వికారాబాద్ : ఫ్రంట్లైన్ వారియర్స్గా ఉన్నటువంటి ప్రతి పోలీస్ అధికారి ఖచ్చితంగా బూస్టర్ డోస్ వేసుకోవాలని జిల్లా అడిషనల్ ఎస్పీ ఎం.ఏ.రశీద్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ హెడ్ క్వాటర్స్లో సిబ్బందికి బూస్టర్ డోస్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ రెండోవ డోస్ వేసుకున్న 9 నెలలు పూర్తి అయిన ప్రతి ఒక్క పోలీసు ఈ బూస్టర్ డోస్ వేసుకోవాలన్నారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కొవిడ్ వలన గతంలో జరిగిన కష్టనష్టాలను గుర్తు చేసుకొని, మరో సారి అటువంటి పరిస్థితులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. మాస్క్లు ధరించి, భౌతికదూరం పాటించడం, చేతులు శుభ్రపరుచుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలన్నారు.
అనవసరంగా ప్రజలు ఎవరు బయటకు రాకుండా, గుంపులు గుంపులుగా ఉండకుండా, మన సమాజాన్ని కాపాడుకునేందుకు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని పేర్కొన్నారు. ఒక్కరోజే జిల్లా మొత్తంలో సుమారు 50శాతంకు పైగా వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగిందన్నారు. బూస్టర్ డోస్ వ్యాక్సిన్ క్యాంప్లో డీపీవో కార్యాలయ సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు. కార్యక్రమంలో రామయ్యగూడ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వినోద్కుమార్, ఏఆర్డీఎస్పీ సత్యనారాయణ, ఎస్బీ ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.