సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : జవహర్నగర్ డంపింగ్ యార్డుపై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు మరో నాలుగు డంపింగ్ యార్డుల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ కసరత్తు ప్రారంభించింది. జనావాసాలకు దూరంగా వీటిని ఏర్పాటు చేయాలని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటిస్తున్నారు.
స్థలాలను పరిశీలిస్తున్నారు. స్థల సేకరణ ఒక్కటే కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్యావరణంగాపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ, కొత్తగా ఏర్పాటు చేసే డంపింగ్ యార్డులతో స్థానిక ప్రజలను ఒప్పించడం వంటి అంశాలపై దృష్టి పెట్టారు. జీహెచ్ఎంసీ ఇతర నగర పాలక సంస్థల నుంచి రోజు వారీగా ప్రతిరోజూ సుమారు 7611 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు.
వీటిని నిల్వ ఉంచకుండా ట్రీట్మెంట్ డిస్పోజల్ చేసే ప్రక్రియకు ఎకువ ప్రాధాన్యం ఇస్తున్నారు. తడి చెత్త ద్వారా కంపోస్టు ఎరువు, బయో గ్యాస్, ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయడం, పొడి చెత్తలో కాలే గుణం గల వ్యర్థాలను పోగు చేసి.. విద్యుత్ తయారీకి వినియోగిస్తున్నారు. జవహర్నగర్తో పాటు కొత్తగా ఏర్పాటు చేసే డంపింగ్ యార్డు వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి.. టీఎస్ఎస్పీడీఎల్ సమన్వయంతో విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించనున్నట్లు అధికారులు తెలిపారు.