దేశంలో ఏ రాష్ట్ర ప్రజలకూ అందని సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని, ఈ విషయాన్ని గ్రామాల్లో గడప గడపకూ తీసుకెళ్లాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కంగ్టి మండలం తడ్కల్ గ్రామంలో బుధవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రం, దేశంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ సభలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ఊదరగొట్టే బీజేపీ పాలిత కర్ణాటకలో దుర్భిక్షం రాజ్యమేలుతున్నదని, అక్కడి ప్రజలు తెలంగాణ పథకాలకు జేజేలు పలుకుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్ల డబ్బులు కాజేశారని చెప్పే బాధితులు తడ్కల్ గ్రామం నిండా కనిపిస్తారని విమర్శించారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమ్మేళనానికి కర్ణాటక ప్రజలు రావడం విశేషం.
కంగ్టి, మార్చి 29: బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు గడపగడపకూ తీసుకెళ్లాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. బుధవారం కంగ్టి మండలంలోని తడ్కల్ దేవీ ఫంక్షన్హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో అధికారంలోకి రానున్నది బీఆర్ఎస్ పార్టీయేనని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన సీఎం కేసీఆర్ బహిరంగసభలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఇక్కడి సంక్షేమ పథకాలు తమ రాష్ర్టాల్లో సైతం అమలుపర్చాలని వారు కోరుకుంటున్నారన్నారు. ప్రతిపక్షాలకు వచ్చే ఎన్నికల్లో ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనే ఉద్దేశంతో అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. వీటిని బీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని ఆదేశించారు. ఎన్నో ఏండ్లుగా పాలించిన కాంగ్రెస్ పాలకులు నియోజకవర్గాన్ని పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు చేసిన అక్రమాలు ఎన్నో ఉన్నాయని, ప్రజలకు రావాల్సిన సంక్షేమ ఫలాలను కొల్లగొట్టి జేబులు నింపుకున్నారని ఆరోపించారు.
కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ మండల ఏర్పాటుపై కూడా ప్రతిపక్ష నాయకులు రాజకీయాలు చేశారని, అది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే మండలం ఏర్పాటు సాధ్యమని, త్వరలోనే మండలం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ అండదండలతో నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. గతంలో గ్రామాలు, తండాల్లో కనీస సౌకర్యాలు లేవని, ఇప్పుడు అన్ని వసతులు సమకూరేలా అభివృద్ధి జరిగిందన్నారు. తడ్కల్ సబ్స్టేషన్లో దశాబ్దాలుగా కేవలం ఒకటే పవర్ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో రైతులు సాగునీటికి ఇబ్బందులు పడేవారని, మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో మరో పవర్ ట్రాన్స్ఫార్మర్తో పాటు దామరిగిద్దలో మరో సబ్స్టేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు 24 గంటల ఉచిత విద్యుత్ అందడంతో రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే జన్ధన్ ఖాతాల్లో రూ.15లక్షలు జమచేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. పక్కనే ఉన్న కర్ణాటకలో డబుల్ఇంజిన్ సర్కార్ ఉందని అక్కడి పరిస్థిలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవచ్చన్నారు. సరిహద్దులో ఉన్న కర్ణాటక పాలిత గ్రామాల ప్రజలు పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి నీటిని తీసుకెళ్తున్నారన్నారు. అక్కడి ప్రజలు సైతం బీఆర్ఎస్లోకి వస్తామని చెబుతున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డిజిల్, పెట్రోల్ ధరలు పెంచడంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో సైతం బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందన్నారు. నియోజకవర్గంలో ప్రధానపార్టీలన్నీ ఒక్కటైనా బీఆర్ఎస్ గెలుపు తథ్యమన్నారు. మొత్తం 54 గ్రామపంచాయతీల్లో సర్పంచ్లను ఏకగ్రీవంగా గెలిపించుకున్నామని, 90శాతం మేరా సర్పంచ్లను గెలిపించుకోగలమని తెలిపారు. ఆత్మీయసమ్మేళనానికి బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
కంగ్టి మండలంలోని తడ్కల్లో నిర్వహించిన ఆత్మీయసమ్మేళనానికి బీదర్ జిల్లా ఔరాద్ తాలూకాలోని ఖానాపూర్ ప్రజలు హాజరయ్యారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వారు సభలో కూర్చొని విన్నారు. అనంతరం ఎమ్మెల్యే భూపాల్రెడ్డికి శాలువా,
పూలమాలతో సత్కరించారు.