ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగింది. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.
ఉమ్మడి జిల్లాలో 10 (నాగర్కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, వనపర్తి, గద్వాల, నారాయణపేట, మహబూబ్నగర్, కొడంగల్, షాద్నగర్) పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 8 చోట్ల 100 శాతం, రెండు చోట్ల 99 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 1,439 మంది ఓటర్లగానూ 1,437 మంది వారి ఓటు హక్కు వినియోగించుకోగా 99.86 శాతం పోలింగ్ నమోదైంది.
షాద్నగర్/కొడంగల్, మార్చి 28 : ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక పోలింగ్ గురువారం సజావుగా జరిగింది. రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ పట్టణంలోని ఫరూఖ్నగర్ మండల పరిషత్ కార్యాలయం.. వికారాబాద్ జిల్లా, కొడంగల్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో 227 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగగా వందశాతం నమోదైంది.
కాగా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాలకు సంబంధించి 56 మంది ఓటర్లుండగా మొత్తం సభ్యులు తమ ఓటు హక్కును కొడంగల్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో సద్వినియోగం చేసుకున్నారు. సీఎం రేవంత్రెడ్డి మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా వచ్చి ఓటు వేశారు.
పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ నారాయణరెడ్డితో పాటు ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ సుధీర్బాబు సందర్శించి పరిశీలించారు. నెల రోజుల పాపతో కలిసి వచ్చి పర్సాపూర్ ఎంపీటీసీ గోవిందమ్మ ఓటు వేయగా, బొంరాస్పేట మండలంలోని సుల్తాన్పూర్ ఎంపీటీసీ కిష్టమ్మ వృద్ధురాలు కావడంతో వీల్చైర్లో వెళ్లి ఓటేశారు. అదేవిధంగా షాద్నగర్, కల్వకుర్తి సెగ్మెంట్లలోని మున్సిపాలిటీలు, మండలాలకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు మొత్తం 171 మంది సభ్యులు తమ ఓటు హక్కును మధ్యాహ్నం మూడు గంటల్లోపే వినియోగించుకోవ డంతో.. పోలింగ్ 100 శాతం నమోదైనట్లు ఎన్నికల నిర్వహణాధికారులు తెలిపారు.
ఎమ్మెల్సీ, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. బ్యాలెట్ బాక్స్లను మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తరలించారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుందని అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాన్ని ఆర్డీవో వెంకటమాధవరావు, ఫరూఖ్నగర్ తహసీల్దార్ పార్థసారథి పర్యవేక్షిం చారు. కాగా పోటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు మాత్రమే ఉండడంతో గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నాయకత్వంలో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా క్యాంపులు నిర్వహించగా, కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్టుగా ఎమ్మెల్యే శంకర్ క్యాంపు చేపట్టి రాజకీయాన్ని వేడెక్కించారు. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి గెలుపు ఖాయమని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, కేశంపేట ఎంపీపీ రవీందర్యాదవ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్ పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద షాద్నగర్ ఏసీపీ రంగ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు, పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.