ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 10 : వర్షాలు సమృద్ధిగా కురిసి.. భూగర్భజలాలు పెరిగిపోవటంతో బోరుబావుల ద్వారా వ్యవసాయానికి పుష్కలంగా నీరు అందుతున్నది. ఈ పరిస్థితిలో రైతులు ఎక్కువశాతం వరిసాగుపైనే దృష్టి సారించారు. రైతులంతా ఒకేసారి నారు పోసుకోవటంతో ఒకేసారి నారు ఎదిగి నాటువేస్తున్నారు. ఈ సమయంలో రైతులు.. కూలీల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. దీనికి తోడూ.. రోజురోజుకూ నాట్లువేసే కూలీల సంఖ్య కూడా తగ్గుతుంది. రైతులు… కూలీ రేట్లతో పాటు కూలీల కొరతతో ఇబ్బందులు పడకూడదన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుడుతున్నది. వరిసాగులో నాట్లువేసే పద్ధతికి స్వస్తి పలుకుతూ.. వెదజల్లే విధానంపై రైతులు దృష్టి సారించే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. అనేక రకాల నాటువేసే మిషన్లు వచ్చినప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవటంతో రైతులు వాటివైపు మొగ్గు చూపడంలేదు. పురాతనకాలం నాటి వెదజల్లే పద్ధతి అనుకూలంగా ఉండటంతో ప్రస్తుతం రైతులు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. గత రెండేండ్లుగా ఈ పద్ధతి వెలుగులోకి వస్తుండటంతో జిల్లావ్యాప్తంగా చాలామంది రైతులు ఈ విధానంపై మొగ్గు చూపుతున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈ వెదజల్లే పద్ధతిలో సాగు విధానం బాగా పెరిగింది.
సాధారణంగా ఎకరాపొలం నాటు వేయాలంటే కూలీలు రూ.3500నుంచి రూ.4000వరకు తీసుకుంటారు. వెదజల్లితే ఎకరాకు కేవలం రూ.400నుంచి రూ.500 ఖర్చు మాత్రమే అవుతుంది. అదీ వెదజల్లే వారికి ఇచ్చే కూలి. దిగుబడులు ఎకరాకు 35నుంచి 45బస్తాల వరకు వస్తున్నాయి. ముందుగా జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యేక అవగాహన కల్పించి ప్రతి క్లస్టర్లో 50ఎకరాల చొప్పున వెదజల్లే పద్ధతిలో సాగు చేయించారు. ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామంలో రైతు రఘువీరారెడ్డి వెదజల్లే పద్ధతిలో సుమారు రెండెకరాల్లో వరిసాగు చేయటం వలన మంచి దిగుబడి రావటంతో వ్యవసాయాధికారులు పలువురు రైతులను ఫీల్డ్ విజిటింగ్కు తీసుకెళ్లి అవగాహన కల్పించారు. ఈ విధానం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో అమలు చేసేందుకు పలువురు రైతులు ఈ యాసంగి సీజన్లో ముందుకు వచ్చి వెదజల్లే పద్ధతిపై దృష్టి సారిస్తున్నారు.
మా క్లస్టర్ పరిధిలోని వ్యవసాయశాఖ ఏఈవో శ్రవణ్ సూచనల మేరకు వరిలో వెదజల్లే పద్ధతిలో పంటను సాగుచేశాను. గతంలో నాటు వేయాలంటే 20నుంచి 25రోజుల పాటు కూలీల చుట్టూ తిరితేగానీ నాటు పడేదికాదు. అది కూడా ఎక్కువరేటు ఇస్తేనే పూర్తయ్యేది. ఈ బాధలన్నీ పడలేక వెదజల్లే పద్ధతిని పాటిస్తున్నా. గత సీజన్లో ఎకరాకు 45బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. ఈ సారికూడా అదే పద్ధతిలో పంటసాగు చేయాలని నిర్ణయించుకున్నా. నా పంట దిగుబడి చూసి మా గ్రామంలోని రైతులు ఈ విధానంపై మొగ్గు చూపుతున్నారు.
– రఘువీరారెడ్డి, రైతు, పోల్కంపల్లి
వెదజల్లడం రైతుకు చాలా తేలికైనా పని. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకుండానే వరి విత్తనాలను జల్లుకోవచ్చు. అన్ని విధానాల్లోకెల్లా ఇదే ఉత్తమమైన విధానం. మంచి అనుభవం ఉన్న వ్యక్తితో జల్లిస్తే మడిలో సమానంగా వరివిత్తనాలు పడి ఎక్కువ పిలకలు పెడుతుంది. వెదజల్లిన దగ్గరి నుంచి ఎరువులు, మందులు కావాల్సిన మోతాదులో సరైన సమయంలో అందిస్తే ఆశించిన దిగుబడి వస్తుంది. మా క్లస్టర్ పరిధిలో గతంలో పదిమంది రైతులతో వెదజల్లే విధానం సాగు చేయించాను. ఈసారి కూడా మరింతమందికి అవగాహన కల్పించి వెదజల్లే విధానంవైపు రైతుల దృష్టి మరలించేందుకు కృషిచేస్తున్నాం.
– శ్రవణ్కుమార్, ఏఈవో, ఇబ్రహీంపట్నం