Patolla Karthik Reddy | మణికొండ, ఫిబ్రవరి 7 : కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలో అన్ని చోట్ల గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పటోళ్ల కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రజా ఆగ్రహానికి గురైందని అన్నారు. ప్రజా ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూడకతప్పదని తెలిపారు.
రాజేంద్రనగర్ నుంచి తాను బరిలో ఉంటానని కార్తీక్రెడ్డి స్పష్టంచేశారు. అవుటర్ రింగ్రోడ్డు లోపలి మున్సిపాలిటీలు,కాలనీలు, గ్రామాల ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉండాలనే సంకల్పంతో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.3వేల కోట్ల నిధులతో రిజర్వాయర్లను నిర్మించేందుకు నిధులను మంజూరుచేసి ప్రాజెక్టులు పూర్తిచేస్తే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వాటిని ప్రారంభించి తామే చేశామనడం సిగ్గుచేటని విమర్శించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ వాసుల దాహార్తి శాశ్వతంగా తీర్చాలన్న సంకల్పంతో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దాదాపు రూ.587కోట్ల నిధులతో మూడు రిజర్వుయర్లను నిర్మించేందుకు కేసీఆర్ శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ఆ ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాత ఈనెల 6న రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్తో కలిసి ప్రారంభించారని అన్నారు. తామే నిర్మించి పూర్తిచేశామన్నట్టుగా ప్రగల్బాలు చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గానికి రావాల్సిన మెట్రో ప్రాజెక్టు తరలిపోయిందని, మెట్రో వచ్చి ఉంటే నియోజకవర్గ రూపురేఖలు మారిపోయేవని కార్తీక్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే పార్టీ మారిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ దీనిపై నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీలో చేరిన తర్వాత అభివృద్ధి పనుల కోసం రూపాయి తెచ్చిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని తామే చేశామని చెప్పుకోవడం దిగజారుడు తనమే అని మండిపడ్డారు. ఏ ప్రయోజనాల కోసం పార్టీ మారారో ఇప్పటికైనా నియోజకవర్గ ప్రజలకు చెప్పాలన్నారు.