షాద్నగర్టౌన్, జనవరి 17: తెలంగాణ ప్రభుత్వం బుధవారం నుంచి ప్రారంభించనున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిద్దామని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో జయలక్ష్మి అన్నారు. షాద్నగర్ ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం ఆర్డీవో రాజేశ్వర్ ఆధ్వర్యంలో కంటి వెలుగు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షాద్నగర్ డివిజన్లో కంటి వెలుగుకు సంబంధించి 10టీమ్లు ఉంటాయని, ప్రతి రోజూ గ్రామాల్లో 300మందికి, మున్సిపాలిటీల్లో 400మందికి కంటి పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేశామని వివరించారు. కంటి వెలుగు కార్యక్రమంలో 18 సంవత్సరాల పైబడిన వారందరికీ కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి రీడింగ్ అద్దాలను ఇవ్వనున్నట్లు తెలిపారు. కంటి పరీక్షల్లో ఎవరికైనా ఆపరేషన్ అవసరమైతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు రెఫర్ చేస్తామన్నారు. అనంతరం ఆర్డీవో రాజేశ్వరికి, ఏసీపీ కుషాల్కర్కు కంటి వెలుగు ఆహ్వాన పత్రికలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ నరహరి, వివిధ మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఐసీడీఎస్ సీడీవో, మెడికల్ అధికారులు, , సిబ్బంది పాల్గొన్నారు.
కంటి పరీక్షల యంత్రాలపై అవగాహన
యాచారం : మండలంలో కంటివెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని వైద్యాధికారి ప్రియాంక అన్నారు. మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం కంటివెలుగు కార్యక్రమంపై సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. కంటి పరీక్షలకు ఉపయోగించే ఆధునిక యంత్రాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. మండలంలో గురువారం తులేఖుర్ధు గ్రామంలో కంటివెలుగు కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు ఆమె తెలిపారు. కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఇది సువర్ణ అవకాశమన్నారు. ఎలాంటి కంటి రుగ్మతలున్నా పరీక్షించి తగిన వైద్యం అందించనున్నట్లు తెలిపారు. కంటివెలుగు సిబ్బంది ప్రతి గ్రామంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలన్నారు. ప్రయోగాత్మకంగా కొందరికి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యులు మౌనిక, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
విజయవంతం చేయాలి
కంటి వెలుగు కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో విజయవంతం చేయాలని చేవెళ్ల ఆర్డీవో వేణుమాధవ్రావు అన్నారు. చేవెళ్ల ఆర్డీవో కార్యాలయంలో రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమంపై డివిజన్ పరిధిలోని అన్ని మండలాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాట్లు, ప్రారంభోత్సవ సన్నాహకాలు, ఇతరత్రా ఏర్పాట్ల గురించి అధికారులతో సమీక్షించినట్లు తెలిపారు. చేవెళ్ల మండలంలోని ఆలూర్, అంతారం, షాబాద్ మండలంలోని మన్మర్రి, చందనవెళ్లి, శంకర్పల్లి మండలంలోని సింగాపురం, మొయినాబాద్ మండలంలోని చిలుకూరు, మొయినాబాద్ గ్రామాల్లో బుధవారం ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ దామోదర్, ఎంపీడీవోలు అనురాధ, హిమబిందు, సంధ్య, వెంకయ్య, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.