రంగారెడ్డి, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో ఇటీవల ముగిసిన మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు లెక్కలు చూపించడంలో లేటు చేస్తే వేటు తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనల మేరకు ఎన్ని నిధులు ఖర్చు చేశారో…లెక్కలు చూపించాలని పోటీ చేసిన వివిధ పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులకు అధికారులు ఆదేశాలు జారీచేస్తున్నారు. 45 రోజుల గడువుండగా.. ఎన్నికలు ముగిసి ఇప్పటికే 15 రోజులు కావస్తున్నది.
మరో నెల రోజులే మిగిలి ఉన్నది. లెక్కలు చూపించని అభ్యర్థులపై అనర్హత వేటు పడే అవకాశాలున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇటీవల జిల్లావ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీల్లో 126 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పోటీచేసిన కౌన్సిలర్ అభ్యర్థి లక్ష రూపాయల లోపు ఖర్చుచేయాలని నిబంధన ఉన్నది.
ఈ నిధులతో ఎన్నికల్లో టీ, టిఫిన్, ప్రకటనలు, నమూనా బ్యాలెట్, కరపత్రాలు, ఫ్లెక్సీలు, ప్రచార పత్రాలు, డ్రైవర్ల బత్తా, భోజనం, మైక్ సెట్ వంటి వాటికి ఖర్చు చేయాల్సి ఉన్నది. ఖర్చుల వివరాలు సకాలంలో తెలియజేయకపోతే గెలిచిన అభ్యర్థులపై వేటుపడటంతో పాటు ఓడిపోయిన అభ్యర్థులు కూడా వచ్చే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు అనర్హులవుతారని అధికారులు చెప్తున్నారు. జిల్లావ్యాప్తంగా 126 మున్సిపాలిటీలకు 437 మంది ఎన్నికల్లో పోటీ చేశారు. ఇప్పటివరకు ఏ ఒక్క అభ్యర్థి కూడా లెక్కలు చూపించలేదు.
మున్సిపాలిటీ వార్డులు అభ్యర్థులు
షాద్నగర్ 28 92
ఆమనగల్లు 15 54
ఇబ్రహీంపట్నం 24 83
శంకర్పల్లి 15 57
చేవెళ్ల 18 59
మొయినాబాద్ 26 92
కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రూ.లక్ష లోపు ఖర్చు చేయాల్సి ఉండగా.. అభ్యర్థులు మాత్రం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించారు. అధికారులకు సమర్పించే లెక్కలు మాత్రం రోజుకు వెయ్యి నుంచి రెండు వేలకు మించకుండా చూపించేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.