ఇష్టం వచ్చినప్పుడు సమ్మె అంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరిస్తామని రెండున్నరేండ్ల కిందటే చెప్పింది. అవి ఇప్పటికీ అమలు కాలేదు. అలాంటప్పుడు ఇప్పుడు సమ్మెకు పిలుపునిచ్చి మళ్లీ వెనక్కి తగడ్డం ఏంటి? సాధారణ ఆటో డ్రైవర్ల సమస్యలను కొందరు జేఏసీ నాయకులు వాడుకొని వారి పైరవీలు చేసుకుంటున్నారు. అలాంటి వారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
– మహ్మద్ సిరాజ్, ఆటో డ్రైవర్
“అదిగో పులి అంటే ఇదిగో తోక” అన్న చందంగా తయారైంది కొంతమంది ఆటో యూనియన్ జేఏసీ నాయకుల తీరు. సమస్యల పేరుతో పదేపదే ఆందోళనలకు పిలుపునివ్వడం.. చివరకు చర్చల పేరుతో వెనకి తగ్గడం పరిపాటిగా మారిందని కొందరు డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆటో డ్రైవర్లు ఎదురొంటున్న అసలు సమస్యలను పకనబెట్టి సంఘాల ముసుగులో కొందరు నాయకులమని చెప్పుకుంటూ స్వప్రయోజనాల కోసం సమ్మె రాజకీయాలకు తెరలేపుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు సమ్మె పేరుతో మూడు సార్లు బంద్కు పిలుపునిచ్చి తీరా సమ్మె రోజుకు కొన్ని గంటల ముందర సమ్మె రద్దు అని ప్రకటనలు చేయడం ఏంటని ఆటో జేఏసీ నాయకత్వంపై ఆటో డ్రైవర్లు రగిలిపోతున్నారు. జేఏసీ నాయకులు కేవలం ఫేక్ సమ్మెలకు పిలుపునిచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వారి పనులు చకబెట్టుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటగా ఉచిత బస్సుతో తొలి పిడుగు డ్రైవరన్నలపైనే పడింది. గిరాకీ లేకపోవడంతో కొందరు ఆటో బంద్ చేసి లేబర్ పనికి వెళ్తుండగా.. ఈఎంఐలు కట్టకపోవడంతో ఇంకొందరి ఆటోలను ఫైనాన్స్ కంపెనీలు లాక్కున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 215 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు ఆర్ధికసాయం, సంక్షేమ బోర్డు ఏర్పాటు తదితర హామీలు ఇచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా ఆదిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఆటో జేఏసీలోని ఓ ముగ్గురు నాయకులు తమ పబ్బం గడపడం కోసం క్షేత్రస్థాయిలో ఆటో డ్రైవర్లను తప్పుదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొత్తగా 10 వేల ఎల్పీజీ, 10 వేల సీఎన్జీ, ఈవీ ఆటోల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అందులో కొన్ని వందల ఆటోలు యూనియన్లో చక్రం తిప్పుతున్న ఓ ముగ్గురి నాయకుల ఖాతాలో చేరినట్టు డ్రైవర్లు చెబుతున్నారు. ఫైనాన్షియర్లతో కుమ్మక్కై బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపారన్నారు. ఒక్కో ఆటోపై ఆ యూనియన్ నాయకులు షోరూంలతో కలిసి ఫైనాన్స్ పేరుతో 3 లక్షల వరకు అదనంగా వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. జేఏసీ నాయకత్వం ఇదే తరహా పద్ధతి కొనసాగిస్తే వాహన సంఘాల జేఏసీ నుంచి తాము తప్పుకుంటామని కొన్ని సంఘాల నాయకులు బహిరంగంగానే చెప్తున్నారు. ‘మాకు కావాల్సింది సమ్మె రాజకీయాలు కాదు.. శాశ్వత పరిషారం’ అని డిమాండ్ చేస్తున్నారు.
కొందరు.. ఆటో యూనియన్ నాయకుల ముసుగులో రాజకీయం చేస్తున్నారు. వారి సొంత పనులకోసం ఆటో జేఏసీని వాడుకుంటున్నారు. అధికారుల వద్ద తమ పైరవీలు కానప్పుడు మాత్రమే సమ్మెకు పిలుపునిస్తున్నారు. సమ్మె ఉందని ఆటో డ్రైవర్లు అందరూ సిద్ధమైతే తీరా కొన్ని గంటల ముందర సమ్మె లేదని ప్రకటిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఆటో డ్రైవర్ల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. ఆటో డ్రైవర్లందరూ ఒక్కతాటిపైకొచ్చి సమస్యలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.