మరో 18 ఎకరాలు లీజుకు తీసుకోవడంతో వ్యాపారులకు వెసులుబాటు
ఊపందుకున్న క్రయవిక్రయాలు
రోజుకు 1000 నుంచి 1200ల వాహనాలు వచ్చే అవకాశం
ప్రత్యేక దృష్టి సారించిన మంత్రులు, ఎమ్మెల్యేలు
మార్కెట్లో సకల సౌకర్యాల ఏర్పాటు
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 19: నూతనంగా ఏర్పాటు చేసిన బాటసింగారం పండ్ల మార్కెట్కు మంచి రోజులొచ్చాయి. ప్రస్తుతం మామిడికాయల సీజన్ కావడంతో మరో 18 ఎకరాలను లీజుకు తీసుకుని షెడ్లను ఏర్పాటు చేశారు. దీంతో వ్యాపారులకు మరింత వెసులుబాటు కలిగింది. దీంతో రోజురోజుకూ క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. నిత్యం 1000 నుంచి 1200 వాహనాలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంత్రులు నిరంజన్రెడ్డి, సబితారెడ్డి, ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, సుధీర్రెడ్డి, సుభాశ్రెడ్డి ప్రత్యేక దృష్టిని సారించి సకల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ మార్కెట్ నుంచి మామిడి కాయలను ఇతర రాష్ర్టాలతో పాటు విదేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుండడంతో ఇక్కడ వ్యాపారాలు కొనసాగించటానికి క్యూ కడుతుండడం విశేషం.
రంగారెడ్డిజిల్లా బాటసింగారంలో నూతనంగా ఏర్పాటుచేసిన పండ్ల మార్కెట్కు మంచిరోజులొచ్చాయి. ఈ మార్కెట్లో సరైన వసతుల్లేవని క్రయవిక్రయాలకు మొన్నటివరకు ససేమిరా అన్న వ్యాపారులు క్రమంగా ముం దుకు రావడంతో రోజురోజుకూ క్రయవిక్రయాలు ఊపందుకుంటున్నాయి. మార్కెట్లో వ్యాపారులు, రైతులు, కమీషన్ ఏజెంట్లకు అవసరమైన అన్ని రకాల వసతులను ప్రభుత్వం కల్పిస్తున్నది. ప్రస్తు తం మామిడికాయల సీజన్ ఆరంభమవుతున్న నేపథ్యంలో మామిడి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం 18 ఎకరాల్లో ప్రత్యేక షెడ్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. గత మామిడి సీజన్లో చైతన్యపురిలో ఉన్న పండ్ల మార్కెట్కు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి ప్రతిరోజూ 600 నుంచి 800 వాహనాల్లో మామిడి కాయలొచ్చా యి. ఈ సీజన్లోనూ ప్రతిరోజూ 1000 నుంచి 1200 వరకు మామిడికాయల వాహనాలొచ్చే అవకాశమున్న నేపథ్యంలో పండ్ల మార్కెట్లో ప్రత్యేకం గా మరిన్ని షెడ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగానే మంత్రులు నిరంజన్రెడ్డి, సబితాఇంద్రారెడ్డితోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, సుధీర్రెడ్డి, సుభాశ్రెడ్డి తదితరులు శుక్రవారం బాటసింగారంలోని పండ్లమార్కెట్ను పరిశీలించారు. మా మిడి సీజన్లో మామిడికాయలు అధికంగా వచ్చే అవకాశం ఉండటంతో ప్రస్తుతం ఉన్న పండ్ల మా ర్కెట్ పక్కనే ఉన్న మరో 18 ఎకరాలను లీజుకు తీసుకున్నారు. ఇందులో తాత్కాలికంగా షెడ్లను ఏర్పాటుచేసి కేవలం మామిడి క్రయవిక్రయాలకు మాత్రమే వినియోగించాలని భావిస్తున్నారు. గతం లో కొహెడ వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లకు ప్రతిరోజూ 600 నుంచి 800 వాహనాల్లో మా మిడికాయలొచ్చాయి. దానిని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది కూడా మరింత పెరిగే అవకాశముండటంతో అదనపు షెడ్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది.
విదేశాలకు పండ్ల ఎగుమతిలో బాటసింగారం కీలకం..
గతంలో చైతన్యపురిలో ఉన్న గడ్డిఅన్నారం పండ్లమార్కెట్ ఎగుమతులకు రాష్ట్రంలోనే పెట్టింది పేరు. ప్రసుత్తం ఈ మార్కెట్ను ప్రభుత్వం బాటసింగారం సమీపంలోని లాజిస్టిక్పార్కుకు మార్చింది. చైతన్యపురి పండ్లమార్కెట్ తరహాలోనే ఇక్కడి నుంచి కూడా వ్యాపారులు మామిడికాయలతోపాటు ఇతరత్రా పండ్లను విదేశాలకు ఎగుమతి చేసుకునేందు కు తగిన అవకాశాలను ప్రభుత్వం కల్పించింది. గడ్డిఅన్నారం పండ్లమార్కెట్లో వ్యాపారులు, రైతులు తమ పండ్లను నిల్వ చేసుకునేందుకు కోల్డ్స్టోరేజ్లను కూడా ఏర్పాటుచేసింది. అలాగే, వేసవిలో ఈ మార్కెట్ నుంచి విదేశాలకు పెద్ద ఎత్తున మామిడి పండ్లు ఎగుమతి అయ్యేవి.
ఈ ఏడాది కూడా బాటసింగారంలోని పండ్ల మార్కెట్ నుంచి వ్యాపారులు మామిడికాయలను విదేశాలకు ఎగుమతి చేసేందు కు అవసరమైన సౌకర్యాలనూ ప్రభుత్వం కల్పించింది. ఔటర్రింగ్రోడ్డుకు అతిసమీపంలో బాటసింగారం వద్ద ఈ మార్కెట్ను ఏర్పాటుచేశారు. ఓఆర్ఆర్ నుంచి మహారాష్ట్ర, ముంబై, బెంగళూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు మామిడిని ఎగుమతి చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. అలాగే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కూడా ఈ మార్కెట్కు అతిసమీపంలో ఉండటంతో విదేశాల కు ఇక్కడి నుంచి మామిడిపండ్లను ఎగుమతి చేసేందుకు వ్యాపారులకు దోహదపడుతుంది. ప్రస్తుతం ఈ మార్కెట్కు సంత్రాలు, ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్, అరటిపండ్లు వంటి తదితర పండ్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ప్రస్తుతం ఈ మార్కెట్ రాష్ట్రంలోనే క్రయవిక్రయాలు జరుపడంలో కీలకంగా మారింది.
కొహెడలో అత్యాధునిక వసతులతో..
ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్గా ప్రభుత్వం కొహెడలో 178 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇందుకోసం ఇప్పటికే శాశ్వత భవన నిర్మాణాలతో పాటు షెడ్ల నిర్మాణానికి కూడా డీపీఆర్ను తయారుచేసింది. ఈ డీపీఆర్ నివేదికను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆమోదించిన వెం టనే ఆయనతోనే కొహెడ పండ్లమార్కెట్కు శంకుస్థాపన చేయించాలని మంత్రులు నిర్ణయించారు. కొహెడ పండ్లమార్కెట్ పనులను వేగవంతం చేయాలనే ఉద్దేశంతోనే శుక్రవారం మంత్రులు నిరంజన్రెడ్డి, సబితారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, సుధీర్రెడ్డి, సుభాశ్రెడ్డి రూ.50 లక్షలతో కొహెడ ఓఆర్ఆర్ నుంచి పండ్ల మార్కెట్ వరకు 100 ఫీట్ల వెడల్పుతో ఏర్పాటు చేయనున్న రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పనులు పూర్తి కాగానే కొహెడలో పండ్ల మార్కెట్ నిర్మాణ పనులు ఆరంభం కానున్నాయి.
మామిడి సీజన్లో అదనపు షెడ్లు
బాటసింగారంలోని పండ్లమార్కెట్లో మామిడికాయల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యం లో 18 ఎకరాల్లో అదనపు షెడ్లను ఏర్పాటుచేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న షెడ్లతోపాటు మార్కెట్లో అదనపు షెడ్లనూ ఏర్పాటుచేసి వ్యాపారులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాం. అలాగే, త్వరలోనే పూర్తిస్థాయి శాశ్వత భవనాలతోపాటు కొహెడలోనూ పండ్ల మార్కెట్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ కొహెడలో నిర్మించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు.. దానికి అనుగుణంగానే ఈ మార్కెట్ నిర్మాణం పూర్తవుతుందన్నారు.
–మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం