కొడంగల్, ఫిబ్రవరి 2: దేశంలోనే హైదరాబాద్ బేగంపేట కళాశాలకు ద్వితీయ స్థానం సాధించిందని ఉన్నత విద్యా జాయింట్ డైరెక్టర్ డీఎస్ఆర్ రాజేందర్సింగ్ తెలిపారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ గుర్తింపును పురస్కరించుకొని న్యాక్ బృందం కళాశాలను సందర్శించి మౌలిక వసతులు, విద్యార్థుల విద్యా నాణ్యతలను పరిశీంచారు. ఈ సందర్భంగా ఉన్నతవిద్యా జాయింట్ డైరెక్టర్ కొడంగల్ డిగ్రీ కళాశాలకు విచ్చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరులతో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తంగా 132 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఉన్నాయని, అందులో 11 కాలేజీలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 132 కళాశాలల్లో ఇప్పటి వరకు 88 కళాశాలలకు న్యాక్ గుర్తింపు లభించిందని, అందులో దేశంలోనే హైదరాబాద్ బేగంపేట డిగ్రీ కళాశాలకు ద్వితీయ స్థానం లభించిందన్నారు.
న్యాక్ బృందం కళాశాలను పరిశీలించి గ్రేడింగ్ అందించడం జరుగుతుందని, కేంద్ర రాష్ట్రం ప్రభుత్వాల ద్వారా ఏ గ్రేడ్ రూ.5కోట్లు, బీ గ్రేడ్కు 3కోట్లు అదనంగా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ నిధులతో కళాశాలలో మరిన్ని సౌకర్యాలు సమకూర్చుకునే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం డిగ్రీ కళాశాలల్లో 50రకాల కాంబినేషన్ కోర్సులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. గత ఐదేండ్ల నుంచి ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ సారథ్యంలో ప్రభుత్వ విద్యా బలోపేతమైనట్లు తెలిపారు. డిగ్రీలో డెయిరీ, టెక్నాలజీ, సెరికల్చర్, మైక్రో బయాలజీ, బీఎస్సీ కంప్యూటర్, బీకాం కంప్యూటర్, బీబీఏ గేమింగ్, బీఎస్సీ హానర్స్, మిషన్ లర్నింగ్, డాటా సైన్స్ తదితర ఉపాధి అవకాశాలతో కూడిన ఉన్నతవిద్య ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 50వేల మందికిపైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎర్నింగ్ బై లర్నింగ్ ప్రాతిపదికన రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్లలోని నాలుగు కళాశాలల్లో వినూత్న విద్యను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి విద్యార్థులకు అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. 52 ప్రముఖ కంపెనీలను సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. ఈ కాలేజీల్లో చదివే విద్యార్థులు మూడు రోజులు కళాశాలలో చదువు, మరో మూడు రోజులు కంపెనీల్లో డ్యూటీ చేయాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్ సిటీ కాలేజీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ కోర్సును ప్రవేశపెట్టినట్లు తెలిపారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, అవగాహన శిబిరాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాక్ బృందంతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ జయరాం, అధ్యాపక బృందం పాల్గొన్నారు.