షాద్నగర్, ఫిబ్రవరి16: కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే దేశంలో అన్నిటికీ ధరలు పెరిగాయని, ధరల నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం షాద్నగర్ పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి నిరసనలు తెలిపి మాట్లాడారు. మోదీ ఇష్టానుసారంగా ప్రజలపై పన్నులను మోపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు.
వ్యవసాయ కూలీలు ఉపాధి పొందే ఈజీఎస్ పనులను నీరుగార్చే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని వాపోయారు. కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి పరిశ్రమల యజమాన్యాలకు వత్తాసు పలికే విధంగా కార్మిక చట్టాలను మార్చుతూ కార్మికులను కేంద్రప్రభుత్వం ఆగం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు, కార్మికుల వ్యతిరేకిగా ఉన్న మోదీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు రాజునాయక్, శ్రీనునాయక్, ఈశ్వర్నాయక్, ప్రభాకర్, లలిత, వెంకటప్ప, జంగయ్య, మల్లేశ్, దశరథ్, రాజశేఖర్, యాదయ్య, సత్యంరెడ్డి, సురేశ్, చంద్రయ్య, సరిత, పలువురు కార్మికులు పాల్గొన్నారు.
కొత్తూరు : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బిస సాయిబాబు అన్నారు. దేశవ్యాప్త బంద్లో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని తిమ్మాపూర్ నుంచి కొత్తూరు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సమ్మెకు టీఎన్టీయూ మండల అధ్యక్షుడు యాదగిరి, టీడీపీ మండల అధ్యక్షుడు గణేశ్గౌడ్, నాట్కో ల్యాబ్ సీటీటీయూ ప్రధాన కార్యదర్శి మల్లేశ్ మద్దతిచ్చారు. ఈ సందర్భంగా కొత్తూరు ప్రధాన రహదారిపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా బిస సాయిబాబు మాట్లాడుతూ.. వ్యవసాయ కూలీల పని దినాలు పెంచాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, గ్రామ పంచాయతీ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : దేశవ్యాప్తంగా గ్రామీణ సార్వత్రిక బంద్కు మద్దతుగా శుక్రవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పలుప్రాంతాల్లో వివిధ కార్మిక సంఘాలతో పాటు సీఐటీయూ, ఏఐటీయుసీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్క ర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అలాగే, తుర్కయాంజాల్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం సమయంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గాలయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్కోడ్లను రద్దుచేయాలన్నారు.
రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత చట్టసవరణను రద్దుచేయాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, అమ్మకాన్ని నిలిపివేయాలని పేర్కొన్నారు. ఆదాయపు పన్ను స్లాబ్లను కనీసం 8లక్షలకు సవరించాలని, సీపీఎంఎఫ్, పీఎఫ్ రద్దుచేసి పాతపెన్షన్ పద్ధతి కొనసాగించాలన్నారు. విద్యారంగానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని ఆయన కోరారు. అలాగే, ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీకి సీపీఎం రాష్ట్ర నాయకుడు సామెల్తో పాటు మహిళలు పెద్ద ఎత్తున హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని సీపీఎం నాయకులు సామెల్ అన్నారు.
పెద్దఅంబర్పేట/ అబ్దుల్లాపూర్మెట్ : మోదీ సుపరిపాలన పేరుతో దుర్మార్గ పాలన అందిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ముత్యాల యాదిరెడ్డి అన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ మండల కార్యదర్శి అజ్మీర్ హరిసింగ్ నాయక్ అధ్యక్షతన శుక్రవారం కుంట్లూరు, పెద్దఅంబర్పేట నుంచి అబ్దుల్లాపూర్మెట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వెంకన్న, జిల్లా బీవోసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి ప్రసాద్, సంఘాల ప్రతినిధులు నరసింహ, యాదగిరి, సైదులు, శ్రీనివాస్సాగర్, నిరంజన్, నారాయణరెడ్డి, రాములు, సుధాకర్, ఈశ్వరయ్య, కేకే మూర్తి, భిక్షునాయక్, వినోద్, భాను, ప్రేమ్, వెంకటేశ్, గోపాల్ పాల్గొన్నారు.