మొయినాబాద్, ఏప్రిల్19: చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు గురువారం ధ్వజారోహణం అనంతరం గరుడ ప్రసాదం వితరణ చేశారు. ఈ ఏడాది ఊహించని రీతిలో భక్తులు వచ్చారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ఇతర రాష్ర్టాల నుంచి సుమారుగా లక్ష మంది వరకు వచ్చారు. భక్తులు కొందరు గురువారం సాయంత్రం ఆలయానికి చేరుకుని అద్దె రూముల్లో ఉన్నారు.
చాలా మంది శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు గరుత్మంతునికి పూజలు చేసి ధ్వజారోహణము పూర్తి చేసిన తరువాత ఉదయం 8.30 గంటలకు గరుడ ప్రసాదం వితరణ ప్రారంభించారు. ధ్వజారోహణ కార్యక్రమంలో ఆలయ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, పరావస్తు రామాచారి, తిరుమల కిరణాచారి, నర్సింహచారి, కిట్టు స్వామి, కన్నయ్యస్వామి, కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.
గరుడ ప్రసాదం స్వీకరించడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుందని ఆలయ అర్చకులు మాట్లాడిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం ఆరు గంటల తరువాత రద్దీ పెరిగింది. దూరం నుంచి గరుడ ప్రసాదం కోసం వచ్చిన కొందరికి గరుడ ప్రసాదం అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. దాదాపు 30 వేల మంది మహిళలకు గరుడ ప్రసాదం పంపిణీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత గరుడ ప్రసాదం అయిపోయిందని అర్చకులు చెప్పడంతో మహిళలు వెనుదిరిగారు.
అనుకున్నదానికంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు గరుడ ప్రసాదం కోసం వచ్చారు. సాధారణంగా ప్రతి ఏడాది గరుడ ప్రసాదం మూడు రోజల వరకు ఇచ్చే ఆనవాయితి ఉండేది. కానీ ఈ ఏడాది ఒక్క రోజుతోనే గరుడ ప్రసాద వితరణ పూర్తయ్యింది. తరువాత గరుడ ప్రసాదం ఇచ్చే అవకాశం లేదు.
– సీఎస్ రంగరాజన్, ఆలయ అర్చకులు
గరుడ ప్రసాదం కోసం భక్తులు వస్తారని, బందోబస్తు కల్పించాలని సమాచారం ఇచ్చారు. సుమారుగా 4 నుంచి 5 వేల మంది భక్తులు వస్తారని చెప్పారు. కానీ ఊహించని రీతిలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఉదయం నుంచి ట్రాఫిక్ జామ్ అవుతూ వచ్చింది. రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి పర్యవేక్షించారు.
– పవన్కుమార్రెడ్డి, సీఐ మొయినాబాద్