దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు.. పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది.. తెలంగాణ ప్రభుత్వం పల్లెల అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. నూతన పంచాయతీలను ఏర్పాటు చేయడంతో పాటు పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నది.
నవాబుపేట, సెప్టెంబర్ 8 : మండలంలోని మైతాబ్ఖాన్గూడ నూతన పంచాయతీగా ఏర్పడింది. పల్లె ప్రగతి, ప్రత్యేక నిధులతో గ్రామం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. రూ. 20 లక్షల నిధులతో పంచాయతీ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి ఇటీవల ఎమ్మెల్యే శంకుస్థాపన చేయగా, సర్పంచ్ అనితారెడ్డి పనుల్లో వేగం పెంచారు. గ్రామంలోని ప్రతి వార్డులోనూ సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మాంచారు. గ్రామ రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలను నాటి ట్రీ గార్డులను ఏర్పాటు చేయడంతో పచ్చని తోరణాల్లా దర్శనమిస్తున్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమంతో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కూల్చడంతో పాటు పడావు బావులను పూడ్చారు.
గ్రామ పరిశుభ్రతను కాపాడటానికి రాష్ట్ర సర్కార్ ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను ఇచ్చింది. నిత్యం ఉదయం ప్రతి ఇంటికి వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. దీంతో వార్డులన్నీ పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. ట్యాంకర్తో హరితహారం మొక్కలకు నీళ్లు పోస్తున్నారు.
గ్రామస్తులు సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకుని ఆదర్శంగా నిలిచారు. నూతనంగా ఏర్పడిన చిన్న గ్రామం కాబట్టి అభివృద్ధి చేసుకోవాలని ఐక్యంగా ఉన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో వీధి లైట్లు ఏర్పాటు చేయడానికి రూ.లక్షా 70 వేలతో కొత్త స్తంభాలు, 1,782 మీటర్ల వైర్ ఏర్పాటు చేసుకున్నారు. హరితహారం కోసం రూ. 56 వేలతో నర్సరీ ఏర్పాటు చేసుకుని, 5 వేల మొక్కలను పెంచారు. గ్రామపంచాయతీలో రూ.2లక్షల 21వేల ఖర్చుతో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు.
ఇదివరకు అస్తవ్యస్తంగా ఉన్న గ్రామం.. నూతన పంచాయతీ ఏర్పాటు తర్వాత రూపురేఖలు మారాయి. ఏ వీధి చూసినా సీసీ రోడ్లు దర్శనమిస్తున్నాయి. గ్రామ సమీపంలో క్రీడాప్రాంగణం ఏర్పాటు చేయడంతో విద్యార్థులు, యువకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్య సహకారంతో మైతాబ్ఖాన్గూడ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయ్యాయి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు వచ్చిన మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి గ్రామ వాతావరణాన్ని చూసి ప్రశంసించారు.
– అనితారెడ్డి, మైతాబ్ఖాన్గూడ సర్పంచ్
పల్లె ప్రగతి’తో గ్రామ రూపురేఖలు మారాయి. ప్రభుత్వ నిధులతో ఒక్కో అభివృద్ధి పని పూర్తయ్యింది. రూ.20లక్షలతో పంచాయతీ భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.
– రంగారెడ్డి,
ఐక్యంగా గ్రామాభివృద్ధి కృషి..
గ్రామస్తులమంతా ఐక్యంగా ఉంటాం. సర్పంచ్ గ్రామస్తుల సూచనలు, సలహాలు తీసుకుంటారు. ఏదైన పని చేయాలంటే గ్రామసభలో చర్చంచి నిర్ణయాలు తీసుకుంటారు.
– బీరుబాల్, గ్రామ యువకుడు