షాద్నగర్, మార్చి 28 /కడ్తాల్ ;జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రజాప్రతినిధులు శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మంగళవారం కడ్తాల్, కొందుర్గులలో ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ రమణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి బలం, బలగం కార్యకర్తలేనని, అందరం సమన్వయంతో సమష్టిగా పని చేద్దామని పిలుపునిచ్చారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించాలని, దేశంలోనే మన రాష్ర్టాన్ని ఆదర్శవంతంగా నిలిపేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని తెలియజేయాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలను దోచి పెద్దలకు పెడుతున్న విషయంపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు.
కడ్తాల్లో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని, బీజేపీకి ప్రజా బలం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీపై, ప్రజాప్రతినిధులపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి బీఆర్ఎస్ చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాలన్నారు. కొందుర్గులో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తప్ప చేసిందేమీ లేదన్నారు. ఉపాధి కూలీలకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనాలు కొత్త ఉత్సాహం నింపుతున్నాయని శ్రేణులు అభిప్రాయపడుతుండగా, ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లాలని ఇచ్చిన పిలుపుమేరకు సమన్వయంతో పనిచేసి, బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తీసుకోస్తామని కార్యకర్తలు, నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ నిరుపేదలు, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటుందని.. బీఆర్ఎస్కు కార్యకర్తలే బలం, బలగమని ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమ రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ రమణ, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం కడ్తాల్లోని ఏంబీఏ గార్డెన్స్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కంబాల పరమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో రమణ, జైపాల్యాదవ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తూ ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజలను మభ్యపెడుతున్న కేంద్ర ప్రభుత్వం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ విధానాలతో ప్రజలను మభ్యపెడుతున్నదని, దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టి పేదలను మోసం చేస్తున్నదని ఎమ్మెల్సీ రమణ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పేదల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ నిత్యావసరాల ధరలకు పెంపునకు కారణమైనదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నదని.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉండి కేంద్రాన్ని ఎదుర్కోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఆత్మీయ సమ్మేళాలను నిర్వహిస్తున్నామని.. నాయకులు, కార్యకర్తల మనోభావాలను తెలుసుకునేందుకు సమ్మేళనాలు ఉపయోగపడతాయని వివరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కారణజన్ముడు
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కారణజన్ముడని, ఆయన నాయకత్వంలో పని చేయడం మనందరి అదృష్టమని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బాస్లని, పార్టీ జెండా పేదలకు అండగా ఉంటుందని, కేసీఆర్ను తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలతో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్తో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆడబిడ్డల పెండ్లిళ్లకు ప్రభుత్వం అండగా ఉంటున్నదని తెలిపారు. గిరిజనులు, ఆదివాసీలకు త్వరలో పోడు భూముల పట్టాలను అందజేస్తామని వివరించారు. అన్ని కులాలకు ఆత్మ గౌరవ భవనాలను నిర్మిస్తున్నామని.. రజకులు, నాయీబ్రాహ్మణుల షాపులకు ఉచితంగా విద్యుత్ అందజేస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను కార్యకర్తలే ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు.
బడా సంస్థల చేతుల్లో దేశ సంపద
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలో దేశంలో అరాచకాలు, అన్యాయాలు పెరిగిపోయాయని, బడా సంస్థల యజమానులకు దేశ సంపదను అప్పజెప్పిందని ఆరోపించారు. కేంద్రం మాట వినని నేతలపై ఈడీలతో తప్పుడు కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నదని విమర్శించారు. బీజేపీయేతర రాష్ర్టాలపై పెత్తనం చెలాయించాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ పోరాటం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు కాలం చెల్లిపోయిందని, బీజేపీకి ప్రజాబలంలేదన్నారు. ప్రతిపక్షాలు చేసే నిరాధారమైన ఆరోపణలను బీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అంతకుముందు కడ్తాల్లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించి, ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కడ్తాల్లో బీఆర్ఎస్ భారీ ర్యాలీని నిర్వహించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, సులోచన, భారతమ్మ, హంశ్యా, విజయలక్ష్మి, లోకేశ్నాయక్, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, ప్రియ, మంజుల, మహిళా అధ్యక్షురాలు వాణిశ్రీ, నాయకులున్నారు.
సీఎం కేసీఆర్ పాలన దేశానికే స్ఫూర్తిదాయకం
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాలన దేశానికే స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ రమణ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో కొందుర్గులో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాల పనితీరును చూసి దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. దేశంలో రైతు రాజ్యాన్ని స్థాపించే దిశగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషిచేస్తున్నారని, అందుకు నిదర్శనమే ఇటీవల మహారాష్ట్రలో నిర్వహించిన బీఆర్ఎస్ సభలు అని వివరించారు. దేశవ్యాప్తంగా సాగు, తాగు నీరు, నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని, ఆయనకు మద్దతుగా మనమందరం అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష
రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్షతను చూపుతూ మనకు రావల్సిన నిధులు నిలిపివేసి ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఎమ్మెల్సీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులు సృష్టించినా రాష్ట్రంలో ప్రగతి పనులు ఆగడంలేదని, కేసీఆర్ కృషిఫలితంగా రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తున్నదని చెప్పారు. ఇష్టానుసారంగా ధరలు పెంచుతూ పేదలపై పెను భారాన్ని మోపుతున్న బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ నల్లదనాన్ని వెలికితీసి ప్రజల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేస్తా అని చెప్పి యేండ్లు గడుస్తున్నా ఆ ఊసే లేదని దుయ్యబట్టారు. గ్యాస్, చమురు ధరలు అదుపులేకుండా పెంచుతున్నారని, కేవలం ఆదానీకి దోచిపెట్టడం తప్ప ప్రజా సంక్షేమంపై మోదీకి ధ్యాస లేదని విమర్శించారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలకు పెద్దసంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు తరలిరావడం సంతోషకరమన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలకు వేల కోట్ల నిధులు ఖర్చు
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వానికి దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మడం తప్ప ప్రజలకు ఉపాధి చూపుదామనే ఆలోచన లేదని, నిత్యం ఏ సంస్థను అమ్ముదామనే ధ్యాసతో పనిచేస్తున్నదని మండిపడ్డారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులను ఇవ్వకుండా రాష్ట్ర ప్రజాప్రతినిధులను ఇబ్బందుకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే చీకట్లు కమ్ముకుంటాయని, రియల్ ధరలు పడిపోతాయని చెప్పిన నాయకులు నేడు రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధిని చూడాలన్నారు. రాష్ట్ర ప్రజలకు పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలను ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వేల కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నదని తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, దళిత బంధు వంటి ఎన్నో పథకాలు తెలంగాణ ప్రజలకు వరంగా మారాయన్నారు.
మిషన్ భగీరథతో మనందరికీ మంచి నీళ్లు వచ్చాయని, మిషన్ కాకతీయతో బోరుబావుల్లో నీళ్లు పెరిగాయని చెప్పారు. రాష్ట్రంలోని వందల సంఖ్యలో ఉన్న గిరిజనతండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా గుర్తించి గిరిజనులకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామీణ మారుమూల పల్లెలు అన్ని రంగాల్లో ప్రగతి సాధించాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో చర్చ జరుపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కొందుర్గు మండలానికి చెందిన అయోధ్యపూర్తండా, శ్రీరంగాపూర్, రేగడిచిల్కమర్రి, కొందుర్గుకు చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ బలోపేతానికి మరింత కృషిచేయాలని వారికి సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రామకృష్ణారెడ్డి, రాంబల్నాయక్, దామోదర్రెడ్డి, రాజేశ్ పటేల్, శ్రీధర్రెడ్డి, కృష్ణయ్య, బందూలాల్, రామకృష్ణ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.