రంగారెడ్డి, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : అప్పా (టీఎస్పీఏ) జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణ పనులకు ఇప్పటికే 80 శాతం భూ సేకరణ పూర్తయిందని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్రెడ్డి అన్నారు. అప్పా నుంచి మన్నెగూడ వరకు గల 4 లైన్ల రహదారి విస్తరణ పనులకు సంబంధించి ‘భూ సేకరణ విషయమై’ గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ అధ్యక్షతన కొంగర కలాన్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో స్థానిక ప్రజాప్రతినిధులతో చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. నాలుగు లేన్ల రహదారికి ఇంకా 20% భూ సేకరణ మిగిలి ఉందన్నారు. భూ సేకరణ జరిగిన ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని, మే 1 నుంచి పనులను ప్రారంభించాలని మెగా కాంట్రాక్టర్లకు ఎంపీ సూచించారు. కార్యక్రమంలో మొయినాబాద్, చేవెళ్ల మండలాల పరిధిలోని సర్పంచ్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, చేవెళ్ల ఆర్డీవో వేణుగోపాల్, రెవెన్యూ సిబ్బంది, జాతీయ రహదారి అథారిటీ సంస్థ (ఎన్హెచ్ఏఐ) అధికారులు, మెగా ఇంజినీరింగ్ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.