రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకపోగా.. బీసీలకు టికెట్ ఇస్తే కూడా ఓర్వలేకపోతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాసాని గెలుపు కాంగ్రెస్కు గుణపాఠం కావాలని, బీసీలంతా ఏకమైతే చేవెళ్లలో కాసాని గెలుపు అసాధ్యం కానేకాదని నేతలు పేర్కొంటున్నారు. బీసీలకు కులహంకార పార్టీలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీసీలు తమ దమ్మేంటో చూపించాల్సిన అవసరం ఉందన్నారు.
ఐక్యంగా ఉంటే బీసీలదే రాజ్యాధికారమని ఘంటాపథంగా చెబుతున్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా.. బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. బీసీలు ఐక్యంగా ఉండరు.. అన్న భావనను ఈ ఎన్నికల్లో నిరూపించాలని పిలుపునిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కల్పించిన ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బీసీల ఐక్యతపై సమాజానికి ఓ స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇద్దామంటున్నారు.
– రంగారెడ్డి, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) :
పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ను ఎంపీగా గెలిపించుకుంటే బీసీల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తారు. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీల్లో ఐక్యత లేకపోవడంతో మన హక్కుల సాధనలో వెనుకబడిపోతున్నాం. గతంలో జడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ను పార్లమెంట్కు పంపితే బీసీల గొంతును పార్లమెంట్లో వినిపిస్తారు. చేవెళ్ల గడ్డపై బీసీ నేతకు వచ్చిన అవకాశాన్ని మనమంతా వినియోగించుకుని పార్టీలకతీతంగా కాసానిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– రాపోలు నర్సింహులు, ప్రజా చైతన్యసమితి రాష్ట్ర అధ్యక్షుడు
ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల అభ్యర్థిగా బరిలో నిలిచిన కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపిద్దాం. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీసీలను పట్టించుకోవడంలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం సీట్లు బీసీలకు కేటాయించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ధన్యవాదాలు. చేవెళ్ల స్థానాన్ని బీసీ నేత కాసానికి కేటాయించడంపై బీసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దమ్ముంటే కాసానిని ఎంపీగా గెలిపించుకోవాలని ఓ నాయకుడు విసిరిన సవాల్ను బీసీలందరూ గమనించి మన ఓట్లు మన బీసీ నేతకు వేసి భారీ మెజార్టీతో ఎంపీగా జ్ఞానేశ్వర్ను గెలిపిద్దాం.
– పి. అంజయ్య, బీసీ నేత, షాబాద్ మండలం
బీసీలందరం ఐక్యంగా ఉండి బీసీ గళం వినిపించాల్సిన సమయం వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. సమిష్టిగా కృషి చేసి మన నాయకున్ని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. కాంగ్రెస్, బీజేపీలు మాత్రం అందుకు భిన్నంగా అగ్రకులాలకు చెందిన వారికి టికెట్లు కేటాయించాయి. ఉమ్మడి రంగారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు కాసాని బీసీల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. బీసీలు రాజకీయాల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాల్సిన అవసరం వచ్చింది.
– ప్రభాకర్, వికారాబాద్
ఎన్నో ఏండ్లుగా బీసీలు ఓటు బ్యాంకుగా మారడమే తప్పా రాజకీయాల్లో రాణించేందుకు అవకాశాలు రాలేదు. ఈసారి చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థిగా బీసీ బిడ్డ అయిన కాసాని జ్ఞానేశ్వర్కు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే కాసానికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. బీసీలపై కొందరు నాయకులు చిన్న చూపు చూస్తున్నారు. జనాభాలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉన్నది.
– మల్లేశ్యాదవ్, మదన్పల్లి, వికారాబాద్
ఇంత కాలం బీసీలను ఓట్లు కాసే చెట్లుగా మల్చుకున్నారు. బీసీల్లో చైతన్యం వచ్చింది. మన ఓట్లు మనమే వేసుకుందాం. బీసీ నాయకుడైన కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించుకొని తీరుతాం. బీసీల కులాల ఐక్యత కోసం సంవత్సరాల తరబడి పోరాటం చేసిన నేత కాసాని. అలాంటి వ్యక్తి ఏ పార్టీ నుంచి చేవెళ్ల ఎంపీ బరిలో ఉన్నాడనేది ముఖ్యం కాదు. బీసీ నేతగా గెలిపించుకునే బాధ్యత ప్రతి బీసీ బిడ్డపై ఉంది. బీసీని గెలిపించుకొని బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం.
– చిన్నపాక విజ్ఞేశ్వర్యాదవ్, బడంగ్పేట
అధికారం సాధించుకోవడానికి బీసీలు ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైంది. చీలికలు పేలికలుగా బీసీలు విడిపోయి ఉంటే బీసీలకు ఎప్పుడూ అధికారం రాదు. అధికారంలోకి రావాలంటే చేవెళ్ల పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించుకోవాలి. బీసీలు అమ్ముడు పోతారని, బీసీల్లో ఐక్యతలేదని, వారు ఎప్పుడూ ఒక్కటిగా ఉండలేరన్న వాదనకు తెరపడాలంటే కాసానిని గెలిపించుకుందాం. 93 బీసీల కులాల ఐక్య వేదిక అధ్యక్షులుగా జ్ఞానేశ్వర్ ఎంతో సేవ చేశారు.
– ఆంజనేయులు, రజక సంఘం నాయకుడు, బడంగ్పేట
బీసీలలో ఐక్యతపై కాంగ్రెస్ పార్టీ నేత వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదు. రాజ్యాధికారం కోసం ఈ ఎన్నికల్లో బీసీల ఐక్యతను చాటుతాం. మా శక్తేంటో నిరూపిస్తాం. ఇప్పటికే బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు ఆయా రాజకీయ పక్షాలు వాడుతున్నాయి. చేవెళ్ల పార్లమెంటు స్థానాన్ని మాజీ సీఎం కేసీఆర్ బీసీ వర్గానికి చెందిన కాసానికి ఇవ్వడం ద్వారా ఆ పార్టీ తమ చిత్తశుద్ధిని చాటుకున్నది. అందరం కలిసికట్టుగా బీసీ అభ్యర్థిని గెలిపించుకుని మా ఐక్యతను సమాజానికి చాటుతాం.
– కోట కుమార్యాదవ్, యాదవ సంఘం నేత, మియాపూర్
పార్లమెంటు ఎన్నికల్లో పార్టీలకతీతంగా బీసీలమంతా ఒక్కటవుతాం. చేవెళ్ల నియోజకవర్గంలో బీసీ వర్గానికి చెందిన అభ్యర్థి కాసానిని ముక్తకంఠంతో ఒక్కటై అధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. దీంతో కాంగ్రెస్ నేత వ్యాఖ్యలను మా ఐక్యతతో తప్పని నిరూపిస్తాం. బీసీ వర్గాలంతా ఇప్పటికైనా ఆయా రాజకీయ పక్షాలు ఓట్ల జిమ్మిక్కులను గుర్తించాలి. బీసీల కోసం పాటుపడే పార్టీలను, నేతలను గుర్తించి వారికి అండగా నిలవాలి. బీసీలంతా ఐక్యమైనపుడే మరింత మందికి మున్ముందూ అవకాశాలు వస్తాయి.
– వేముల రాజుసాగర్, ఉప్పరి సంఘం నేత, మియాపూర్
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా చేవెళ్ల నియోజకవర్గం నుంచి బీసీ ముద్దుబిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. కొన్నేండ్ల నుంచి రాజకీయపరంగా బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు. అలాంటి రాజకీయ నాయకులకు కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుతో గుణపాఠం నేర్పుతాం. బీసీల ఐక్యతను చాటితీరుతాం. పార్లమెంట్లో బీసీల తరఫున గొంతు అయ్యే అవకాశాన్ని కాసానికి ఇవ్వాలి.
– తలారి వీరప్ప, గాజీపూర్, పెద్దేముల్
బీసీలందరం ఏకతాటిపైకి వచ్చి రానున్న ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం. అప్పుడే బీసీల ఐక్యత సమాజానికి చాటినట్లు అవుతుంది. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ వర్గానికి పెద్దపీట వేసి బీసీలపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. బీసీల సత్తాను చాటేందుకు ప్రతి బీసీ బిడ్డ ఓ సైనికుడై బీసీ నాయకుడి గెలుపునకు కృషి చేయాలి.
– కె.లాలూయాదవ్, గాజీపూర్, పెద్దేముల్
చేవెళ్ల గడ్డపై ఎంపీ ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి పట్టం కడుతాం. సంవత్సరాల నుంచి బీసీలకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. బీసీల జనాభాలో బీసీలే ఎక్కువగా ఉన్నా బీసీలకు రావాల్సిన పథకాలు ప్రభుత్వాలు అందించడంలేదు. కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషిచేస్తాం. బీసీలతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది.
– నర్సింహ, లింగంపల్లి, కులకచర్ల
పార్లమెంటులో బీసీల గళం విప్పేందుకు బీసీల నుంచే ఎంపీగా పార్లమెంటుకు పంపించాలి. చేవెళ్ల నుంచి చాలా సంవత్సరాల తరువాత బీసీ నేతకు అవకాశం వచ్చింది. దీన్ని బీసీలందరం ఐక్యంతో ఉండి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించుకుందాం. చేవెళ్ల గడ్డపై బీసీ అభ్యర్థికి పట్టం కట్టేందుకు ప్రతి బీసీ ముందుకు రావాలి.
– బోయిని మొగులయ్య, అంతారం, కులకచర్ల
రాష్ర్టాన్ని సాధించారు. నీళ్లు తెచ్చారు. అందుకే కేసీఆర్ సర్ చెప్పినవారికే మా ఓటేస్తాం. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా కాసాని జ్ఞానేశ్వర్కే మా ఓటు. కొందరికి అర్థంకాక మోసపోయి కాంగ్రెస్కు ఓటు వేశారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. ఐదు నెలలైనప్పటికీ మాయ మాటలే చెబుతున్నారు. మాలాంటి పేదవారికి ఇప్పటికీ ఎలాంటి సహాయం చేయలేదు.
– రామనర్సయ్య, అడ్డా కూలీ, సులేమాన్నగర్, రాజేంద్రనగర్
కాంగ్రెస్ పాలనలో ఇప్పటికీ సామాన్యులకు ఎలాంటి పథకాలందలేదు. గ్యాస్ సిలిండర్ ధర రూ.500 చేస్తామన్నారు. అమలులోకి రాలేదు. మాయ మాటలు చెప్పే నేతలను ఎప్పటికీ నమ్మలేము. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే షాదీముబారక్ లబ్ధిపొందాం. సులేమాన్నగర్ కాలనీలో తాగునీటి సమస్య గత ఎనిమిదేండ్లో ఎప్పుడూ లేకుండేది. ఇప్పుడు మళ్లీ నీటి కష్టాలు వచ్చేశాయి. కాసానికే ఓటు వేస్తాం.
– షేక్ ఇస్మాయిల్, సులేమాన్నగర్, రాజేంద్రనగర్