ముషీరాబాద్, డిసెంబర్ 26: పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి విద్య, ఉద్యోగ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 13న చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిస్తున్నట్లు తెలిపారు. సోమవారం విద్యానగర్లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం బీసీలను చిన్న చూపు చూస్తున్నదని మండిపడ్డారు.
బీసీ రిజర్వేషన్లను 27 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో జనవరి 13న పార్లమెంట్ వద్ద భారీ ధర్నా నిర్వహించి ముట్టడించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, సుధాకర్, నరసింహారావు, కిరణ్, సైదులు, అనంతయ్య, రాజ్కుమార్, శంకర్ పాల్గొన్నారు.