ఇబ్రహీంపట్నం /షాద్నగర్రూరల్, నవంబర్ 6 : ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతున్నా.. ప్రతిపక్ష పార్టీల్లో టికెట్ల లొల్లి సద్దుమనగడం లేదు. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ దండెం రాంరెడ్డి రెబల్ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ టికెట్ కోసం చివరివరకు పోరాడిన దండెం రాంరెడ్డి ఒకానొక దశలో గాంధీ భవన్లో ఆందోళన కూడా చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో రెబల్గా బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు.
ఇక షాద్నగర్ బీజేపీలో అసమ్మతి సెగ రగులుతున్నది. బీజేపీ అభ్యర్థింగా అందె బాబయ్య పేరును అధిష్ఠానం ప్రకటించింది. దీంతో నిరాశ చెందిన ఆ పార్టీ సీనియర్ నేత పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి బీజేపీపై దుమ్మెత్తిపోస్తూ ఏఐఎఫ్బీ(అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ పార్టీ)లోకి చేరారు. కాగా, ఫరూఖ్నగర్ మండలంలోని కాశిరెడ్డిగూడలో సోమవారం బీజేపీ ప్రచారం నిర్వహిస్తుండగా.. ప్రచారం రథంపై ‘తమ నాయకుడి(పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి)ఫొటో ఎందుకు వేశారంటూ’ ఆగ్రహంతో ఓ కార్యకర్త ఫ్లెక్సీని చించి నిరసన తెలిపాడు.