ఆమనగల్లు : పంట వివరాలను క్షేత్రస్థాయి సిబ్బంది పకడ్బందీగా నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆమనగల్లు మండలంలోని రాంనుంతల గ్రామాన్ని ఆమె సందర్శించి వానకాలం పంటల నమోదు పక్రియను పరిశీలించారు. ఏఈఓలు పంటల నమోదును ఏలా చేస్తున్నారని నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయి పర్యటనలు చేసి వివరాలు నమోదు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. రాంనుంతల గ్రామంలో రైతులు శంకర్నాయక్, బోడ్యాలు సాగు చేసిన వరిపంటను పరిశీలించారు. అనంతరం ఏఓ అరుణ కుమారికి పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ నెల 15వరకు మండలంలో పంటల నమోదును పూర్తి చేసి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. గ్రామాల్లో పంట నమోదు వల్ల భవిష్యత్లో రైతులు తమ పంటలను విక్రయించేందుకు సులభతరం అవుతుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కాని ఏమైనా విపత్కర పరిస్థితులు తల్లెత్తి వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రభుత్వానికి పంటకు సంబంధించిన పూర్తి డాటా దొరుకుతుందని ఆమె చెప్పారు. క్లస్టర్ పరిధిలో సిబ్బంది రైతులు సాగు చేసిన ప్రతి పంట వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, పంట నమోదులో ఆలసత్వం ప్రదర్శిస్తే అట్టి సిబ్బంది పై చర్యలు తీసుకొంటామని ఆమె హెచ్చరించారు. క్షేత్రస్థాయి పర్యటనలో ఏమైనా ఇబ్బందులు తల్లెత్తితే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పంటల సాగులో రైతులకు సలహాలు, సూచనలు చేసి పంటల దిగుబడి పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఓలు శివతేజ, సాయిరాం, మౌన్యరెడ్డి, రాణిలు పాల్గొన్నారు.