సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ): వైరస్ అంటే ఏంటి? బ్యాక్టీరియా ఎలా బతుకుతుంది.? డీఎన్ఏ నిర్మాణం ఎలా ఉంటుంది.? ఆర్ఎన్ఏ విధులేంటి? బిడ్డకు తల్లిదండ్రుల డీఎన్ఏ ఎలా వస్తుంది.? డ్రోసోఫిలా జీవిత చక్రం ఏంటి? ఎన్ని రోజుల్లో ఆ కీటకం రూపాంతరం చెందుతుంది.? అంటూ నిత్యం పుస్తకాల్లో చదివే ఆ విద్యార్థులు.. ఇప్పుడు మైక్రో స్కోప్ జూమింగ్లో కళ్లారా చూస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు గోడలకే పరిమితమైన ఆ ప్రశ్నలకు ప్రయోగశాలలో సైంటిస్టుల్లా పరీక్షలు నిర్వహించి సమాధానాలు తెలుసుకుంటున్నారు.
యువ శాస్త్రవేత్తలను తయారు చేయడమే లక్ష్యంగా సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) ఆధ్వర్యంలో చేపట్టిన యంగ్ ఇన్నోవేటర్ కార్యక్రమంలో ఇలాంటివెన్నో అనుభూతులను ఎంపికైన విద్యార్థులు పొందారు. విద్యార్థి దశలోనే శాస్త్ర, వైజ్ఞానిక రంగంపై ఆసక్తిని పెంచేలా మొగ్గ దశలోనే లోతైన అవగాహన కల్పించేలా సీసీఎంబీ శిక్షణనిచ్చింది. అయితే శిక్షణ పొందిన విద్యార్థులతో.. ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేకంగా సంభాషించే అవకాశం వచ్చింది.
12 రోజులపాటు ప్రత్యేక శిక్షణ
విద్యార్థి దశ నుంచి శాస్త్ర, విజ్ఞానంపై ఆసక్తిని పెంచేలా, యువ శాస్త్రవేత్తలుగా వారిని తీర్చిదిద్దడం కోసం సీసీఎంబీ యంగ్ ఇన్నోవేటర్ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నది. ఏటా ఓసారి జరిగే ఈ కార్యక్రమం కోసం పలు పాఠశాలల నుంచి ఎంపికైన విద్యార్థులు అరుదైన అనుభూతిని పొందారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను ఎంపిక చేసుకుని 12రోజులపాటు సీసీఎంబీ పరిశోధకులు ప్రత్యేక శిక్షణనిచ్చారు. దీంతో ఆధునిక సైన్స్పై సమగ్రమైన విషయ పరిజ్ఞానాన్ని పెంచేందుకు సాయపడుతుందని సీసీఎంబీ వర్గాలు చెబుతున్నాయి.
పరీక్షలో నెగ్గి.. సీసీఎంబీకి చేరి
యంగ్ ఇన్నోవేటర్ కార్యక్రమం కోసం తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్షకు దాదాపు 240 మంది విద్యార్థులు హాజరు కాగా.. ఇందులో 27మంది విద్యార్థులు మాత్రమే స్కూల్ నుంచి సీసీఎంబీ ప్రయోగశాలకు చేరుకున్నారు. ఇందులో కార్పొరేట్ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులే కాకుండా మారుమూల గ్రామాల్లో ఉండే స్కూళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు కూడా ఉన్నారు. 8, 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అందులో బయాలజీ, ఫిజికల్ సైన్స్, లాజికల్, రీజనింగ్ అంశాలతో కూడిన ప్రవేశ పరీక్ష నిర్వహించి విద్యార్థులను ఈ కార్యక్రమానికి ఎంపిక చేశారు. వీరిలో కొంత మంది విద్యార్థులకు వసతి సౌకర్యంతోపాటు భోజన సదుపాయం కల్పించి ప్రత్యేకంగా రూపొందించిన మాడ్యూల్ ప్రకారం శాస్త్రవేత్తలే టీచర్లుగా పలు విషయాలపై అవగాహన కల్పించేలా క్లాస్, ల్యాబ్ ఓరియెంటేషన్ కార్యక్రమాలను నిర్వహించారు.
ఎంపికైన ప్రభుత్వ, గురుకులాల విద్యార్థులు..
సీసీఎంబీ నిర్వహించే విద్యార్థుల కార్యక్రమాల్లో ఎక్కువగా కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకే అవకాశాలు వచ్చేవి. కానీ ఈసారి ఎంపికైన విద్యార్థుల్లో ఆరుగురు విద్యార్థులు తెలంగాణలోని మారుమూల జిల్లాలు, గురుకులాల్లో చదువుతున్నవారు ఉండటం గమనార్హం. పాఠశాలల్లో టీచర్ల గైడెన్స్తో తమకీ ఈ అవకాశం వచ్చిందని చెప్పుకుంటూ సంబురపడిపోయారు.
థియరీ క్లాసులు.. తోటి మిత్రులతో ఆటలు..
ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగే ఈ కార్యక్రమాన్ని సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ కె.నందికూరి సారథ్యంలో కమ్యూనికేషన్ నిపుణులు డాక్టర్ సోమదత్తా కరాక్, భరత్ అత్తే, బీవీ రామకృష్ణ పర్యవేక్షించారు. వీరంతా విద్యార్థులు, సైంటిస్టులకు వారధిగా ఉంటూ యంగ్ ఇన్నోవేటర్లను పరిణితి చెందేలా కార్యక్రమాలను నిర్వహించారు. వారిలో ఉన్న ఆసక్తిని వెలికి తీయడమే కాకుండా.. సైంటిఫిక్ రంగంలో కలుగుతున్న మార్పులను అర్థం చేసుకునే క్రమంలో.. వారికి వచ్చే నిర్మాణాత్మకమైన ప్రశ్నలకు సమాధానాలను చెబుతూ విజ్ఞానాన్ని పెంపొందించారు. ఇక థియరీ క్లాసుల్లో నేర్చుకున్న విషయాలను తోటి మిత్రులతో ఆడుకుంటూనే యువ సైంటిస్టులను తలపించేలా ఆత్మవిశ్వాసాన్ని పొందారు.
సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో జరిగిన యంగ్ ఇన్నోవేటర్ – 2023 శుక్రవారంతో ముగిసింది. 12 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన విద్యార్థులకు మాలిక్యులర్, బయాలజీ, జెనెటిక్స్, సెల్ టెక్నాలజీ వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమంలో విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.
డీఎన్ఏ సేకరించా…
స్కూల్ నుంచి ఇద్దరం పరీక్ష రాస్తే.. ఒక్క దాన్నే ఎంపికయ్యాను. పుస్తకాల్లో చదువుకున్న ఎన్నో విషయాలను ఇక్కడ నా కళ్లతో చూస్తున్నా. డీఎన్ఏ నిర్మాణం, కణాల వృద్ధిని చూసే అవకాశం దక్కింది. పేషంట్ల నుంచి సేకరించిన రక్తం, అరటి పండు, ఉమ్మిలోని డీఎన్ఏను కూడా సేకరిస్తానని నేనెప్పుడూ ఊహించలేదు. ఇక తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చిన డీఎన్ఏ నిర్మాణం ఎలా ఉంటుందనే విషయాన్ని పుస్తకాల్లో కంటే నేరుగా చూసిన అనుభవం నాకెప్పటికీ గుర్తుంటుంది.
– అక్షిత రెడ్డి, 10వ తరగతి,ఉప్పల్-కుత్బుల్లాపూర్ బాలికల గురుకుల పాఠశాల
క్యాన్సర్ కణాల వృద్ధిని పరిశీలించా
పుస్తకాల కంటే.. ప్రయోగశాలలో నేర్చుకున్న విషయాలు ఎంతగానో ప్రభావితం చేశాయి. నాలాంటి వారికి అంతు చిక్కని ఎన్నో ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలను కళ్లతో చూసి తెలుసుకున్నా. శరీరంలో సాధారణ కణాల లాగే ఉండే క్యాన్సర్ కణాల వృద్ధిని ప్రత్యక్షంగా పరిశీలించడం గుర్తుండిపోయే విషయం. ఇక సైంటిస్టులతో ఇంటరాక్షన్తో సైన్స్పై మరింత ఆసక్తిని పెంచుతుంది.
– శ్రద్ధా, జాన్ సన్ గ్రామర్ స్కూల్, హబ్సిగూడ
యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
పాఠశాల విద్యార్థులను ప్రస్తుత శాస్త్ర, వైజ్ఞానిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశోధనలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా సీసీఎంబీ అధ్వర్యంలో యంగ్ ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని నిర్వహించాం. కరోనా తర్వాత ఈ రంగంపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన వచ్చింది. సాధారణ ప్రజలు కూడా సైంటిఫిక్ డెవలప్మెంట్లను ఆసక్తితో తెలుసుకున్నారు. ఇక విద్యార్థి దశ నుంచి ఇలాంటి కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడం ద్వారా ఈ రంగంలో ఉన్న విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకునే ఆత్మ విశ్వాసం పెరిగింది.
– వినయ్ కె.నందికూరి, సీసీఎంబీ డైరెక్టర్
డ్రోసోఫిలాపై ప్రయోగం చేశా
మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లిలోని జడ్పీ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్నా.. స్కూల్ టీచర్ గైడింగ్లో ఈ పరీక్ష రాసి, యంగ్ ఇన్నోవేటర్కు ఎంపికయ్యా. జనవరి 4 నుంచి సాగుతున్న శిక్షణలో ఎన్నో విషయాలను నేర్చుకున్నా. ముఖ్యంగా పండ్లపై వాలే చిన్న ఈగలు(డ్రోసోఫిలా) ఉత్పత్తి చేయడం, మేల్, ఫిమేల్ డ్రోసోఫిలాను సంపర్కం చేసి వాటి జీవిత చక్రాన్ని చూడటం గొప్ప అనుభూతినిచ్చింది.
– సాయిలేఖ్య, 10వ తరగతి,కంబాలపల్లి జడ్పీ స్కూల్, మహబూబాబాద్
శాస్త్రవేత్తలతో ముచ్చట్లు..
ఇప్పటివరకు బయాలజీ, కణం, కణ నిర్మాణం, డీఎన్ఏ, కీటకాలు, వైరస్ రూపాంతరం, డీఎన్ఏ సేకరణ గురించి పుస్తకాల్లో మాత్రమే చదువుకున్న ఆ విద్యార్థులు శాస్త్రవేత్తలు, పీహెచ్డీ చేస్తున్న స్కాలర్లతో సంభాషించి.. ల్యాబ్లో నేరుగా ప్రయోగాలు చేసేలా ఈ కార్యక్రమాన్ని సీసీఎంబీ డిజైన్ చేసింది. విద్యార్థులే నేరుగా జీవుల పుట్టుక, జీవిత చక్రాన్ని ప్రాక్టికల్గా తెలుసుకునే విధంగా శిక్షణనిచ్చారు. ఈ శిక్షణలో భాగంగా కోసిన పండ్లపై వాలే చిన్న ఈగలు(డ్రోసోఫిలా)కు జీవం పోయడం ఎంతో ఆనందంగా ఉందని ఓ యువ సైంటిస్ట్ చెబుతూ మురిసిపోయింది.