పెద్దేముల్, ఆగస్టు 18: భక్తులు, ప్రజల కోరికలు తీర్చుతూ కొంగుబంగారంగా నిలిచారు అంబురామేశ్వరస్వామి వారు. మండలంలోని తట్టేపల్లి, పాషాపూర్ గ్రామాల మధ్యలో చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యద్భుతంగా అంబురామేశ్వరాలయం వెలసిం ది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా శ్రావణమాసంలోని చివరి సోమవారం (ఈ నెల 22తేదీన)రోజున స్వామి వారి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జాతరకు మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన వారితోపాటు తాండూరు, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, జహీరాబాద్, కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా, చించోలి, కుంచారం తదితర గ్రామాల నుంచి కూడా వేలా ది మంది భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకోనున్నారు.
ఆలయ చరిత్ర..
అంబురామేశ్వరస్వామి వారు ప్రతి ఏడాది శ్రావణ మాసంలో భక్తులతో ప్రత్యేక పూజలు అందుకుంటారు. కాగా ఈ ఆలయం త్రేతాయుగంలో వెలుగులోకి వచ్చినట్లు భక్తులు పేర్కొంటున్నారు. కాగా ఈ నెల 22న స్వామి వారి జాతరను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లను ప్రా రంభించారు. ఈ నెల 21న రాత్రి స్వామివారిని పల్లకిలో ఆలయం వరకు తట్టేపల్లి గ్రామం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ నెల 22న ఉదయం నుంచి సాయం త్రం వరకు స్వామి వారికి ప్రత్యేక పూజ లు, అభిషేకాలు, భక్తుల దర్శనం, అన్నదాన కార్యక్రమాలుంటాయి. అనంతరం సాయంత్రం సమయంలో స్వామి వారిని తట్టేపల్లికి తీసుకెళ్లడం ఈ ఆలయం ఆనవాయితీగా ప్రతి ఏడాది వస్తున్నది. త్రేతాయుగం నుంచి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న గుట్టల మధ్య నుంచి వస్తున్న జలధార ఇక్కడి ప్రత్యేకత.
జాతరకు గట్టి పోలీసు బందోబస్తు
మండలంలోని తట్టేపల్లి, పాషాపూర్ గ్రామాల మధ్యలోని అటవీ ప్రాంతంలో వెలిసిన అంబురామేశ్వరాలయ జాతరకు గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నాం. ఈ నెల 22 సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుం డా చర్యలు తీసుకుంటాం. ఆలయ ప్రాంగణంలో ఎవరూ మద్యం, బెల్టు షాపులను ఏర్పాటు చేయొద్దు. చేస్తే చర్యలు తప్పవు. పోలీసులు, ఆలయ కమిటీ నిర్వాహకులకు భక్తులు సహకరించాలి.
– అబ్దుల్ రవూఫ్, ఎస్ఐ పెద్దేముల్