పేదలపై ప్రభుత్వం పగబట్టిందని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కలలో వచ్చిన ప్రాజెక్టును కట్టడానికి పేద ప్రజల ఇండ్లను కూలస్తామంటున్నారని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్చార్జి పటోళ్ల కార్తిక్రెడ్డి అన్నారు. మూసీ పరీవాహక ప్రాంతమైన హైదర్గూడ రైతులు సోమవారం ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో కార్తిక్రెడ్డి మాట్లాడుతూ.. డీపీఆర్,ప్రాజెక్టుపై సమగ్రమైన అవగాహన లేకుండానే పేదల ఇండ్లు, భూములను లాక్కొనేందుకు కాంగ్రెస్ సర్కార్ యత్నిస్తున్నదని దుయ్యబట్టారు.
సిటీబ్యూరో, బండ్లగూడ, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వానికి సహకరించని రైతులు, పరీవాహక ప్రజల ఇండ్లు, భూములను నిషేధిత జాబితాలో పెట్టి.. జీరో వ్యాల్యూ చేస్తామని ముఖ్యమంత్రి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఒక్క చిన్న ప్రాజెక్టునైనా పూర్తిచేయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన కలల ప్రాజెక్టుగా చెప్పుకొంటున్న మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ఎలా పూర్తిచేస్తారని నిలదీశారు.
మూసీ పరీవాహకంలో బఫర్జోన్ 50 మీటర్లని ప్రకటించి.. హైదర్గూడలో మాత్రం 500 మీటర్ల దాకా భూములను లాక్కుంటామని నోటిఫికేషన్లో పెట్టడం వెనుక ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ నేత కార్తిక్రెడ్డి ఆరోపించారు. హైదర్గూడలో 32 ఎకరాల వ్యవసాయ భూమిని లాక్కుంటామని ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో పేర్కొన్నారని.. ఈ భూమిపై ఆధారపడి 165 మంది జీవిస్తున్నారన్నారు. భూములను రియల్ వ్యాపారులకు కట్టబట్టేందుకే రేవంత్రెడ్డి కుట్ర చేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వారంతా రోడ్డున పడే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
భూములు ఇవ్వం
వందల ఏండ్ల నుంచి ఈ భూముల్లోనే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. భూముల ధరలు పెరగడంతో మా పిల్లల భవిష్యత్తుకు ఈ భూమే మిగిలింది. మూసీ సుందకరీరణ పేరుతో వారి భవిష్యత్తును లాక్కుంటారా? ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలి కానీ అదే అభివృద్ధి పేరు చెప్పుకొని ప్రజల భూములను గుంజుకుంటారా? ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. ఇక్కడి భూములపైన 66 కుటుంబాలకు చెందిన 168 మంది ఆధారపడి ఉన్నారు. ఈ భూములను మూసీ పేరిటి గుంజుకుంటే వారందరూ రోడ్డున పడాల్సి వస్తుంది. మాకున్న ఒక్క ఆధారాన్ని మీరు లాక్కుంటే మేం ఎక్కడికి పోవాలి? ఎలా బతకాలి. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా మా భూములను ప్రభుత్వానికి ఇవ్వం.
-మణెమ్మ, హైదర్గూడ