‘చేవెళ్లతో పెనవేసుకున్న పేగుబంధంతో బీఆర్ఎస్ పార్టీ వరుసగా రెండుసార్లు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఈసారి కూడా విజయబావుటా ఎగురవే సేందుకు పక్కా ప్లాన్తో వెళ్తున్నది. ఈ నేపథ్యంలో ఇదే వేదిక నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు.
ఈనెల 13న చేవెళ్లలో నిర్వహించనున్న బహిరంగ సభను సక్సెస్ చేసి చేవెళ్ల గడ్డ..బీఆర్ఎస్ అడ్డా..అని సత్తా చాటేందుకు నేతలు సమాయత్తమవుతున్నారు. ప్రతిపక్షాలకు దీటైన సమాధానం ఇచ్చేలా భారీ జన సమీకర ణపై దృష్టి సారించారు. లోక్సభ నోటిఫికేషన్కు ముందు నిర్వహిస్తున్న తొలి సభతో ప్రచారాన్ని కేసీఆర్ ఉరకలెత్తించనుండడంతో రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో గుబులు మొదలైనది.’
– రంగారెడ్డి, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ)
చేవెళ్ల వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేయనున్న ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొ న్నది. జనరల్ స్థానమైన చేవెళ్ల లోక్సభ బరిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ను వ్యూహాత్మకంగా కేసీఆర్ నిలబెట్టారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి పోటీచేస్తున్న రంజిత్రెడ్డి, విశ్వేశ్వర్రెడ్డి ఇద్దరూ గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీని వీడారు. ప్రతి ఎన్నికకు పార్టీలు మారే నాయకులు కావాలా? ఎప్పటికీ చేవెళ్లతో పెనవేసుకున్న బీఆర్ఎస్ పేగుబంధం కావాలా..? అనేది తేల్చుకునే క్రమంలో..డోలాయమానంలో ఉన్న చేవెళ్ల ప్రజానీకానికి కేసీఆర్ కర్తవ్య బోధ చేయనున్నట్లు తెలుస్తున్నది.
ప్రజల మేలు కోరే పార్టీ కావాలా? లేక సొంత ప్రయోజనం కోసం పార్టీ మారే నేత కావాలా..? అన్న మీమాంస పటాపంచలు అయ్యేలా ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నారు. చేవెళ్లతోపాటు మహ బూబ్నగర్, నాగర్కర్నూలు, భువనగిరి, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాలతో రంగారెడ్డి జిల్లాకు అనుబంధం ఉండడంతో చేవెళ్ల వేదికగా ప్రతిపక్ష పార్టీల పాలనా తీరును తూ ర్పారబట్టేలా కేసీఆర్ ప్రసంగం ఉండనున్నట్లు సమాచారం. అలాగే..పదేండ్ల్ల కాలంలో బీఆర్ఎస్ జనరంజక పాలనను ప్రస్తావిస్తూనే..తెలంగాణపై తనకున్న భావోద్వేగ బంధాన్ని ఆవిష్కరించి ప్రజలను సమాయత్తం చేయనున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా.. బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లాలోని 8 అసెంబ్లీ స్థానాల్లో ఐదింటిని గెలుచుకుని పటిష్ట స్థితిలో ఉన్నది. అధికార పార్టీ ప్రలో భాలకు తలొగ్గి ఎమ్మెల్యేలతోపాటు బీఆర్ఎస్ జెండా మోసిన నేతలు, కార్యకర్తలు ఎవరూ పార్టీని వీడకపోవడంతో జిల్లాలో పార్టీ చెక్కు చెదరకుండా ఉన్నది. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలు చేవెళ్ల ఎంపీ స్థానం గెలుపుకోసం కసిగా పనిచేస్తున్నారు. ప్రజలకు దిశానిర్దేశం చేసే కేసీఆర్ బహిరంగసభకు ప్రాధాన్యత ఇచ్చి విజయవంతానికి అహర్నిశలు కృషి చేస్తు న్నా రు. నేతలంతా సమన్వయంతో కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు.
సభా ఏర్పా ట్లు, జనసమీకరణ తదితర వాటిపై మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మె ల్యేలు, పార్టీ క్యాడర్తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈనెల 6న తుక్కు గూడలో నిర్వహించిన సమావేశంలో జనం నుంచి పెద్దగా జోష్ కనబడలేదు. హామీలను విస్మరించిన ఆ పార్టీపై ఆగ్రహంతో ఉన్న అన్ని వర్గాల ప్రజానీకం బీఆర్ఎస్ను ఆదరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద సంఖ్యలో ప్రజలను బహిరంగ సభకు తరలించేందుకు సిద్ధ్దమవుతున్నారు. బీఆర్ఎస్ నేతలు సైతం పార్టీ శ్రేణులను సన్నద్ధ్దం చేయడంతోపాటు సామాన్య జనం సైతం కూడా పెద్ద ఎత్తున సభకు వచ్చేలా చూస్తున్నారు.
సభకు భారీగా తరలి రావాలి
-మాజీ మంత్రి,సబితాఇంద్రారెడ్డి
చేవెళ్లలో ఈనెల 13న నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలి వచ్చి జయప్రదం చేయాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గురువారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. చేవెళ్ల గడ్డపై కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారని.. ముచ్చటగా మూడోసారి కూడా చేవెళ్ల ఎంపీ స్థానాన్ని గెలిపించి కేసీఆర్కు కానుకగా ఇద్దామన్నారు. చేవెళ్ల ఎంపీగా కాసాని జ్ఞానేశ్వర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. సమావేశంలో పార్టీ అధ్యక్షుడు కామేశ్రెడ్డి, మేయర్ దుర్గా దీపులాల్ చౌహాన్, డిఫ్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.