“నాకు దగ్గర మనిషి, విద్యావంతుడైన బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ను మరోసారి గెలిపించండి.. కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ కష్టాలపాలు కావడం ఖాయం.. వికారాబాద్ నియోజకవర్గానికి ఒకే విడుతలో దళితబంధుని అందించి దళితులను ధనవంతులను చేస్తాం.. నేనే స్వయంగా వచ్చి ప్రారంభిస్తా..” అని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ హామీనిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్లో గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ దళితులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటే.. బీఆర్ఎస్ వ్యాపారులను చేసి ఆర్థికంగా బలోపేతం చేసిందన్నారు.
ప్రజల చిరకాల కోరికైన ప్రత్యేక వికారాబాద్ జిల్లాను నెరవేర్చామన్నారు. ఇక్కడ డిగ్రీ కాలేజీ లేకుంటే మెతుకు ఆనంద్ పట్టుబట్టి మంజూరు చేయించారన్నారు. మెడికల్ కాలేజీ కూడా వచ్చిందని, దీనితోపాటే నర్సింగ్, పారా మెడికల్ కోర్సులు, 450 పడకల ఆసుపత్రి కూడా రానున్నాయన్నారు. జిల్లా నగరానికి సమీపంలో ఉన్నందున రాబోయే రోజుల్లో ఐటీ కార్యకలాపాలను వికారాబాద్ వరకు విస్తరిస్తామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కాంగ్రెసోళ్లు వేసిన 196 కేసులతో జాప్యం జరిగిందన్నారు. అన్నింటిని అధిగమించి ప్రాజెక్టును పూర్తి చేసుకున్నామని, మరో ఏడాదిలో వికారాబాద్ జిల్లాకు సాగునీరందిస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు మూడు గంటల కరెంట్ చాలు, 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలంటున్నారు.. వీటితో వ్యవసాయం చేయడం సాధ్యమా అనేది రైతులు ఆలోచించాలన్నారు.
10 హెచ్పీ మోటర్లతో ట్రాన్స్ఫార్మర్లు పటాకుల్లా పేలిపోయి మళ్లీ చీకటి రోజులు వస్తాయని హెచ్చరించారు. కర్ణాటకలో 24 గంటల ఇస్తామన్న కాంగ్రెస్.. ఇప్పుడు 5 గంటల కరెంటే ఇస్తున్నదని, దీంతో కన్నడ రైతులు హైదరాబాద్కు వచ్చి కాంగ్రెస్ను నమ్మి తాము మోసపోయాం.. మీరు మోసపోవద్దని హెచ్చరిస్తూ ధర్నాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెసోళ్లు రైతుబంధు దుబారా ఖర్చు, ధరణిని రద్దు చేస్తామంటున్నారు. అవి ఉండాల్నో, పోవాల్నో నిర్ణయించుకోవాలన్నారు. ఎవరో చెప్పిండ్రని ఓటేయొద్దని, 55 ఏండ్లలో కాంగ్రెస్ ఏం చేసింది, పదేండ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందనేది ఆలోచన చేయాలన్నారు.
-వికారాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, నవంబర్ 23, (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ను గెలిపిస్తే వికారాబాద్ నియోజకవర్గానికి ఒకే విడతలో దళితబంధు ఇస్తామని, ఈ దెబ్బతో వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత కుటుంబాలన్నీ ధనిక కుటుంబాలు అవుతాయని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరై ప్రసంగించారు. వికారాబాద్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మెతుకు ఆనంద్ నిలబడ్డరు. వేర్వేరు పార్టీల నుంచి వేర్వేరుగా ఉంటరు. పోటీలో ఉన్న అభ్యర్థుల గుణగణాలతోపాటు వారి పార్టీల గత చరిత్ర కూడా ఏందనేది చూడాలి. 55 ఏండ్లలో కాంగ్రెస్ ఏం చేసింది, పదేండ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందనేదానిపై మీ గ్రామాలు, బస్తీల్లో ప్రజల మధ్య చర్చపెట్టాలి. వచ్చే ఐదేళ్లు వికారాబాద్ భవిష్యత్తును నిర్ణయించేది మీ ఓటే. రాయేదో, రత్నమేదో తేల్చుకొని ఓటు వేయాలి.
24 గంటల కరెంటు, రైతుబంధు, రైతు బీమా, ఎక్కడి ధాన్యం అక్కడే కొనుగోలు చేసే బీఆర్ఎస్ పార్టీ కావాల్నా..? రైతు బంధును ఎత్తేస్తాం.. మూడు గంటలే కరెంటు ఇస్తాం.. ధరణి తీసేసి దళారీ వ్యవస్థ తెస్తాం.. అనే కాంగ్రెస్ పార్టీ కావాల్నా..? ప్రజలే నిర్ణయించుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ అభివృద్ధి ఇలానే కొనసాగాలంటే మెతుకు ఆనంద్కు ఓటేసి గెలిపించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ సభలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, బీఆర్ఎస్ నాయకులు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాగేందర్ గౌడ్, భూమొళ్ల కృష్ణ, వడ్లనందు, తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
నియోజకవర్గంలోని అన్ని కుటుంబాలకు దళితబంధు ఇచ్చి ఈ వికారాబాద్ దరిద్రాన్ని తీసి అవుతల పడేద్దామని సీఎం కేసీఆర్ అన్నారు. దళిత బిడ్డలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా వాడుకున్నది తప్ప సంక్షేమానికి పాటుపడలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేసుంటే ఇంకా పేదరికం ఏందుకుంటుండే..? ఇంతా అధ్వాన్నమైన పరిస్థితి ఏందుకు ఉంటుండే..? మీరు ఆలోచన చేయాలి. దళిత కుటుంబాలను ధనికులను చేయడమే లక్ష్యంగా దేశంలో ఏ ప్రధాని, ముఖ్యమంత్రి చేయని విధంగా నేను ఆలోచన చేసి దళితబంధును తీసుకువచ్చా. మంచి ఫలితాలు వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లా అవుతుందని ఎన్నడైనా ఊహించారా..? అని సీఎం కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా అని పేరు పెట్టినా ఆఫీసులు మాత్రం హైదరాబాద్లో ఉండేవి. మీకు జిల్లా కావాలనే బలమైన కోరిక ఉండే. అది తెలంగాణ వచ్చిన తర్వాతనే బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే నెరవేరింది. ఇక్కడ డిగ్రీ కాలేజీ కూడా లేకుండే. మెతుకు ఆనంద్ పట్టుబట్టి మంజూరు చేయించాడు. అదేవిధంగా మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, పారా మెడికల్ కోర్సులు, 450 పడకల ఆసుపత్రి వస్తది. రాబోయే రోజుల్లో ఐటీ సంస్థలు సైతం వికారాబాద్ వరకు విస్తరిస్తాయి. చాలా మంది ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాలుష్యంలేని పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. అనంతగిరిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసుకుందాం. టూరిజం శాఖ వారు ఒక ప్రాజెక్టును రెడీ చేశారు. పద్మనాభస్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తాం.
కాంగ్రెస్ నాయకుల వల్లనే మీకు సాగునీరు ఆలస్యమైంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కాంగ్రెసోళ్లు 196 కేసులు వేయడంతోనే కొన్నేళ్లుగా జాప్యం జరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. అయినా ప్రాజెక్టు పూర్తిచేశాం. కేవలం వికారాబాద్కు కాల్వలు తవ్వాలి అంతే. వికారాబాద్, తాండూర్, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాలకు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులో వాటా ఉన్నది. ఖచ్చితంగా ఏడాదిలోగా నాలుగు నియోజకవర్గాలకు సాగునీరు తీసుకువచ్చే బాధ్యత నాది. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయి. మొన్న పంపు కూడా ఆన్ చేశాం. మీకు తప్పకుండా నీళ్లు వస్తాయి.
మెతుకు ఆనంద్ విద్యావంతుడు, బుద్దిమంతుడు, నాకు చాలా దగ్గరి మనిషి అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆనంద్ ధారూర్ మండలంలో సామాన్యమైన కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని డాక్టరయ్యాడు. ఆయన భార్య సబిత కూడా డాక్టరే. ఇద్దరు ఇక్కడుండి ప్రజాసేవ చేస్తున్నారన్నారు. వాళ్లు ఎవరి దగ్గరికి పోయేవాళ్లు కాదు. నిగర్వి, అందరిలో కలిసి ఉండి గ్రామాలు తిరిగి వీలైనంతా వరకు దేవుడిచ్చిన శక్తిని ఉపయోగించి ప్రజలకు సేవ చేయాలని ఆలోచిస్తారు. ఆనంద్ గెలిస్తే వికారాబాద్కు మంచి జరుగుతుందని సీఎం అన్నారు. వికారాబాద్లో ఏ ఎమ్మెల్యే గెలుస్తడో, హైదరాబాద్లో ఆ పార్టీ ప్రభుత్వం వస్తుంది. ఎవరి చేతిలో ఉంటే ఈ రాష్ట్రం బాగుంటుందో ప్రజలు ఆలోచన చేయాలి.
వికారాబాద్ గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయిందనేది ప్రజలు ఆలోచించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రజలను కోరారు. 50 ఏళ్ల చిరకాల కోరిక అయిన వికారాబాద్ జిల్లా ఏర్పాటైంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో వికారాబాద్కు సాగునీరు వస్తుందన్నారు. వికారాబాద్ చుట్టూ ఔటర్ రింగ్రోడ్డు మంజూరు చేయాలని, తెలంగాణ ఊటీ అయిన అనంతగిరి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా, పద్మనాభ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, ధారూర్ మండలానికి జూనియర్ కాలేజీ, మోమిన్పేట్లో మైనార్టీ జూనియర్ కాలేజీ, వికారాబాద్కు గిరిజన గురుకుల పాఠశాలను మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ను కోరారు.
వికారాబాద్కు డిగ్రీ కాలేజీ, రూ.230 కోట్లతో మెడికల్ కాలేజీ, ఆయుష్, ఐసీయూ ఆసుపత్రి, డయాలసిస్ కేంద్రం, బ్రిడ్జి నిర్మాణానికి రూ.96 కోట్లు, వికారాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.60 కోట్ల నిధులిచ్చినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. గత ఎన్నికల సమయంలో వికారాబాద్ను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్ కలపాలని కోరగా.. కలిపేశారని, దీని ఫలితంగా జిల్లాలో 45 మంది సబ్ ఇన్స్పెక్టర్లుగా ఎంపికయ్యారన్నారు.
కాంగ్రెస్ నాయకులు వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలు.. రైతులందరూ 10 హెచ్పీ మోటర్ పెట్టుకోవాలంటున్నరు. 10 హెచ్పీ మోటార్లు పెట్టుడు సాధ్యమా..? అందరం ఒక్కపారే వత్తుతే ట్రాన్స్ఫార్మర్లు పటాకుల్లా పేలిపోతాయ్. మళ్లీ చీకటి రోజులు వస్తాయి.. అని సీఎం కేసీఆర్ అన్నారు. కర్నాటకలో 24 గంటలు కరెంటు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో నరికి ఇప్పుడు 5 గంటలే కరెంటు ఇస్తున్నరు. కర్నాటక రైతులు హైదరాబాద్ వచ్చి మేం కాంగ్రెస్ను నమ్మి మోసపోయాం.. మీరు మోసపోవద్దని ధర్నా చేస్తున్నరు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నాం.
రైతులు అప్పులు తేవద్దని.. పెట్టుబడి సాయం కింద రైతుబంధు ఇస్తున్నాం. రైతు చనిపోతే వారంలోగా రూ.5 లక్షల సాయం అందిస్తున్నాం. “కాంగ్రెసోళ్లు ధరణి ఫోర్టల్ను బంగాళాఖాతంలో వేస్తరట. ఇప్పుడు భూహక్కులు ప్రభుత్వం దగ్గరినుంచి ఊడవీకి.. రైతుల బొటనవేలికి ఇచ్చినం. ధరణి తీసేస్తే.. రైతుబంధు, రైతుబీమా, ధాన్యం పైసలు ఎట్ల వస్తయి. కాంగ్రెసోళ్లు ధరణి తీసేసి రైతుల బొటనవేలికి ఉన్న అధికారాలను ఊడగొడుతరట. మళ్లీ దళారీ రాజ్యం, పైరవీకారుల రాజ్యం తీసుకువచ్చేందుకే భూమేత తెస్తామంటున్నరు. రైతులు ఆలోచన చేయాలి.”
తెలంగాణ అంతటా కేసీఆర్ హవా నడుస్తున్నది. దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్గా తీర్చిదిద్దారు. కాంగ్రెస్ను తెలంగాణ ప్రజలు నమ్మడంలేదు. కర్నాటకలో 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి 5 గంటల కరెంట్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్, రైతుబంధు, సాగునీరు ఇస్తుంది. కాంగ్రెసోళ్లు పాలించే రాష్ర్టాల్లో ఇంతకు మించి పథకాలను అమలు చేస్తే ఇక్కడ మాట్లాడాలి. తెలంగాణ కేసీఆర్ అడ్డా.., బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం ప్రజల గోసలన్నింటిని తీర్చినం. అనంతగిరిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసుకుందాం.