ఆమనగల్లు, జనవరి 6 : ప్రజాపాలన దరఖాస్తుల డేటాను తప్పులు లేకుండా నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్ స్పష్టం చేశారు. శనివారం కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల మండలాల్లో ప్రజాపాలన దరఖాస్తుల డేటా నమోదును ఆయన పరిశీలించారు. అనంతరం ఆమనగల్లులోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.
జిల్లావ్యాప్తంగా 2,46,626 లక్షల కుటుంబాలుండగా శుక్రవారం వరకు 2,68,875 లక్షలు, ఆమనగల్లు మండలంలో 4,911 వేలు, ఆమనగల్లు మున్సిపాలిటీలో 5133 ప్రజాపాలన దరఖాస్తులు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. డేటా ఎంట్రీ చేసేటప్పుడు నిర్లక్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ డేటా ఆధారంగానే లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందుతాయని తెలిపారు. ఈ నెల 17 వరకు డేటా ఎంట్రీ పూర్తి చేయాలని ఆయన సూచించారు. సమావేశంలో ఎంపీడీవో ఫారూఖ్ హుస్సేన్, తహసీల్దార్ లలిత, ఎంపీవో శ్రీలత పాల్గొన్నారు.