ఇబ్రహీంపట్నం, ఫ్రిబవరి 14 : ప్రజా అవసరాలకు తగ్గట్టుగా పాల ఉత్పత్తిని పెంచేందుకు పశుసంవర్ధక శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. ఎదకు వచ్చిన బర్రెలకు గోపాల మిత్రల ద్వారా ఏఐ వ్యాక్సినేషన్ ప్రక్రియను నిరంతరం చేపడుతుండగా, తాజాగా ఆడ దూడలకు బ్రూసెల్లా టీకా అందిస్తున్నది. సుడి సమయంలో పశువుల్లో గర్భస్రావం కాకుండా 3 నుంచి 8 నెలల్లోపు వయస్సుగల బర్రె, ఆవు దూడలకు ఉచితంగా వ్యాక్సిన్ కొనసాగుతున్నది.
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో 28,750 దూడలను గుర్తించిన అధికారులు ఇప్పటి వరకు 22,480 దూడలకు టీకాలు పూర్తి చేశారు. టీకాలు పూర్తి చేసిన వెంటనే ఆయా దూడలకు చెవి పోగులు వేసి, ఐఎన్ఐపీహెచ్ యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు. ఈనెల 1 నుంచి ప్రారంభమైన ఈ టీకాల పంపిణీ కార్యక్రమం మరో వారం రోజుల పాటు నిర్వహించనున్నట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి అంజిలప్ప తెలిపారు. జిల్లాలో 42 టీంలు టీకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.
వ్యాక్సినేషన్ ప్రయోజనాలు..
మూడేండ్ల తర్వాత పశువులు ఎదకు వస్తాయి. ఈ క్రమంలో 7, 8, 9 నెలల్లో కొన్నింటికి గర్భస్రావం అవుతున్నది. దీంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతున్నది. మరో ఏడాది పాటు పాల ఉత్పత్తికి దూరంగా ఉండాల్సి వస్తున్నది. దీనికి తోడు పశుసంపద కూడా తగ్గుతున్నది. వీటన్నింటిని అధిగమించడం కోసం తెలంగాణ ప్రభుత్వం పశువులకు వ్యాక్సినేషన్ అందిస్తున్నది. వైద్యాధికారులు పశువుల దొడ్ల దగ్గరకు వెళ్లి ఆడదూడలను గుర్తిస్తున్నారు. తర్వాత వాటికి వ్యాక్సిన్ వేస్తున్నారు. మరో కొన్ని రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగనుండడంతో గ్రామీణ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రైతులకు ఎంతో మేలు..
ప్రధానంగా ఈ వ్యాక్సిన్ వేయడంతో రైతులకు మేలు జరుగుతున్నది. ఇటీవల చాలావరకు రైతులు మేలుజాతి పశువులను ఎక్కువగా పెంపకం చేపడుతున్నారు. అందులో జెర్సీ, హెచ్ఎస్, గీర్, ఒంగోలు, ముర్ర తదితర జాతులు ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ వేయడంతో ఈ రకాలు పెద్ద ఎత్తున ఉత్పత్తి కానుండడంతో పాల ఉత్పత్తులు పెరుగనున్నాయి.
ముమ్మరంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ..
ఆడ పశువులకు, 3 నుంచి 8నెలల లోపు దూడలను గుర్తించి బ్రూసెల్లా వ్యాక్సిన్ వేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 28,750 ఆడ ఆవు, బర్రె దూడలకుగాను 22,480 దూడలకు వ్యాక్సిన్ వేశాం. జిల్లాలో 42టీంలు పని చేస్తున్నాయి. మరో వారంరోజుల పాటు టీకా పంపిణీ కొనసాగుతుంది. వ్యాక్సిన్తో పశు వృద్ధితో పాటు పాల ఉత్పత్తి పెరుగుతున్నది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– అంజిలప్ప, జిల్లా పశువైద్యాధికారి