారని, గిరిజన బిడ్డలే ఇయ్యాలా రాజ్యం ఏలుతున్నారని సీఎం కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు లాంబాడాలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప ఏం చేయలేదన్నారు.
గర్భిణులకు అమ్మవడి వాహనాల ద్వారా ఇంటి నుంచి ఆసుపత్రికి తీసుకొచ్చి మళ్లీ ఇంటి దగ్గర జాగ్రత్తగా చేరుస్తున్నామన్నాని, ప్రసవం తర్వాత ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేల సాయంతోపాటు కేసీఆర్ కిట్ను అందిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా పేదలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్లను విజయవంతంగా అమలు చేస్తున్నామని, 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తున్నామని, చరిత్రలో ఎప్పుడు వినని రైతుబంధును పుట్టించిందే కేసీఆర్ అన్నారు. కొప్పుల మహేశ్ రెడ్డిని గెలిపిస్తే రైతుబంధు ఉండుడే కాదు.. రూ.16 వేలకు పెంచుతామని సీఎం హామీనిచ్చారు. రైతు తన సొంత పెట్టుబడితో వ్యవసాయం చేసుకునే రోజు బంగారు తెలంగాణ అని, నేను కలగనేది అదే అన్నారు.
కాంగ్రెస్ హయాంలో పింఛన్ కేవలం రూ.200 మాత్రమే ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వం మొదట రూ.వెయ్యి, తర్వాత రూ.2 వేలకు పెంచింది. రానున్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత రూ.5 వేలకు పెంచుతామని సీఎం హామీనిచ్చారు.