నవాబుపేట,మార్చి 26 : ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నాలు చాలా చేస్తున్నారని.. వాటిని మనందరం గమనిస్తుండాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం మండల పరిధిలోని గంగ్యాడ గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. పనిచేసేవారిని ప్రోత్సహించాలి లేదా ఇలా కాదు ఇంకోలా చేస్తే బాగుంటుందని ప్రతిపక్ష పార్టీల నాయకులు చెప్పాలి కానీ విమర్శించడమే పనిగా పెట్టుకుని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి అన్నారు. మభ్యపెట్టే మాటలు మాట్లాడుతూ కాలం గడుపుతున్న వారిని ప్రజలు గమనిస్తున్నారని.. వారికి ఓటు రూపంలోనే సమాధానం దొరుకుతుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు పుట్టగతులుండవని.. అది వారికి కూడా తెలుసునని చెప్పారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఇస్తూ అభివృద్ధిని చేస్తున్న తీరును చూసి ఓర్వలేకనే పనిగట్టుకుని ఎంత మంచి పనిచేసినా జీర్ణించుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కేసీఆర్ సీఎం కాకముందు కూడా ఒక రైతుగానే ఉండేవాడని.. అలాంటి వ్యక్తికి నేలను నమ్ముకుని కష్టపడే వారి బాధలు తెలుసని.. అందుకనే రైతు బంధు, రైతుబీమా, ఉచిత కరెంట్ వంటి అనేకమైన సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకువెళ్తున్నదని తెలిపారు. పార్టీ శ్రేణులందరూ ఒకటిగా ఉండి ఏమైనా సమస్యలుంటే చర్చించుకుని పరిష్కరించుకోవడమే ఈ ఆత్మీయ సమ్మేళనం ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ భవాని, జడ్పీటీసీ జయమ్మ, పీఏసీఎస్ రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ డాక్టర్ ప్రశాంత్గౌడ్, ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షుడు దయాకర్రెడ్డి, మండలం అధ్యక్షుడు నాగిరెడ్డి, సర్పంచ్లు పర్మయ్య, గోవిందమ్మ, బాలమణి, అనితారెడ్డి, సీనియర్ నేత మల్లారెడ్డి పాల్గొన్నారు.
– ఘనపురం శాంతికుమార్
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జరుగుతున్న ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు నూతన శోభను సంతరింపజేస్తున్నాయి. దేశంలో ఏ పార్టీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసిన సందర్భాలు లేవని.. ప్రస్తుతం మన బీఆర్ఎస్ శ్రేణులు ఓ వద్ద సమావేశమై అభివృద్ధికి, పార్టీ బలోపేతంపై పలు విషయాలను చర్చించుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తున్నది. తాను కూడా ఒక సామాన్య కార్యకర్తగానే పార్టీ ఆదేశాలను పాటిస్తూ ముందుకెళ్తున్నా.
– మల్లేశం, బీఆర్ఎస్ పార్టీ గంగ్యాడ గ్రామ నేత
మొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం.. అందులో మా గ్రామంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు దాదాపు 11 గ్రామాలకు చెందిన పార్టీ శ్రేణులు ఒకే వేదికపై సమావేశం కావడం, అదీ అభివృద్ధి గూర్చి మాట్లాడటం ఎంతో సంతోషించదగ్గ విషయం. మా గ్రామంలో ఒకప్పుడు సీసీ రోడ్డు అంటే తెలియదు ప్రస్తుతం సీసీ రోడ్డుతో కళకళలాడుతున్నది.