నందిగామ, ఫిబ్రవరి 26: ప్రతి వ్యక్తి తన జీవితంలో ధ్యానాన్ని భాగంగా చేసుకోవాలని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. నందిగామ మండలం కన్హా శాంతివనంలో హార్ట్ఫుల్ నెస్ అంతర్జాతీయ స్పోర్ట్స్ సెంటర్ను ఆదివారం రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శ్రీరామచంద్ర మిషన్ గురూజీ కమటేశ్ పటేల్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్తో కలిసి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రారంభించారు. హార్ట్ఫుల్నెస్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్, ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ సంయుక్త సహకారంతో ఈ సెంటర్ను ఏర్పాటుచేయగా, ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు గ్రీన్ కన్హా రన్లో భాగంగా కన్హాలో ఏర్పాటు చేసిన 2కే, 5కే, 10కే, 21కే రన్ పోటీలను రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్, బ్యాడ్మింటన్ గోపీచంద్ ప్రారంభించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి మంత్రులు బహుమతులు అందజేశారు. ధ్యాన గురువు కమలేశ్ పటేల్తో కలిసి ధ్యాన కేంద్రంలో ధ్యానం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ధ్యాన కేంద్రం, కన్హా శాంతివనంలో ఏర్పాటు చేసిన గ్రీనరీలోని ఆహ్లాదకరమైన వాతావరణం గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు. ధ్యాన కేంద్రం, యోగా, క్రీడలు అన్ని ఒకే చోట ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. కన్హాలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ సెంటర్ను స్పోర్టింగ్ ఎక్సలెన్స్కు కేంద్రంగా అభివృద్ధి చేయాలనే గురూజీ ఆలోచన అభినందనీయమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది…
శ్రీ రామచంద్ర మిషన్ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రభుత్వం పలు అవార్డులను అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో దేశ, విదేశాల నుంచి విచ్చేసిన ప్రముఖులు, హార్ట్ఫుల్నెస్ సాధకులు, యువతీయువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.