చేవెళ్ల టౌన్, డిసెంబర్ 11 : ప్రతి ఏడాది పత్తి సాగు గణనీయంగా పెరుగుతున్నది. చేవెళ్ల డివిజన్లో ఈ ఏడాది 23,349 ఎకరాలకు పైగా పత్తి పంట సాగు చేశారు. పంట కోత సమయంలో పత్తిని తీయడంలో రైతులు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. పత్తి తీత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ అధికారులు పలు సూచనలు చేశారు. వాతావరణం అనుకూలించక, అతివృష్టి, అనావృష్టి, కారణంగా ఇతర పంటలు దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. దీంతో ప్రతి ఏడాది మండలంలో పత్తిని సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. పత్తి తీసే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మార్కెట్లో పంట మద్దతు ధరను కోల్పోతున్నారు.
ఎరువు వేసే ముందు…
పత్తి చేనుకు ఎరువు వేసే ముందు కలుపు తీయాలి. నాలుగు ఆకుల దశలో కలుపు ఉంటే ఎకరానికి 400 మి.లీ క్విజలొపాప్ ఈథైల్ (టర్గాసూపర్) +250 లీపైరిథియోబాగ్ సోడియం (హిట్బీడ్) కలిపి పిచికారీ చేయాలి. కలుపు మొక్కలు బాగా పెరిగి మూడు, నాలుగు ఆకుల దశ ఉన్నట్ల్లయితే ైగ్లెపోసెట్ కలుపు మందులను పది మి.లీ 10గ్రాముల యూరియా ఒక లీటర్ నీటిలో కలిపి కేవలం వరుసల మధ్య కలుపు మొక్కల పైన మాత్రమే పడేలా చూసుకోవాలి. పత్తి పంటపై పడకుండా జాగ్రత్తగా నాజిల్పై డోమ్ పెట్టి పిచికారీ చేయాలి. వరుస మొక్కల దగ్గర ఉన్న కలుపును కూలీలతో తీయించాలి. ఎండు తెగులు ఆశించిన మొక్కల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తొలిదశలోనే మందులను పిచికారీ చేయాలి. ఆలా చేస్తే తొలిదశలో తెగులు ఉండే మొక్కలు చనిపోకుండా కాపాడుకునే అవకాశం ఉంది. ఎండు తెగులు ఆశించిన మొక్క వేరును నిలువునా చీల్చి చూస్తే లోపల ఎర్రటి చారలు కనిపిస్తే పత్తికి ఎండు తెగులు ఆశించినట్లు తెలుసుకోవచ్చు. తొలిదశలో ఎర్రటి చారలు కనిపించకపోవచ్చు. వాడిపోయినట్లు కనిపించగనే రైతులు నివారణ చర్యలు తీసుకోవాలి.
ఆకులు చేతికి అంటకుండా….
పత్తి బాగా విప్పుకున్న కాయ నుంచి మాత్రమే పత్తిని తీయాలి. కొద్దిగా విప్పిన కాయ నుంచి పత్తి తీయరాదు. పత్తి తీసే సమయంలో ఆకులు చేతికి అంటకుండా జాగ్రత్తగా పత్త్తిని తీయాలి. తీసిన పత్తిని నీడలో ఆరబెట్టి గాలి తగిలేలా నిల్వ చేసుకోవాలి. తేమ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం మంచు ఎక్కువగా కురుస్తుండ డంతో మధ్య్యాహ్నం 3నుంచి సాయంత్రం 6గంటల్లోపు పత్తిని తీయాలి. ఎక్కువ వేడి ఉన్నపుడు పత్తిని తీస్తే గుల్లల వద్ద తొడిమెలు, ఆకులు పత్తికి అంటుకుంటాయి. పత్తిని తీసిన వెంటనే నీడలో వేయాలి. ఇలా చేస్తే తేమ తగ్గి పత్తి నాణ్యతగా ఉంటుంది. నీడలో కుప్పగా వేస్తే పత్తిలో ఉన్న తేమ వేడి ఎక్కువై గింజలు ముడత పడి తూకంలో బరువు తగ్గడంతో పాటు ముక్కపురుగు తగిలి నాణ్యత దెబ్బతింటుంది. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తే పత్తి తేమ తగ్గి విక్రయించే సమయంలో నాణ్యతగా ఉండి అధిక ధర వచ్చే అవకాశం ఉంటుంది.
రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు..
పత్తి పంటను రైతులు అధికంగా పండించి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. దీంతో ఈ ఏడాది వంద కిలోలకు రూ. 10వేలు పలుకుతున్నది. పెట్టుబడి పోను మంచి లాభాలు వస్తుండడంతో రైతులు సంతోషంగా ఉన్నారు.
– గిరిధర్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ
అధికారుల సూచనలు పాటించాలి…
రైతులు పత్తి పంట సాగు చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో పత్తి తీసే సమయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుత సమయంలో మంచు అధికంగా కురుస్తున్నది. మంచు తగ్గిన తర్వాత పత్తి తీయాలి. అధిక వేడి ఉన్నప్పుడు పత్తిని తీస్తే వెంటనే నీడలో వేయాలి. ఇలా చేస్తే తేమ తగ్గి పత్తి నాణ్యతగా ఉంటుంది. పత్తి విప్పిన 5నుంచి 6రోజుల్లో పత్తిని తీయాలి. లేనిపక్షంలో తేమ ఎక్కువై సూటిమోల్డ్ వచ్చే అవకాశం ఉంది. రైతులు తప్పనిసరిగా వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించడంతో పాటు లాభాలు ఆర్జిస్తారు.
– రమాదేవి, ఏడీఏ, చేవెళ్ల