రంగారెడ్డి, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ) : చేవెళ్ల పార్లమెంటు పరిధిలో 70 శాతానికి పైగా బీసీలున్నాం. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ అభ్యర్థిదే గెలుపు. మెజార్టీగా ఉన్న బీసీల సమస్యలపై పార్లమెంటులో ఓ గొంతుక తప్పనిసరి అవసరం. చేవెళ్ల బీసీ సంఘాలు ఇదే ఆలోచన చేస్తున్నాయి. రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు బీసీ సేన ప్రయత్నం చేస్తున్నది. పాదయాత్రలను నిర్వహించడంతోపాటు గడపగడపకూ వెళ్లి బీసీ ఓటర్లను చైతన్యపరుస్తాం.
ఈ అవకాశం మళ్లీరాదు. బీసీల దమ్మేంటో నిరూపించాల్సిన సమయం వచ్చిందంటున్నారు బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ యాదవ్. చేవెళ్లలో బీసీ అభ్యర్థిని గెలిపించుకుని కులహంకార నేతలకు బుద్ది చెప్తామని హెచ్చరించారు. గురువారం ఆయన ‘నమస్తే తెలంగాణ’ ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
అత్యధిక ఓటర్లు బీసీ కులాల వారే ఉన్నారు. ఈ విషయం అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. అయినా.. ఓట్లు దండుకోవడానికే నేతలు బీసీలను వాడుకుంటున్నారు. దీనివల్ల బీసీలకు రాజ్యాధికారం కలగానే మిగిలిపోతున్నది. అతి తక్కువ శాతం ఉన్న వర్ణాలవారే అన్నిరకాల పదవులను అనుభవిస్తుండడం బాధాకరం. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీసీలను మోసం చేశాయి. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆరు సీట్లు కేటాయించి బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం శుభ పరిణామం. బీసీ సమస్యలపై పార్లమెంటులో మాట్లాడేందుకు బీసీ ప్రాతినిథ్యం చాలా అవసరం. ప్రస్తుత ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించి పార్లమెంటుకు పంపించాల్సిన అవసరం ఉంది. ఈసారి ఎన్నికల్లో అన్ని సంఘాలు ఈ దిశగా ఆలోచన చేస్తున్నాయి.
చేవెళ్లలో బీసీ అభ్యర్థికి బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. కాసాని జ్ఞానేశ్వర్ను ఒక పార్టీ అభ్యర్థిగా కాకుండా..బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా చూసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకుగాను బీసీలంతా పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. బీసీ సేన తరఫున బీసీలోని అన్ని కులాలను ఏకం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని కుల సంఘాలను కలిసి అభ్యర్థించారు. ఎన్నికల సంఘం అనుమతితో రానున్న రోజుల్లో చేవెళ్ల పార్లమెంటు పరిధిలో పాదయాత్రలను చేపట్టాలని అనుకుంటున్నాం. గడపగడపకూ తిరిగి బీసీ అభ్యర్థి గెలుపు ఆవశ్యకతను వివరించి చైతన్యపర్చే దిశగా కార్యక్రమాలను నిర్వహిస్తాం. మన ఓట్లు మనకే..నినాదంతో ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని నిశ్చయించుకున్నాం. బీసీ అభ్యర్థి గెలుపునకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణను రూపొందించుకుని అమలుపర్చనున్నాం.
చేతనైతే బీసీ అభ్యర్థిని గెలిపించండి.. అని కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతున్నరు. కుల అహంకారంతోనే ఆయన మాట్లాడినప్పటికీ.. బీసీల్లో కొరవడిన ఐక్యతను ఆయన తన మాటలతో ఎత్తిచూపించారు. బీసీలకు టికెట్లు ఇచ్చినప్పటికీ..గెలిపించుకునే సత్తా చూపించడం లేదన్న భావన ఆ నేత వ్యాఖ్యల్లో కనబడుతున్నది. ఇది బీసీలు గ్రహించి సవాల్గా తీసుకోవాలి. ఈ ఎన్నికల్లోనే బీసీలంతా ఐక్యతతో వ్యవహరించి సత్తా చూపించాల్సిన సమయం వచ్చింది. చేవెళ్ల పార్లమెంటు ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించుకోవడంపై అన్ని కుల సంఘాలు ఒక నిర్ణయానికి రానున్నాయి. బీసీల దమ్మేంటో ఈ ఎన్నికల్లో చూపించాలనుకుంటున్నారు. ఏదిఏమైనా..బీసీ అభ్యర్థిని గెలిపించి తీరుతం. అలాగే..బీసీలను అణగదొక్కాలనుకుంటున్న నేతలకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతాం.