రంగారెడ్డి, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): జిల్లాల విస్తరణలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ, హైదరాబాద్ మహా నగరాన్ని రంగారెడ్డి జిల్లా ఆవరించే ఉన్నది. దీంతో రంగారెడ్డి జిల్లాలో పండే పంటల క్రయవిక్రయాలకు అనాదిగా హైదరాబాద్ కేంద్రంగా నిలుస్తున్నది. జిల్లాలో అమితంగా పండుతున్న వరి, మొక్కజొన్న పంటల అనంతర పంటలతో పోల్చుకుంటే కూరగాయలు, ఆకుకూరల సాగు మాత్రమే ఎక్కువగా కొనసాగుతున్నది. జిల్లాలో వివిధ రకాల పంటలకు సంబంధించి 3.5 లక్షల ఎకరాల నుంచి 4 లక్షల ఎకరాలకు పైగా సాగు జరుగుతున్నది. జిల్లాలోని రైతాంగం అంతా సంప్రదాయ పంటల సాగును వీడి త్వరితగతిన లబ్ధి పొందే పంటల సాగుపై మొగ్గు చూపుతున్నారు.
దీర్ఘకాల పంటలను సాగు చేయడం వల్ల చేతిలో డబ్బులు లేకపోవడమే కాకుండా నష్టాలను సైతం చవిచూడాల్సి వస్తున్నదని చాలా మంది రైతులు అనుభవపూర్వకంగా చెబుతున్నారు. వరి, మొక్కజొన్న సాగులో పని పెద్దగా లేనప్పటికీ, పంట ఒకేసారి చేతికి అందడం, దీంతో లాభాలు వస్తే ఫరవాలేదు. మరి నష్టాల్ని భరించాల్సి వస్తే.. తట్టుకునే పరిస్థితులు లేవు. పైగా పంటల సాగుకు తెచ్చిన పెట్టుబడులు కూడా సరిపోయే పరిస్థితి లేదంటున్నారు. దీంతో జిల్లాలో చాలామంది రైతులు కూరగాయలు, ఆకుకూరల సాగుపై మక్కువ చూపుతున్నారు. ఈ పంటల సాగుతో ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదని కూరగాయల రైతులు అంటున్నారు.
రూ.1500 నుంచి 2500 వరకు లబ్ధి
జిల్లావ్యాప్తంగా వానకాలంలో 15,847 ఎకరాల్లో కూరగాయల సాగును చేపట్టారు. యాసంగి సీజన్లో 18,662 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయల సాగును చేపడుతున్నారు. మొత్తంగా జిల్లాలో 34,509 ఎకరాల్లో కూరగాయల సాగును కొనసాగిస్తున్నారు. రైతులు ఆర్థికంగా నిలబడుతూ, తోటి వారికి వారి తోటల్లో కూలీ పనులు కల్పిస్తూ భృతిని, ఉపాధిని అందిస్తున్నారు. జిల్లాలో కూరగాయల సాగు చేస్తున్న ఒక్కో రైతు రోజుకు కనీసం రూ.1500 నుంచి 2500 వరకు లబ్ధిపొందుతున్నాడు.
ఏడాదికి 3,08,460 మెట్రిక్ టన్నుల దిగుబడి
జిల్లావ్యాప్తంగా 34,509 ఎకరాల్లో కూరగాయల సాగు జరుగుతుండగా, చిన్న, సన్నకారు రైతులు తమకు ఉన్న చిన్న కమతంలోనే ఆకుకూరలు, కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. వానకాలంలో 19,773 మంది రైతులు, యాసంగిలో 20,748 మంది రైతులు కూరగాయల సాగును ఆదరువుగా చేసుకొని జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో మొత్తంగా 40,521 మంది రైతులు కూరగాయలు, ఆకుకూరల సాగునే ప్రధానంగా నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నారు. ఏడాదికి 3,08,460 మెట్రిక్ టన్నుల కూరగాయల దిగుబడి వస్తున్నది. స్వల్ప కాలంలో వచ్చే పంటలు కావడంతో ఒక పంటలో లాభాలు పెద్దగా రాకపోయినా, రెండో పంటలె కలిసొస్తున్నాయి. ఇంకా రెండు పంటల్లోనూ కలిసి రావడంతో లాభాలు దండిగా ఆర్జిస్తున్నారు.
బీరకాయ, సొరకాయ, చిక్కుడుకాయ, పొట్లకాయ, టమాట, బెండకాయ, వంకాయ, గోకరకాయ, కాకరకాయ, బీన్స్, బీట్రూట్, క్యాబేజీ, గోంగూర, పాలకూర, తోటకూర, మెంతికూర, చుక్కకూర, పుదీన, కొత్తిమీర, పాయిలు కూర, గంగవాయిలి కూర, బచ్చలికూర, గంజేరుకూర, ఉల్లాకు, కరివేపాకు లాంటివి పండిస్తున్నారు. కూరగాయల క్రయ విక్రయాలకు సంబంధించి రవాణాకు పెద్దగా ఇబ్బంది పడే ఆస్కారం లేదు. సరుకు మార్కెట్కు తరలించేంత వరకే పని, ఆ తరువాత ఏమీ ఉండదు. వేకువజామునే తోటల్లోకి కూలీవాళ్లతో వెళ్లి కూరగాయలు, ఆకుకూరలను తెంచి, కట్టలు కట్టేందుకే శ్రమపడాల్సి వస్తుంది. కూరగాయలను నగరంలోని గుడిమల్కాపూర్, మోండా, మెహిదీపట్నం, కొత్తపేట, పహాడీషరీఫ్ మార్కెట్లకు తరలిస్తున్నారు.
అందుబాటులో కూలీలు
ప్రస్తుతం వేస్తున్న ఆరు తడి పంటలు స్పల్ప కాలంలో చేతికి అందివస్తుండటంతో కూలీలకు పెద్దగా ఇబ్బందులు లేకుండా పోయాయి. కొన్ని గంటల పని ఉండటంతో కూలీలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సంప్రదాయ పంటల సాగుకు సంబంధించిన పనులకు కూలీలు నిరాసక్తత చూపుతున్నారు. చేతినిండా డబ్బులు కనిపించే పనికే ఆసక్తిగా వెళ్తున్నారు. కూలీలు గంపగుత్తగా మాట్లాడుకొని రోజుకు రూ.1500 నుంచి 2000 దాకా సంపాదిస్తున్నారు.
కూరగాయల సాగు ఇబ్బంది లేకుండా..
– జంగ బాలమణి, జంగోనిగూడ
ఎక్కువ నీటితో సాగు చేసే వరి పంటల కన్నా, తక్కువ నీటితో పండే కూరగాయలు, ఆకుకూరల పంటల సాగుతో మంచి లాభాలు వస్తున్నాయి. నాకున్న ఎకరం పొలంలో ఇప్పుడు బెండకాయలు, కొత్తిమీరను పండిస్తున్నా. వరి, మొక్కజొన్న తెరువు పోకుండా కూరగాయలు, ఆకుకూరలు వేస్తున్న. ఒక రోజు తప్పించి, ఒక రోజు మార్కెట్కు కూరగాయలు తీసుకుపోతున్న.
పదిహేనేండ్లుగా కూరగాయల సాగు..
– బోళ్ల నర్సమ్మ, తలకొండపల్లి
గత పదిహేనేండ్లుగా కూరగాయల సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నా. ఇప్పుడైతే ఎకరం టమాట, పావు ఎకరం మిరప పంటలను వేశాను. వరి, పెసర, కంది లాంటి సంప్రదాయ పంటల కంటే కూరగాయల పంటలు వేయడం వల్ల ఎప్పుడూ చేతిలో డబ్బులు కనిపిస్తాయి. పైగా, ఇబ్బందులు ఏమీ ఉండవు. గడ్డి విత్తనాల మాదిరిగా కూరగాయల విత్తనాలకూ సబ్సిడీ ఇస్తే బాగుండేది.
కూరగాయల సాగు ఎంతో మేలు..
– జె.బాలమణి, నందిగామ
ఎక్కువ నీటితో వరి సాగు చేయడం కన్నా తక్కువ నీటితో పండే కూరగాయల సాగుతో మంచి లాభాలు వస్తున్నాయి. నాకున్న ఎకరా పొలంలో ప్రస్తుతం బెండ, కొత్తిమీర పంటలు సాగు చేస్తున్నాను. ఒక రోజు తప్పించి ఒక రోజు కూరగాయల మార్కెట్కు తీసుకువెళుతుండటంతో కొంతమేరకు ఆర్థిక ఇబ్బందులు తప్పుతున్నాయి.
కూరగాయల సాగుతో అధిక దిగుబడి
– శ్రీనివాస్రెడ్డి, మంచాల
వరికి బదులు కూరగాయల సాగు చేసుకుంటే అధిక దిగుబడితో పాటు వచ్చే డబ్బులతో కుటేంబం ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు ఇచ్చిన రెండు ఎకరాల పొలంలో టమాట, చిక్కుడు, కాకర, సొర, బీరకాయలతోపాటు కొత్తిమీర, పుదీన పంటలను సాగు చేసుకొని అధిక లాభాలు పొందుతున్నాను. ప్రతి రైతు ఆరుతడి పంటలపై దృష్టి పెట్టినైట్లెతే వరి కంటే మూడు రెట్లు లాభాలు పొందవచ్చు.