రంగారెడ్డి, జూన్ 12(నమస్తే తెలంగాణ) : విద్యా సంస్థల బస్సులపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు బుధవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. 5 బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిఫ్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఫిట్నెస్లేని, పన్నులు చెల్లించని 46 బస్సులపై కేసు నమోదు చేశామన్నారు. ఫిట్నెస్లేని 15 సంవత్సరాలు దాటిన విద్యాసంస్థల బస్సులు ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై తిప్పరాదన్నారు. అనుభవం గల, 60 సంవత్సరాలు మించని డ్రైవర్లను నియమించుకోవాలని సూచించారు. తనిఖీలను కొనసాగిస్తామని, ప్రతి విద్యాసంస్థ బస్సుకు తప్పనిసరిగా సంబంధిత రవాణా శాఖ కార్యాలయంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలన్నారు. తనిఖీల్లో రంగారెడ్డి, మేడ్చల్, ఉప్పల్ రవాణాశాఖ అధికారులు కిరణ్ రెడ్డి, కృష్ణ వేణి, సునీత, నవీన్, ప్రతాప్ రాజా, త్రివేణి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.