కడ్తాల్, ఫిబ్రవరి 6 : పంటల సాగులో రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత సూచించారు. సోమవారం మండల పరిధిలోని చరికొండ గ్రామంలో రైతులు సాగు చేసిన వరి, వేరుశనగ పంటలను ఏవో శ్రీలతతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ వరి పంటలో ప్రస్తుతం ఆశించే తెగుళు,్ల వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని రైతులకు తెలిపారు. పిలకదశ నుంచి మబ్బు చేసే దశలో ఉన్న వరి చేనులో నాచు ఉండటం వల్ల ఎదుగుదల ఆగిపోతుందని, దీని కోసం ఆడపాదడపా పొలాన్ని ఆరబెట్టాలని పేర్కొన్నారు.
పొలంలో చవుడు, జింక్ లోపం వంటి సమస్యలను నివారించడానికి నీరు పెట్టి తీసివేయాలన్నారు. పల్లి పంట సాగులో తొలి పూత దశలో ఎకరానికి 200 కిలోల జిప్సంను వాడితే, ఊడలు బలంగా వచ్చి భూమిలోకి చొచ్చుకుపోతాయని పేర్కొన్నారు. పంటల సాగులో అధికారులు సూచించిన మేరకే రసాయన ఎరువులను వాడాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవో అభినవరెడ్డి, రైతులు దీప్లానాయక్, వెంకట్రెడ్డి, అయిలయ్య, రాములు, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.