రంగారెడ్డి, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల సమరానికి అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధమైంది. ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నది. ఇందుకు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసింది. నగదు అక్రమ రవాణా, మద్యం పంపిణీ ఇతర వాటికి అడ్డుకట్ట వేస్తూ.. గత కొద్దిరోజులుగా తనిఖీలను అధికారులు ముమ్మరం చేశారు. జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లోనూ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.83.41లక్షల నగదుతో కలిపి మొత్తం రూ.4.39కోట్లు విలువజేసే వెండి ఆభరణాలు, మద్యం, డ్రగ్స్ తనిఖీ బృందాలకు పట్టుబడ్డాయి.
అక్రమ రవాణాపై దృష్టి..
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వెలువడనుంది. మే 13న పోలింగ్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో నగదు, మద్యం తదితర రవాణా ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నది. ఓటర్లను ప్రలోభపెట్టడంలో భాగంగా రాజకీయ పార్టీలు నగదు, మద్యం తదితర వాటిని అక్రమ మార్గంలో తరలించకుండా ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఫ్లయింగ్ స్వ్యాడ్, స్టాటిక్స్ సర్వేలైన్స్ బృందాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. కలెక్టరేట్లోని మీడియా సెంటర్ సైతం ఈ బృందాలపై ఎప్పటికప్పుడే ప్రత్యేక పర్యవేక్షణ ఉంచుతున్నది. జిల్లాకు నలుమూలల ప్రధాన రహదారులపై చెక్పోస్టులను ఏర్పాటు చేశారు.
15 రోజుల వ్యవధిలో..
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి తనిఖీలు నిర్వహించి ఎటువంటి రసీదు లేని వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. అలాగే బ్యాంకు లావాదేవీలపై నిఘా ఉంచుతున్నారు. రూ.10లక్షలకు పైగా డబ్బు పట్టుబడిన సందర్భంలో ఆదాయ శాఖ అధికారులకు సమాచారం అందజేస్తున్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలను చూపించి పట్టుబడిన నగదు, బంగారం, వెండి తదితర వాటిని తిరిగి పొందేందుకు జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్ను ఏర్పాటు చేశారు.