వికారాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వికారాబాద్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించనున్నారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి తరగతులు జరుగనుండగా.. సీట్ల కేటాయింపు ప్రక్రియ షురూ అయ్యింది. ఆలిండియా కోటా మొదటి రౌండ్ కౌన్సిలింగ్లో జిల్లా మెడికల్ కాలేజీలో వైద్య విద్యనభ్యసించేందుకు ఇద్దరు విద్యార్థులు ఎంపిక చేసుకున్నారు. ఆలిండియా, ఇతర కోటాల కింద ఈ నెలాఖరు వరకు కౌన్సిలింగ్తోపాటు అలాట్మెంట్, సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తి కానుంది. కాలేజీ శాశ్వత భవన నిర్మాణానికి రెండేండ్లు సమయం పట్టే అవకాశాలున్నందున ప్రస్తుతానికి అనంతగిరిలోని టీబీ శానిటోరియంలో తరగతుల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అదేవిధంగా వికారాబాద్ ప్రభుత్వాసుపత్రిని మెడికల్ కాలేజీకి అనుబంధ బోధనాసుపత్రిగా 380 పడకలతో అందుబాటులోకి తెస్తున్నారు. అందుకోసం రూ.30 కోట్లతో ఏరియా దవాఖానపై మరో రెండంతస్తులు నిర్మిస్తుండగా పనులు తుది దశకు చేరుకున్నాయి.
జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి విద్యార్థుల అలాట్మెంట్ ప్రక్రియ షురూ అయ్యింది. ఆల్ ఇండియా కోటా మొదటి రౌండ్ కౌన్సిలింగ్లో జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైద్య విద్యనభ్యసించేందుకు ఇద్దరు విద్యార్థులు ఎంపిక చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వంశీ, బీహార్ రాష్ర్టానికి చెందిన ఆయుష్రాజ్ ఉన్నారు. ఆల్ ఇండియా కోటా, ఇతర కోటాల కింద ఈ నెలాఖరు వరకు కౌన్సిలింగ్తోపాటు అలాట్మెంట్, సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తి కానుంది. 2023-24 విద్యా సంవత్సరంలో జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ కాలేజీలో ప్రతి ఏటా 100 సీట్లను పెంచనున్నారు. మెడికల్ కాలేజీకి అవసరమైన మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బందిని ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. వివిధ విభాగాలకు 39 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను ప్రభుత్వం నియమించింది. అనాటమీ-1, ఫిజియోలజీ-1, బయో కెమిస్ట్రీ-2, పాథాలజీ-2, మైక్రో బయోలజీ-1, ఫోరెన్సిక్ మెడిసిన్-1, కమ్యూనిటీ మెడిసిన్-1, జనరల్ మెడిసిన్-5, పిడియాట్రిక్స్-3, డీవీఎల్-1, సైకియాట్రిక్-1, జనరల్ సర్జరీ-5, ఆర్థోపెడిక్-2, ఈఎన్టీ-1, ఓబీజీ-6, అనస్తీషియా-4, రేడియో డయాగ్నోసిస్-2, అడ్మిన్-1 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను మంజూరు చేసింది.
వచ్చే నెల మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభం
తరగతులు సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీ శాశ్వత భవన నిర్మాణం రెండేండ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్న దృష్ట్యా అనంతగిరిలోని టీబీ శానిటోరియంలో తాత్కాలికంగా తరగతులను నిర్వహించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. టీబీ శానిటోరియంలోనే రెండేండ్లపాటు తరగతులను నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్సిగ్నల్ ఇప్పటికే ఇవ్వడంతోపాటు తరగతుల నిర్వహణ, మౌలిక సదుపాయాలకు అవసరమైన నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. పనులు దాదాపు పూర్తయ్యాయి. రెండు లెక్చర్ హాళ్లను సిద్ధం చేశారు. మొదటి సంవత్సరంలో నిర్వహించే అనాటమీ, ఫిజియోలజీ, బయో కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి ల్యాబ్ గదులను కూడా సిద్ధం చేశారు. అనాటమీ, ఫిజియోలజీ, బయో కెమిస్ట్రీలకు సంబంధించి ల్యాబ్ పరికరాలకు సంబంధించి ఇప్పటికే జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అందుబాటులో ఉంచినట్లు జిల్లా మెడికల్ కాలేజీ ఉన్నతాధికారులు వెల్లడించారు. సెంట్రల్ లైబ్రరీ, విద్యార్థులు, విద్యార్థినులకు ప్రత్యేకంగా వసతి గృహాలు తదితర ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.
బీ శానిటోరియంలో గతంలో నర్సుల క్వార్టర్స్గా ఉన్న భవనాన్ని మెడికల్ కాలేజీ విద్యార్థినుల వసతి గృహంగా, గతంలో ఉన్న చిల్డ్రన్స్ క్వార్టర్స్గా ఉన్న భవనాన్ని విద్యార్థుల హాస్టల్గా ఏర్పాటు చేశారు. వికారాబాద్ ప్రభుత్వాసుపత్రిని మెడికల్ కాలేజీకి అనుబంధ బోధనాసుపత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వగా, అనుబంధ ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా 380 పడకలతో బోధనాసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రూ.30 కోట్లతో ఏరియా ఆసుపత్రిపై మరో రెండంతస్తుల నిర్మాణాన్ని చేపట్టారు. బోధనాసుపత్రి నిర్మాణ పనులను నెలరోజుల్లో పూర్తి చేసేందుకు టీఎస్ఎంఐడీసీ అధికారులు చర్యలు చేపట్టారు. 100 సీట్లతో జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంజూరు చేయడంతోపాటు మెడికల్ కాలేజీ నిర్మాణం, ఆసుపత్రి అప్గ్రేడింగ్, పరికరాలు, ఫర్నిచర్ కొనుగోలుకు రూ.235 కోట్లను సర్కారు కేటాయించింది.
జిల్లా ప్రజలకు సత్వర, నాణ్యమైన వైద్యసేవలు
జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 380 పడకల అనుబంధ బోధనాసుపత్రి అందుబాటులోకి రానునుండడంతో ఒకట్రెండు నెలల్లో 26 రకాల నాణ్యమైన వైద్య సేవలు గ్రామీణ ప్రాంతంతో కూడుకొని ఉన్న జిల్లా ప్రజలకు అందనున్నాయి. ఐసీయూ, ట్రామా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు ఇప్పటికే రెగ్యులర్ పోస్టుల్లో భాగంగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, ల్యాబ్ టెక్నీషియన్, స్టోర్ కీపర్, చీఫ్ బయో కెమిస్ట్, మెడికో సోషల్ వర్కర్, గ్రేడ్-1, 2 సీనియర్, జూనియర్ రెసిడెంట్లు, ఈసీజీ టెక్నీషియన్, టీబీ అండ్ చెస్ట్ డిసీజ్ హెల్త్ విజిటర్, హెల్త్ ఎడ్యుకేటర్, చైల్డ్ సైకాలజిస్ట్, ఫిజియో థెరపిస్ట్, ఆడియో మెట్రి టెక్నీషియన్, ఆప్టీషియన్, థియేటర్ అసిస్టెంట్, మేల్ నర్సింగ్, బ్లడ్ బ్యాంక్ అధికారి పోస్టులు మంజూరైన దృష్ట్యా సంబంధిత సేవలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వపరంగా నాణ్యమైన వైద్య సేవలు అందనున్నాయి. సాధారణ వైద్య సేవలు మినహా మిగతా వైద్య సేవల కోసం తప్పనిసరిగా జిల్లా నుంచి హైదరాబాద్కు వెళ్లక తప్పడంలేదు. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినా, ఇతర అత్యవసర వైద్య సేవలు పొందాలంటే హైదరాబాద్లోని ఏదో ఒక ఆసుపత్రికి తీసుకుపోవాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా నుంచి హైదరాబాద్కు తీసుకువెళ్లేసరికి మార్గమధ్యంలోనే చాలామంది మృత్యువాత పడుతున్నారు. అదే మెడికల్ కాలేజీతోపాటు బోధనాసుపత్రి అందుబాటులోకి వస్తే అన్ని రకాల వైద్య సేవలు, అత్యాధునిక వైద్య చికిత్సలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.