రంగారెడ్డి, మే 15 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచటంపై సామాన్యులు భగ్గుమంటున్నారు. ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో మోదీ సర్కారు సామాన్యుల నడ్డి విరుస్తున్నదని పలువురు వాపోతున్నారు. బంగారం కొనుగోలు ఆపాలని, ఖర్చులు తగ్గించాలని, వాహనాలను అతిగా వాడొద్దని చెప్పిన ప్రధానమంత్రి పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం పెంచడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతో సతమతమవుతుంటే ఈ పెంపు ఏందని సామాన్యులు, మధ్యతరగతి ప్రజ లు మండిపడుతున్నారు.
ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా రూ.వెయ్యి వరకు పెంచి సామాన్యులకు మే డే కానుకిచ్చిన మోదీ ప్రభుత్వం, కొత్త సీఎంలు పాలనాపగ్గాలు చేపట్టక ముందే పెట్రో భారాన్ని మోపడం చర్చనీయాంశంగా మారింది. కేంద్రం నిర్ణయాలు సామాన్యుల పాలిట శాపంగా మార ని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంతో మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు సామాన్యులను ఇంధన ధరలు మరింత కుంగదీయనున్నాయన్నారు. పెట్రోల్ రూ. 3.39 పైసలు పెంచటంతో జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ.110లకు చేరగా.. డీజిల్ ధర లీటర్కు రూ.3.27 పైసలు పెరగడంతో దాని ధర 103కు చేరిందన్నారు.
సామాన్యుల నడ్డి విరిచింది..
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచింది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో అనేక వాహనాలు ఇండ్లకే పరిమితమయ్యాయి. కార్లు, జీపులు, ఆటోలను నడుపుకొంటూ జీవిస్తున్న పలువురు తమ ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలు తగ్గించాలి.
-మంచిరెడ్డి కిషన్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
వాహనాలు నడపలేం
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచటంతో వాహనాలను అద్దెకు తీసుకోవాలంటేనే ప్రజలు ముందుకు రావటంలేదు. వారానికి ఒక్కరోజు కూడా కిరాయికి వాహనాన్ని నడపలేకపోతున్నాం. ఈ పరిస్థితిలో కేంద్రం మరోమారు ధరలు పెంచి మాపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది.
-నటరాజ్, ప్రైవేట్ వాహన నిర్వాహకుడు
సామాన్యుల పాలిట శాపంగా.. మోదీ నిర్ణయాలు
కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్యుల పాలిట శాపంగా మారాయి. ఇప్పటికే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పేదల సంక్షేమాన్ని మరిచిన కేంద్రం సామాన్యులపై నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచటం సమంజసం కాదు. వెంటనే వాటిని తగ్గించాలి. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం నిత్యావసరాలపై తీవ్రంగా పడే అవకాశమున్నది. ఉప్పు, పప్పులు, బియ్యం, తదితర వస్తువులతోపాటు కూరగాయల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉండడం తో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు.
మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే
ప్రజలపై తీవ్ర భారం
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై అదనపు భారం మోపుతున్నది. ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసరాలూ పెరిగి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. బతుకుదెరువు కోసం ఆటోలు, ఇతర వాహనాలను వినియోగించే ప్రజలు పెరిగిన ఇంధన ధరలతో వాహనాలను నడపడం కష్టంగా మారింది. కేంద్రం వెంటనే పెంచిన ధరలను తగ్గించి పేదలకు ఊరట కల్పించాలి.
– రఘుపతిరెడ్డి ,చేవెళ్ల/చేవెళ్లటౌన్
ధరల కట్టడిలో కేంద్రం విఫలం
ధరల కట్టడిలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. ధరలు పెరిగి సామాన్యులు ఇప్పటికే ఇబ్బంది పడుతుంటే మరోవైపు కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరిచింది. ఇప్పటికే వ్యాపారాల్లేక, పనుల్లేక.. చిరువ్యాపారులు దివాళా తీస్తుంటే పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను కేంద్రం భయాందోళనకు గురి చేస్తున్నది. మోదీ ప్రభుత్వానికి ఓట్లు, సీట్లు తప్పా.. సామాన్యులు, మధ్య తరగతి ప్రజల అవస్థలు పడడంలేదు. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలను సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం జనంపై పెట్రో ధరల బాంబు వేయడం చాలా దారుణం.
-కీసరి సంజీవరెడ్డి, నాగిరెడ్డిగూడ, మొయినాబాద్
సామాన్యులు సతమతం..
ఇంధన ధరల పెరుగుదలతో సామాన్యుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపించే పరిస్థితులు కనిపి స్తున్నాయి. ముఖ్యంగా డీజిల్ ధర పెరగడంతో రవాణా రంగంపై అదనపు భారం పడగా, ఆ ప్రభావం నేరుగా మార్కెట్లోని నిత్యావసరాలపై పడనున్నది. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బందిపడుతున్న ప్రజలు తాజా పెంపుతో మరింత సతమతం కానున్నారు. సామాన్యుడి జీవితం మరింత భారంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది.
-కమ్మరి ప్రవీణ్చారి, శంకర్పల్లి మున్సిపాలిటీ