‘తెలంగాణ పథకాలు దేశానికి పాఠాలుగా.. రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది..’ అని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్ రెడ్డి ఆధ్వర్యంలో షాబాద్ మండలంలోని మన్మర్రి గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదన్నారు. వేలాది మంది పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పార్టీ జెండాలను చేతబూని భారీ ర్యాలీ తీయడం గ్రామంలో జాతరను తలపించింది. ‘జై కేసీఆర్.. జైజై భారత్’ అన్న నినాదాలు మార్మోగాయి. ఆత్మీయ సమ్మేళనంలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి.
– రంగారెడ్డి, మార్చి 21 (నమస్తే తెలంగాణ)
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ముందడుగు వేస్తున్నదని, ప్రజల శ్రేయస్సు కోరి పలు ఆత్మీయ, సంక్షేమ పథకాలను అందుబాటులోకి తెచ్చి దేశం ఆశ్చర్యపోయేలా రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతున్నారని, వివిధ రకాల అభివృద్ధి పథకాలతో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం షాబాద్ మండలంలోని మన్మర్రి గ్రామంలో మంగళవారం ఒక పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మండలం పరిధిలోని ‘ఎల్గొండగూడ, చర్లగూడ, అంతారం, కేశారం, కక్కులూరు, సర్దార్నగర్, కుర్వగూడ, అప్పారెడ్డిగూడ, మన్మర్రి, బోడంపహాడ్’ గ్రామాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు వేలాదిగా హాజరయ్యారు. ఈ సమ్మేళనానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
– రంగారెడ్డి, మార్చి 21 (నమస్తే తెలంగాణ)
తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా అవతరించిన కొద్దికాలంలోనే ఎంతో మంది పొరుగు రాష్ట్రాల ప్రజలు పార్టీ కార్యకలాపాలు, విధి విధానాలపై ఆసక్తి చూపుతున్నారని.. ఇతర పార్టీల నుంచి పలువురు నాయకులు, అభిమానులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే యాదయ్య పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా నిలుస్తున్నదన్నారు. బంగారు తెలంగాణను సాధించేందుకు కేసీఆర్ పేదల అభ్యున్నతికి పాటుపడుతూ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు చేవెళ్ల, షాబాద్లకు పెద్దగా గుర్తింపు లేదన్నారు. సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వేలాది కోట్ల పెట్టుబడులను మన ప్రాంతాలకు తీసుకొచ్చి పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతున్నారని పేర్కొన్నారు. జిల్లాకు ఐటీ, పారిశ్రామిక, ఫార్మా హబ్లను తీసుకొస్తూ స్థానిక యువతకు ఉద్యోగ భృతి కల్పిస్తున్నారని తెలిపారు. గతమెన్నడూ లేనివిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రమనే నమ్ముకొని, ప్రగతి కోసం దాసోహం అవుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో చేస్తున్న అభివృద్ధి పనులను జీర్ణించుకోలేని పొరుగు పార్టీలు అవాకులు, చవాకులు పేలుతున్నాయని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.
ప్రగతి పథంలో తెలంగాణ
మన ప్రాంతంలో మన పాలన వచ్చాక తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నదని ఎమ్మెల్యే అన్నారు. ప్రస్తుతం మనం తెలంగాణ ప్రగతిని చూస్తున్నామని, గతంలో ఇలాంటి అభివృద్ధి ఉన్నదా? లేదా? అని ప్రతి కార్యకర్త, అభిమాని నాటికీ నేటికీ తారతమ్యాన్ని గమనించాలన్నారు. మాటలకు చేతలకు పొంతన లేకుండా ఎంతో మంది చాలా కబుర్లు చెబుతారని, అలాంటివారి మాటలను ఒక చెవిన విని, మరో చెవిన వదిలేయాలని పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఉద్బోధించారు. రానున్న రోజుల్లో ‘బంగారు తెలంగాణ’ ఆవిష్కృతమవుతున్నదని, రేపటి యువతకు ఎంతో భవిష్యత్తు ఉన్నదని, భవిష్యత్తును అంచనా వేసుకుని వేలాది కోట్ల విదేశీ, స్వదేశీ సంస్థలకు మన ప్రభుత్వం తోడ్పాటును ఇస్తున్నదని ఎమ్మెల్యే తెలిపారు. మన్మర్రి గ్రామంలో వేలాదిగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ‘జై కేసీఆర్.. జైజై భారత్’ అంటూ జెండాలు చేతబూని నినదించారు. ఆత్మీయ సమ్మేళనంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
‘సంక్షేమ’మే ధ్యేయంగా.. ముందుకు..
తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నదని, అందులో భాగంగానే పలు సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. రాష్ట్రంలోని నిరుపేదల బతుకుల్లో వెలుగులు నింపేలా సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేశారన్నారు. రైతు సంక్షేమమే ప్రజా సంక్షేమంగా భావించి రైతును రాజును చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో 692 పైచిలుకు చెరువులను ‘మిషన్ కాకతీయ’ ద్వారా పునరుద్ధరించుకున్నామని, గత పాలకుల హయాంలో కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకునేందుకు తెలంగాణ సర్కారు కృషి చేస్తున్నదన్నారు. ‘మిషన్ కాకతీయ’తో వందలాది చెరువులు గత వైభవాన్ని సంతరించుకున్నాయని, ఇదంతా కేవలం ఒక్క తెలంగాణ పాలనతో తిరిగి పొందుతున్నామని పేర్కొన్నారు. ‘మిషన్ భగీరథ’తో ఇంతుల దాహార్తిని తీర్చుకోగలిగామన్నారు. గతంలో ఏ పాలకులూ చేయని విధంగా తెలంగాణ సర్కార్ ప్రజల కోసం ఎన్నో శ్రేయోదాయక పథకాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. నిరుపేదలైన ప్రతి ఇంటికి సీఎం కేసీఆర్ మేనమామ లాగా రూ.1,00116లను ‘షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి’ పథకాల పేర అందిస్తున్నారని.. వయోవృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల కోసం ‘ఆసరా’ లాంటి పథకాలు, రైతుల కోసం ‘రైతు బంధు, రైతు బీమా’ పథకాలను విజయవంతంగా అందిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి
షాబాద్, మార్చి 21 : పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. మంగళవారం మన్మర్రి గ్రామంలో జడ్పీటీసీ అవినాశ్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన చర్లగూడ, ఎల్గొండగూడ, అంతారం, కక్కులూరు, కేశారం, సర్దార్నగర్, కుర్వగూడ, బోడంపహాడ్, అప్పారెడ్డిగూడ, మన్మర్రి గ్రామాల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, అవినాశ్రెడ్డి హాజరయ్యారు.
బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గులాబీ జెండాలతో ర్యాలీగా వెళ్లి వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ అవినాశ్రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తకు మనోధైర్యం ఇవ్వడానికి, ప్రభుత్వ పథకాలు గ్రామ స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ఇప్పటికే ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం చేపట్టినట్లు అవినాశ్రెడ్డి తెలిపారు. గ్రామాల్లో మిగిలిపోయిన పనులన్ని దశలవారీగా పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధికి నోచని గ్రామాలన్నీ ప్రస్తుతం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నట్లు జడ్పీటీసీ వివరించారు.
ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనను కలిస్తే, పరిష్కరానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు తాను సొంతంగా దివ్యాంగులకు ట్రై స్కూటీలు, పేద మహిళలకు కుట్టుమిషన్లు అందిస్తున్నానని ఆయన తెలిపారు. రూ.75లక్షలతో మన్మర్రికి బీటీ రోడ్డు పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. రాబోవు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక మెజార్టీ అందించి, తెలంగాణ ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు నర్సింగ్రావు, శ్రీరాంరెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు వెంకటయ్య, శ్రీనివాస్గౌడ్, రాజేందర్రెడ్డి, నర్సింహారెడ్డి, ఆరిఫ్, పాండురంగారావు, రైతు బంధు సమితి మండల కన్వీనర్ మధుసూదన్రెడ్డి, పార్టీ మొయినాబాద్ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, పీఏసీఏస్ వైస్ చైర్మన్ మల్లేశ్, డైరెక్టర్లు నర్సింహులుగౌడ్, శ్రీనివాస్రెడ్డి, నర్సింహారెడ్డి, సూర్యప్రకాశ్, సర్పంచులు పూజిత, సంధ్య, యాదమ్మ, కృష్ణారెడ్డి, పుష్పమ్మ, ఎంపీటీసీలు మధుకర్రెడ్డి, సరళ, పార్టీ మండల నాయకులు రాంచంద్రారెడ్డి, దామోదర్రెడ్డి, చెన్నయ్య, శ్రీనివాస్గౌడ్, నరేశ్, మహేశ్, యాదయ్య, పులిందర్రెడ్డి, జంగయ్య, హరీశ్, మల్లికార్జున్గౌడ్, కార్యకర్తలున్నారు.