ఇబ్రహీంపట్నం : కులవృత్తులను నమ్ముకుని జీవిస్తున్న అందరికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తున్నది. రజక, నాయీబ్రాహ్మణులకు కరెంటుబిల్లు బాధలను తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దోబీఘాట్లు, లాండ్రీషాపులు, సెలూన్లలో వినియోగమయ్యే విద్యుత్ ఖర్చు బాధను పూర్తిగా లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.
అందులో భాగంగానే ఈనెలలో రజకులు, నాయీబ్రాహ్మణులకు 250యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించడంతో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయా వర్గాల నుంచి దరఖాస్తులు ఆహ్వానించడంతో వందలాది మంది అర్హులు ధ్రువపత్రాలతో ఉచిత విద్యుత్ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇంత చక్కటి పథకానికి శ్రీకారం చుట్టడం సంతోషించదగ్గ విషయమని రజకులు, నాయీబ్రాహ్మణులు అంటున్నారు.
కుప్పలుగా దరఖాస్తులు
250 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకానికి రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ఆయా వార్గల నుంచి అర్హులైన వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. తమ కులవృత్తిపై ఆధారపడి జీవిస్తుంటే తాసీల్దార్ ధ్రువీకరణపత్రం, షాపు కిరాయి తీసుకున్న ఒప్పంద పత్రం, దరఖాస్తు దారుడి ఆధార్ కార్డు, 4 ఫొటోలు, మీటర్ రీడింగ్ బిల్లు జిరాక్స్తో నేరుగా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే ఆయా జిల్లాలోని బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సుమారు 2వేల వరకు దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి విద్యారెడ్డి తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా నాయీబ్రాహ్మణుల నుంచి 462 దరఖాస్తులు రాగా, సుమారు 1500వరకు రజకుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 250 యూనిట్లు లోపు ఉచిత విద్యుత్ పథకానికి జిల్లా వ్యాప్తంగా సుమారు రెండువేల వరకు దరఖాస్తులు వచ్చాయి. అర్హులుగా ఉండి దరఖాస్తు చేసుకోలేని స్థితిలో ఉన్నవారికి సంబంధిత శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఎంపీడీఓ ఆధ్వర్యంలో గ్రామాల్లో చాటింపు వేయించి ధరఖాస్తులు కోరుతున్నారు.
విద్యుత్ బిల్లుల భారం ఉండదిక
క్షౌరశాలల, లాండ్రీషాపులు, దోబీఘాట్లకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రభుత్వం 250యూనిట్లు వరకు విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వరాలను జిల్లాలోని రజకులు, నాయీబ్రాహ్మణులు పూర్తిస్థాయిలో అందింపుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు అర్హులైన వారిలో సగానికి ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు తాసీల్దార్ కార్యాలయాల నుంచి కుల ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఆయా కులాల్లో విద్యావంతులు లేకపోవడంతో ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక తికమకపడ్డారు. బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో వారందరికీ ఊరట లభించింది. దీంతో జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా రజకులు, నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి ఇంతలా కృషి చేయలేదని హర్షం వ్యక్తం చేస్తున్నారు.