మియాపూర్ ,ఫిబ్రవరి 19: షేరిలింగంపల్లి జోన్ లో తటకాలను పూర్తిస్థాయిలో సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. మల్కం చెరువు తరహాలో గంగారం, పటేల్ కుంట, చెరువులను అభివృద్ధిపరిచి ఆహ్లాదానికి నెలవుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి బుధవారం పటేల్ కుంట, గంగారం చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఎండిఏ నిధులతో చెరువుల అభివృద్ధి, సుందరీ కరణ చర్యలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. చెరువుల విస్తీర్ణం గుర్తించి చుట్టూ పటిష్టమైన బండ్ ఏర్పాటు, లాన్, వాకింగ్ ట్రాక్, అందమైన విద్యుత్ లైట్లు, చిన్నారులకు ఆడుకోవడానికి పార్కుతరహలో ఏర్పాటు చేస్తామన్నారు . ఇందుకు సంబంధించి సమగ్ర ప్రణాళికను రూపొందించాలని జోనల్ కమిషనర్ అధికారులకు సూచించారు.
చెరువుల సుందరీ కరణ, అభివృద్ధికి సంబంధించిన పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా ముందస్తుగా న్యాయపరమైన అంశాలన్నింటిని పరిష్కరించి ముందుకు సాగాలని ఆదేశించారు. మాల్స్ ,హాల్స్ లకు ప్రత్యామ్నాయాలుగా పచ్చదనంతో ఆహ్లాదం అందించేలా చెరువుల సుందరీ కరణ చేస్తామన్నారు. ప్రతి చెరువును పిక్నిక్ స్పాట్గా మలచి శేరిలింగంపల్లి జోన్ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేసేలా చర్యలు చేపడతామని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు. చెరువులకు సంబంధించిన విలువైన స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా విజిలెన్స్ పెట్టాలని, చెరువుల పరిసరాలలో నిర్మాణ, ఇతర వ్యర్ధాలు వేయకుండా పకడ్బందీగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు .ఈ కార్యక్రమంలో చందానగర్ సర్కిల్ ఉప కమిషనర్ మోహన్ రెడ్డి ,, ఏసీపీ నాగిరెడ్డి టీపీఎస్లు కార్తీక్, శ్రీనివాస్ రెడ్డి, వైద్యాధికారి డాక్టర్ రవి, డీఈ దుర్గాప్రసాద్ ,ఇరిగేషన్ డీఈ నళిని, హెచ్ఎండిఏ అధికారులు పాల్గొన్నారు.
శేర్లింగంపల్లి జోన్ పరిధిలోని దుర్గం చెరువును హెచ్ఎండిఏ, ఇరిగేషన్ అధికారులతో కలిసి జాయింట్ తనిఖీని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మురుగునీరు చేరకుండా చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై అధికారులతో జోనల్ కమిషనర్ సమీక్షించారు. ప్రత్యేక పైప్లైన్ ద్వారా మురుగునీటి డైవర్షన్ చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువు పరిసరాలలో నివసించే ప్రజల నివాసాల నుంచి వచ్చే మురుగునీరు చెరువులోకి చేరకుండా, స్వతహాగా పైప్ లైన్లతో డ్రైనేజీలకు అనుసంధానించుకునేలా అవగాహన కల్పించాలని జోనల్ కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండిఏ సీఈ రవీందర్ డిప్యూటీ శివకుమార్ రెడ్డి, ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ నళిని ,ఏఈ పావని , డీసి ముకుంద రెడ్డి ,ఎలక్ట్రికల్ ఈ ఈ మల్లికార్జున్ , వైద్యాధికారి చంద్రశేఖర్ ,ఎంటమాలజీ సహా ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.